Chiranjeevi: డైలాగ్‌ లేకుండా చిరంజీవి సీన్‌.. ఆ మాటకు షాకైన అశ్వనీదత్‌

Chiranjeevi: చూడాలని ఉంది చిత్రంలో చిరంజీవి-అంజలా ఝవేరిల మధ్య వచ్చే రైల్వేస్టేషన్‌ లవ్‌ సీన్‌ గురించి దర్శకుడు గుణశేఖర్‌ ఆసక్తికర విషయాన్ని ఇటీవల పంచుకున్నారు.

Updated : 04 Apr 2023 17:58 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా గుణశేఖర్‌ (Gunashekar) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని ఉంది’ (Choodalani Vundi). అశ్వనిదత్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో చిరు-అంజల ఝవేరిల మధ్య వచ్చే రైల్వేస్టేషన్‌ లవ్‌ చాలా స్పెషల్‌గా ఉంటుంది. చిరు, అంజలిల మధ్య డైలాగ్స్‌ లేకుండా కేవలం హావభావాలతో ఆ సీన్‌ను తెరకెక్కించి అలరించారు గుణశేఖర్‌. తాజాగా ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సీన్‌ వెనుక ఉన్న ఆసక్తకర విషయాన్ని ఆయన పంచుకున్నారు.

‘‘రైల్వేస్టేషన్‌లో ఆ లవ్‌ సీన్‌ దాదాపు పది నిమిషాలు ఉంటుంది. చిరంజీవిగారికి అసలు డైలాగ్‌లు ఉండవు. ఆయన స్టేషన్‌లో చైర్‌ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు. చిరంజీవికి డైలాగ్‌ లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడపటం మామూలు విషయం కాదు. అలాంటిది అంత సేపు షూట్‌ చేశాం. ఈ సన్నివేశం తీయడానికి నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కావాలని నేను అడిగా. నిర్మాత అశ్వనిదత్‌(Ashwini Dutt)గారు షాకైపోయారు. ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్‌ పెద్దది. అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. మూడు రోజులు చిరంజీవిగారిని పెట్టుకుని షూట్‌ చేయడం చాలా కష్టం. పైగా ఆయనతో షూటింగ్‌ అంటే రైల్వేశాఖ కూడా అనుమతి ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ షూటింగ్‌ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది. రైళ్లు ఆగిపోతాయి. సమయాలు మారిపోతాయి. అతి కష్టమ్మీద అనుమతి లభించింది. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా చాలా మంది రైళ్లు ఎక్కకుండా స్టేషన్‌లోనే ఆగిపోయారు ’’ అని గుణశేఖర్‌ చెప్పుకొచ్చారు.

చిరుకు జోడీగా అంజలి ఝవేరితో పాటు, సౌందర్య కూడా నటించింది. ప్రకాశ్‌రాజ్‌ ప్రతినాయకుడిగా మెప్పించారు. ఇక మణిశర్మ (Mani Sharma) అందించిన ప్రతి పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ‘రామ్మా చిలకమ్మా’ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. చిరంజీవికి ఇష్టంలేకపోయినా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని కాదని, ఈ పాట ఉదిత్‌ నారాయణతో పాడించారు మణిశర్మ. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరినీ ఆ పాట అలరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని