నిమోనియా తగ్గాలని.. మూణ్నెల్ల పాపకు 51 వాతలు

మూఢనమ్మకం మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. పాపకు సోకిన నిమోనియా తగ్గాలని ఆ లేత శరీరంపై 51 సార్లు కాల్చిన ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు.

Published : 05 Feb 2023 04:11 IST

తల్లిదండ్రుల మూఢనమ్మకం మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. పాపకు సోకిన నిమోనియా తగ్గాలని ఆ లేత శరీరంపై 51 సార్లు కాల్చిన ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. పాపం.. ఆ చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షాదోల్‌ జిల్లాలో జరిగింది. సింగ్‌పుర్‌ కథౌటియా గ్రామానికి చెందిన చిన్నారి రుచితా కోల్‌ నిమోనియా బారినపడింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు చూపించారు. అక్కడ చిన్నారి పొట్టపై 51 సార్లు వాతలు పెట్టారు. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో పాప పరిస్థితి మరింత దిగజారాక స్థానిక ఆసుపత్రికి పరుగులు తీశారు. అప్పటికే 15 రోజులు గడిచిపోవడంతో ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై షాదోల్‌ జిల్లా కలెక్టర్‌ వందనా వైద్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నిమోనియాకు ఇలాంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయని, వీటిని కట్టడి చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని