Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

Bharat Ratna: మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించింది.

Updated : 09 Feb 2024 13:57 IST

చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌కు కూడా..

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘భారతరత్న’ (Bharat Ratna) పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు (PV Narasimha Rao), చరణ్‌ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (MS Swaminathan)ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) ‘ఎక్స్‌ ( ట్విటర్‌)’ వేదికగా వెల్లడించారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘‘రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసింది. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసింది’’ అని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌, శాస్త్రవేత్త స్వామినాథన్‌ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

ఏకైక తెలుగు ప్రధాని పీవీ..

పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్‌ 28న వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.

1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకున్న పీవీ.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకోవాల్సి వచ్చింది. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా ఉన్న ఆయన.. ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది, ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్‌ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 5లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. 

ప్రధానిగా తన హయాంలో పీవీ అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయనకు సంగీతం, సినిమా, నాటకాలంటే అమితాసక్తి. భార‌తీయ ఫిలాస‌ఫీ, సంస్కృతి, ర‌చ‌నా వ్యాసాంగం, రాజ‌కీయ వ్యాఖ్యానం, భాష‌లు నేర్చుకోవ‌డం, తెలుగు, హిందీలో క‌విత‌లు రాయ‌డం, సాహిత్యాల‌పై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. తెలుగులో సుప్రసిద్ధ నవల ‘వేయిపడగల’ను ఆయన ‘సహస్రఫణ్‌’ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ 14 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌..

స్వామినాథన్‌ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్‌ సర్జన్‌. మెట్రిక్యులేషన్‌ పూర్తయిన తర్వాత స్వామినాథన్‌ కూడా తండ్రి బాటలోనే మెడికల్‌ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌ కరవును కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం నుంచి తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో స్వామినాథన్‌ విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

ప్రధానిగా 23 రోజులు..

చౌధరీ చరణ్ సింగ్.. డిసెంబర్‌ 23, 1903లో ఉత్తరప్రదేశ్‌లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర్య సంగ్రామంలోకి అడుగుపెట్టారు. మొదట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ (INC) తరఫున చురుగ్గా వ్యవహరించిన ఆయన.. 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరిట సొంతంగా పార్టీని స్థాపించారు. జనతా పార్టీ, జనతా పార్టీ (సెక్యులర్‌)లో పనిచేసి, 1980లో లోక్‌దళ్‌ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు. 1967-68, 1970లో రెండు దఫాలు యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలు పాలయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో హోంశాఖ బాధ్యతలు చూశారు. అలాగే ఆయన హయాంలోనే 1979 జనవరి నుంచి జులై వరకు డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి పనిచేశారు. ఆ వెంటనే 1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ ఐదో ప్రధానిగా సేవలు అందించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. గ్రామాల ఆర్థిక స్థితిగతులకు హాని కలిగించే, రైతులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ఆయనకు ఆరుగురు సంతానం. ఆయన కుమారుడు అజిత్‌ సింగ్‌.. రాష్ట్రీయ లోక్‌దళ్‌ వ్యవస్థాపకుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని