Kiran Kumar Reddy: మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిన బాలకృష్ణ.. కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానమిది!

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సందడి చేశారు.

Published : 26 Nov 2022 01:44 IST

హైదరాబాద్‌: మూడు రాజధానుల విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) స్పందించారు. ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable 2) కార్యక్రమ వేదికగా నటుడు నందమూరి బాలకృష్ణ ఆ ప్రస్తావన తీసుకురాగా కిరణ్‌కుమార్‌ సమాధానమిచ్చారు. ‘‘అసెంబ్లీ జరిగేటప్పుడు అధికారులంతా అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్‌ అంటే కేబినెట్‌, సెక్రటేరియట్‌కు సంబంధించివారు. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి, వాళ్ల సూచన మేరకు కోర్టులో ఏం ఫైల్‌ చేయాలో అనుమతులు తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో మూడూ కలిసి ఉంటేనే అనుకూలంగా ఉంటుంది’’ అని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు కిరణ్‌కుమార్‌తోపాటు రాజ్యసభ ఎంపీ సురేశ్‌రెడ్డి, నటి రాధిక హాజరై, పలు విశేషాలు పంచుకున్నారు.

నేను బతికుండటం వల్లే సీఎం అయ్యా: కిరణ్‌కుమార్‌

‘‘ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు చేసిన తర్వాత చీఫ్‌ విప్‌ అయి, తర్వాత స్పీకర్‌ అయ్యాను. బతికున్నాను కాబట్టి అప్పుడు సీఎం అయ్యాను. బతికుండటం వల్లే రాష్ట్ర విభజన చూడాల్సి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డిగారు వెళ్లే హెలికాఫ్టర్‌లో నేనూ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ ముగిసే చివరి క్షణాల్లో రాజశేఖర్‌రెడ్డి నాకు ఫోన్‌ చేశారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి ఎవరిని ఎంపిక చేస్తున్నావ్‌? అని అడిగారు. నాగం జనార్థన్‌రెడ్డి పేరుని ప్రతిపక్ష నాయకుడు సూచించారని చెప్పా. ‘శోభానాగిరెడ్డి’ని తీసుకోండి అని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అకౌంట్స్‌ కమిటీసహా మూడు కమిటీలను పెండింగ్‌లో పెడతానని, చర్చించుకున్న తర్వాత వివరాలు ప్రకటిస్తానని చెప్పా. మరుసటి రోజు ఆ అనౌన్స్‌మెంట్‌ ఉండటంతో ఆయనతో హెలికాఫ్టర్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకొన్నా. నేను కార్యాలయంలో ఉండగా నాకు ఫోన్‌ వచ్చింది. ‘ఎక్కడున్నారు మీరు?.. రాజశేఖర్‌రెడ్డిగారు రాలేదా’ అని ప్రశ్నించారు. ఎప్పుడో బయలుదేరారు కదా అనుకొని నేనే అక్కడి ఆఫీసుకు ఫోన్‌ చేసి సీఎంగారు ఇంకా చేరలేదట.. ఏమైందో తెలుసుకోండి అని చెప్పా’’ 

రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న పోయినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంతే బాధపడ్డా. నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. ప్రస్తుతం ఉంటోంది హైదరాబాద్‌లోనే. రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే నా కోరిక. ఇప్పుడు విచారించాల్సిన అవసరంలేదు అంతా సవ్యంగానే ఉంది’’ అని కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని