Tollywood: ఈ డైరెక్టర్లు గ్యాప్‌ ఇచ్చినా.. హిట్‌ కొట్టారు!

సినిమాల్లో జయాపజయాలు సహజం. తమ సినిమా హిట్‌ అయినా.. ఫ్లాప్‌ అయినా మరో మంచి సినిమా తీసేందుకు దర్శకులు తహతహలాడుతారు. అయితే, కొందరు దర్శకులకు మాత్రం గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. మరో సినిమా చేయడానికి చాలా కాలమే పట్టింది. కాగా..

Published : 22 Oct 2021 10:11 IST

సినిమాల్లో జయాపజయాలు సహజం. తమ సినిమా హిట్‌ అయినా.. ఫ్లాప్‌ అయినా మరో మంచి సినిమా తీసేందుకు దర్శకులు తహతహలాడుతారు. అయితే, కొందరు దర్శకులకు మాత్రం గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. మరో సినిమా చేయడానికి చాలా కాలమే పట్టింది. కాగా.. వారంతా ఈ ఏడాదిలోనే సినిమాలు విడుదల చేసి హిట్‌ కొట్టడం విశేషం. మరి ఆ దర్శకులు ఎవరో చూద్దామా..

బొమ్మరిల్లు భాస్కర్‌

తన తొలి సినిమా టైటిల్‌నే పేరులో చేర్చుకున్న దర్శకుడు.. బొమ్మరిల్లు భాస్కర్‌. ఐదేళ్ల తర్వాత ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రంతో హిట్‌ సాధించాడు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. భాస్కర్‌ తొలి చిత్రం ‘బొమ్మరిల్లు’ 2006లో విడుదలై బ్లాక్‌బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘పరుగు’, ‘ఆరెంజ్‌’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలు తెరకెక్కించగా.. అవి మ్యూజిక్‌ పరంగా మెప్పించినా.. సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో దర్శకుడికి అవకాశాలూ రాలేదు. చివరగా 2016లో తమిళ్‌లో బెంగళూరు ‘నాట్కాల్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు.


శ్రీకాంత్‌ అడ్డాల

2008లో ‘కొత్తబంగారు లోకం’ చిత్రంతో దర్శకుడిగా పరిచమైన శ్రీకాంత్‌ అడ్డాలకి.. సకుటుంబంగా చూసే సినిమాలు తీస్తాడన్న పేరుంది. ఆయన తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు అలాంటివే మరి. 2016లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ తర్వాత చాలా గ్యాప్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాల.. ఈసారి తన  శైలికి భిన్నంగా తమిళ చిత్రం ‘అసురన్‌’ను తెలుగులో ‘నారప్ప’గా వెంకటేశ్‌తో రీమేక్‌ చేశారు. ఆ చిత్రం గత జులై 20న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడులైంది. సినిమాలో వెంకటేశ్‌ నటనకు ప్రశంసలు లభించాయి.


గోపిచంద్‌ మలినేని

మాస్‌.. యాక్షన్‌ సినిమాలు తెరకెక్కించడంలో గోపిచంద్‌ మలినేని దిట్ట. ఈ విషయాన్ని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘క్రాక్‌’ చిత్రం మరోసారి నిరూపించింది. 2010లో ‘డాన్‌ శీను’ చిత్రంతో దర్శకుడిగా మారిన గోపీచంద్‌.. ‘బాడీగార్డ్‌’, ‘బలుపు’, ‘పండగ చేస్కో’ చివరిగా 2017లో ‘విన్నర్‌’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఈ ఏడాదే రవితేజతో ‘క్రాక్‌’ చిత్రం తీసి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు.


సంపత్‌ నంది

తన రెండో ప్రయత్నంలోనే రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని కొట్టేశాడు దర్శకుడు సంపత్‌ నంది. 2010లో ‘ఏమైంది ఈ వేళ’ చిత్రాన్ని తెరకెక్కించిన సంపత్‌.. 2012లో రామ్‌ చరణ్‌ ‘రచ్చ’కు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 2015లో ‘బెంగాల్‌ టైగర్‌’, 2017లో ‘గౌతమ్‌ నంద’ సినిమాలకు దర్శకత్వం వహించాడు. నాలుగేళ్ల తర్వాత మరోసారి హీరో గోపీచంద్‌ కాంబినేషన్‌లో ‘సీటిమార్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్‌ డ్రామా జానర్‌లో వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది.


అనుదీప్‌ కేవీ

కరోనా, లాక్‌డౌన్‌తో మానసికంగా కుంగిపోయిన ప్రేక్షకులను ‘జాతిరత్నాలు’ చిత్రం కడుపుబ్బా నవ్వించింది. మార్చిలో విడుదలైన ఈ చిత్రానికి అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహించారు. 2016లో ‘పిట్టగోడ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న బడ్జెట్‌గా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్నే అందుకుంది. మళ్లీ ఐదేళ్ల తర్వాత అనుదీప్‌ ‘జాతి రత్నాలు’ సినిమాతో హిట్‌ అందుకున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని