Gaganyaan: వ్యోమగాముల సేఫ్‌ ల్యాండింగ్‌ కోసం.. 48 బ్యాకప్‌ సైట్స్‌

గగన్‌యాన్‌ (Gaganyaan) మిషన్‌లో భాగంగా అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే వ్యోమగాముల సేఫ్‌ ల్యాండింగ్‌ వేళ.. ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా ఇస్రో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

Updated : 05 Mar 2024 14:22 IST

దిల్లీ: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ (Gaganyaan). దీనిలో నలుగురు వ్యోమగాములు (Astronauts) అంతరిక్షంలోకి వెళ్లి.. మూడు రోజుల తర్వాత భూమి మీదకు వస్తారు. ఈ క్రమంలో వారి సురక్షిత ల్యాండింగ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా 48 బ్యాకప్‌ సైట్లను గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) వెల్లడించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

‘‘గగన్‌యాన్‌ (Gaganyaan) యాత్రలో భాగంగా మా ప్లాన్‌ ప్రకారం వ్యోమగాములతో కూడిన మాడ్యూల్‌ అరేబియా సముద్రంలో దిగాల్సి ఉంది. వారిని రక్షించేందుకు సిబ్బంది అక్కడ సిద్ధంగా ఉంటారు. ఈ ప్రణాళికలో ఏ చిన్న మార్పుకైనా సిద్ధంగా ఉండే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అంతర్జాతీయ జలాల్లో 48 బ్యాకప్‌ సైట్లను గుర్తించాం’’ అని ఇస్రో సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఆ కథనాలు పేర్కొన్నాయి. అంతా అనుకున్నట్టే జరిగితే.. ఆ మాడ్యూల్ భారత జలాల్లో దిగుతుందని తెలిపారు.

అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చే విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోలేమని, అందుకే ల్యాండింగ్‌కు అవకాశం ఉన్న పాయింట్లను గుర్తించినట్లు తెలిపారు. మిషన్‌లో చిన్నపాటి వేరియేషన్‌ కూడా వందల కిలోమీటర్ల దూరంలో ల్యాండింగ్‌ కారణమవుతుందని చెప్పారు. ప్రస్తుతం గగన్‌యాన్‌ (Gaganyaan) పనుల్లో పురోగతి ఆశాజనకంగా ఉందన్నారు. ఈ ఏడాది కనీసం ఒక్క మానవ రహిత యాత్ర అయినా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే.. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ(Modi) ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని