coronavirus: మరో ఔషధానికి అనుమతి

జైడస్‌ కాడిల్లాకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది

Updated : 23 Apr 2021 19:21 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న వేళ.. వైరస్‌ను ఎదుర్కొనే మరో ఔషధ వినియోగానికి అనుమతి లభించింది. కరోనా చికిత్సలో వాడేందుకు జైడస్‌ క్యాడిల్‌ తయారుచేసిన ‘విరాఫిన్‌’కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఒకే మోతాదులో వాడే విరాఫిన్‌ యాంటీవైరల్‌ ఇంజక్షన్‌ కొవిడ్‌ చికిత్సలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జైడస్‌ సంస్థ పేర్కొంది. మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు. ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.

వైరస్‌ నిర్ధారణ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు ప్రారంభ దశలోనే ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా వైరల్‌ లోడ్‌ను గణనీయంగా తగ్గించవచ్చని సంస్థ ఎండీ డాక్టర్‌ శార్విల్‌ పటేల్‌ పేర్కొన్నారు. కరోనా రోగులకు క్లిష్టమైన సమయంలో ఈ ఔషధం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు.

మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తుంది..!

కరోనా రోగులకు చికిత్స కోసం ‘పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా 2బీ-విరాఫిన్‌’ ఔషధంపై జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందుకోసం దాదాపు 20 నుంచి 25 కేంద్రాల్లో కరోనా రోగులపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. ఈ ఔషధం తీసుకున్న ఏడు రోజుల్లో 91.15శాతం కొవిడ్‌ రోగుల్లో నెగెటివ్‌ (ఆర్టీపీసీఆర్‌) ఫలితం వచ్చినట్లు ప్రయోగాల్లో గుర్తించింది. అంతేకాకుండా రోగులకు మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ PegIFN ఔషధాన్ని కరోనా రోగులకు ఇవ్వడం ద్వారా వైరస్‌ నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు తీవ్ర సమస్యల నుంచి బయటపడవచ్చని జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. వైరల్‌ లోడును తగ్గించడంలో మిగతా యాంటీ వైరల్‌ ఔషధాలతో పోలిస్తే విరాఫిన్‌ సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. కొవిడ్‌ చికిత్సలో వైద్యుల సిఫార్సు మేరకు దీన్ని వినియోగించవచ్చని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జైడస్‌ క్యాడిలా వెల్లడించింది.

ఇదిలాఉంటే, జైకోవ్-డీ పేరుతో జైడస్‌ క్యాడిలా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కూడా తీసుకురానుంది. ఇందుకోసం దాదాపు 30వేల మందిపై ఇప్పటికే మూడో దశ ప్రయోగాలను కూడా జరిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని