COVID-19 Subvariant JN.1: ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం: కొత్త ఉపరకంపై వైద్యులు

దేశంలో కొత్తగా వెలుగు చూసిన కొవిడ్‌-19 ఉపరకం జేఎన్‌.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పలువురు వైద్యులు తెలిపారు. 

Published : 22 Dec 2023 02:17 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కొవిడ్‌-19 (Covid-19) కొత్త వేరియంట్ జేఎన్‌.1 (JN.1) కేసులు వెలుగుచూడటంతో ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో జేఎన్‌.1 వేరియంట్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆరోగ్య రంగ నిపుణులు, వైద్యులు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు ఈ ఉపరకంపై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

‘‘సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లో కొత్తగా వచ్చిన ఉపరకంతో ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు, శ్వాసకోశ సంబంధిత వైరస్‌లు తరచుగా రూపాంతరం చెందుతుంటాయి. భారత్‌లోని ప్రజలు ఇప్పటికే కరోనా ఉపరకం వైరస్‌లను ఎదుర్కొన్నారు. చాలా మంది రెండు డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. కాబట్టి, కొత్తగా వెలుగు చూసిన ఉపరకంతో ఆందోళన చెందాల్సిన రీతిలో ముప్పు ఉండదు. కానీ అప్రమత్తత అవసరం’’ అని సీనియర్‌ ప్రజారోగ్య వైద్య నిపుణుడు డాక్టర్‌ చంద్రకాంత్ లహారియా తెలిపారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకపోవడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. 

నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్‌డీసీ ఔషధాలు వాడొద్దు: కేంద్రం

‘‘జేఎన్‌.1 ఉపరకం.. ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని బీఏ.2.8.6 శాఖకు చెందినది. ఇది మనిషి రోగనిరోధక వ్యవస్థను అధిగమిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, ఇప్పటి వరకు జేఎన్‌.1 సోకిన వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు ఎలాంటి సమాచారం లేదు. దీని గురించి ఆందోళన అవసరంలేదు’’ అని హైదరాబాద్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ కార్తిక్‌ వేదుల తెలిపారు. 

కొత్త ఉపరకానికి చెందిన ప్రధాన వేరియంట్‌లో 35 అమినో యాసిడ్‌ పరివర్తనాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక దాని సాయంతో వైరస్‌ మనిషి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వైరాలజి ప్రొఫెసర్‌ దీపక్‌ సెహగల్‌ వెల్లడించారు. ‘‘జేఎన్‌.1 ఉపరకం ప్రభావం అధికంగా ఉంటుందనేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలులేవు. గత వైరస్‌ల లక్షణాలే ఇందులోనూ ఉన్నాయి. కాబట్టి, ఆందోళన చెందకుండా ప్రజారోగ్య వ్యవస్థను, ప్రజలను అప్రమత్తం చేసి, స్వీయ నిబంధనలు పాటిస్తే.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని