Ujjwala scheme: పొగచూరుతున్న ‘ఉజ్వల’..!

పేద మహిళలను కట్టెల పొయ్యి అవస్థల నుంచి కాపాడటానికంటూ కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల వెలుగులు మసకబారుతున్నాయి. మళ్లీ పేదల ఇళ్లలోని కట్టెల పొయ్యిలు రాజుకొంటున్నాయి. రెండేళ్లగా ఏటా కనీసం అరడజను సార్లు గ్యాస్‌ సిలిండర్ల ధరలను పెరగడం ఉజ్వల

Updated : 13 Jul 2022 12:42 IST

 భారీ ధరల కారణంగా రీఫిల్స్‌ కొనుగోలు చేయని లబ్ధిదారులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

పేద మహిళలను కట్టెల పొయ్యి అవస్థల నుంచి కాపాడడానికంటూ కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల వెలుగులు మసకబారుతున్నాయి. మళ్లీ పేదల ఇళ్లలో కట్టెల పొయ్యిలు రాజుకొంటున్నాయి. రెండేళ్లుగా ఏటా కనీసం అర డజను సార్లు గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరగడం ఉజ్వల వినియోగదారులను బెంబేలెత్తించింది. ప్రభుత్వం ఫ్రీగా ఇస్తామన్న గ్యాస్‌బండ కాస్తా వారి పాలిట గుదిబండగా మారే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి కరోన వ్యాప్తి, ఆ తర్వాత కొన్ని నెలల పాటు కూలీల వంటి చిరుజీవులకు ఉపాధి లభించకపోవడంతో ఆదాయాలు లేవు. మరో వైపు సిలిండర్‌ ధర రూ.1000 దాటి పోయింది. దీంతో వచ్చే ఆదాయంలో సింహభాగం సిలిండర్లకే వెచ్చిస్తే మిగిలేదేంటని వారు భావిస్తున్నారు. ఫలితంగా ప్రతినెల కొన్ని లక్షల ఉజ్వల సిలిండర్లు రీఫిల్లింగ్‌కు నోచుకోవడంలేదు. 

నాటికీ నేటికి తేడా..

2016 మేలో ఈ పథకం ప్రారంభ సమయంలో ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యి ఉచితంగా ఇచ్చింది.  దాదాపు 8 కోట్ల మంది లబ్ధిదారులకు వీటిని అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకొంది. పథకం ప్రారంభంలో సిలిండర్‌ ధర రూ.419.15 (దిల్లీ ఎన్‌సీఆర్‌) ఉంది. ప్రస్తుతం అది రూ.1062కు చేరింది. ఆయా రాష్ట్రాలను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి. ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు రూ.200 రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయినా లబ్ధిదారులు సిలిండర్‌ కొనుగోలుకు జంకుతున్నారు. హైదారాబాద్‌లో చూస్తేనే ఈ ఏడాది ప్రారంభం నుంచి  ఇప్పటి వరకు గ్యాస్‌ బండ ధర రూ.170కి పైగా పెరిగింది. 2021లో ఈ పథకం రెండో విడతలో మరో కోటి కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

90లక్షల సిలిండర్లు ఖాళీగా..

ఉజ్వల స్కీం కింద కనెక్షన్లు పొందిన వారిలో 90 లక్షల మంది గత ఆర్థిక సంవత్సరం ఒక్కసారి కూడా సిలిండర్‌ను రీఫిల్‌ చేయించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కోటి మంది లబ్ధిదారులు ఏడాది మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే రీఫిల్‌ చేయించినట్లు ఇంధన సంస్థల లెక్కలు చెబుతున్నాయి. ఆర్టీఐ ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ గౌర్‌ ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలకు దరఖాస్తు చేయగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలివి. ఉజ్వల వినియోగదారులు మొత్తం సగటున ఏటా కేవలం 3.66 సార్లు మాత్రమే రీఫిల్‌ చేయించుకొంటున్నట్లు సాక్షాత్తు ప్రభుత్వమే లోకసభకు వెల్లడించడం పరిస్థితిని తెలియజేస్తోంది.

కట్టెల పొయ్యి వినియోగంలో ఈ రాష్ట్రాలు టాప్‌..

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం చాలా రాష్ట్రాల్లో 98శాతం కుటుంబాలకు ఎల్‌పీజీ, ఇతర శుద్ధ ఇంధన కనెక్షన్లు ఉన్నాయి. వాటి వినియోగం 80శాతం కుటుంబాల్లోనే జరుగుతోంది. 2019-20 లెక్కల ప్రకారం పశ్చిమబెంగాల్‌లో 40.2 మాత్రమే శుద్ధ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. రాజస్థాన్‌ (41.4), అస్సాం (42.1),యూపీ (49.5), హిమాచల్‌ ప్రదేశ్‌ (51.7), ఉత్తరాఖండ్‌ (59.2), హరియాణా (59.5), మణిపూర్‌ (70.4), కేరళ (72.1), పంజాబ్‌ (76.7), సిక్కిం (78.4), కర్ణాటక (79.7), మహారాష్ట్ర (79.7) వినియోగం ఉంది.

తిరిగి పాత పొయ్యికే మొగ్గు..

ఉజ్వల పథకం ప్రారంభించిన రెండేళ్ల తర్వాత 2018లో ది రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపాసినేట్‌ ఎకనామిక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్య ప్రదేశ్‌లో ఉజ్వల వినియోగదారుల్లో 85శాతం మంది కట్టెల పొయ్యిలను ఇంకా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఆ మరుసటి ఏడాది కాగ్‌ ఇచ్చిన నివేదికలో కూడా ఉజ్వల కింద 3.21 సగటు రీఫిల్స్‌ మాత్రమే అవుతున్నాయని పేర్కొన్నారు. 2020లో ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌’ లెక్కల ప్రకారం 22శాతం మంది రీఫిల్స్‌కు ముందకు రావడంలేదు. 5 నుంచి 7 శాతం మందికి తొలి రీఫిల్‌ సబ్సిడీ అందలేదని తేలింది. ఇక సిలిండర్‌ కొనుగోలు సమయంలో మొత్తం చెల్లిస్తే తర్వాత రాయితీ మొత్తం ఖాతాలో పడుతుంది. దీంతో ఉజ్వల వినియోగదారులు తొలుత కనీసం రూ.1000కి పైగా వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాయితీ ఖాతాలో పడుతుంది.

ఇక గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో వసూళ్లు కూడా వీరికి భారంగా మారాయి. ఒక్కో సిలిండర్‌కు అనధికారికంగా రూ.30 నుంచి 50 వరకు వసూలు చేయడం కూడా ఇబ్బందికరంగా మారింది. 

పునరుజ్జీవం అవసరం..

భారత్‌లో కట్టెల పొయ్యి వినియోగం కారణంగా ఏటా కనీసం 5 లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బెర్కెలీలోని గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొఫెసర్‌ కిర్క్‌ స్మిత్‌ బృందం పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ వినియోగం పెంచడం చాలా అవసరం. అదే సమయంలో కట్టెల కోసం అడవుల నరికివేత కూడా తగ్గుతుంది. 

* ఉజ్వల పథకం వచ్చాక 2019లో కనీసం 1.5లక్షల మంది ప్రాణాలు కాపాడినట్లు ప్రభుత్వం అంచనావేసింది. కాలుష్యం కారణంగా జరిగే మరణాల్లో 13శాతం తగ్గుదలతో సమానం. వీటిని కొనసాగించాలంటే దేశంలోని 6,00,000 గ్రామాల్లోని ఇళ్లలో కట్టెల పొయ్యిల వినియోగాన్ని తగ్గించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని