Alitho Saradaga: నా అన్నయ్య రాముడిలాంటోడు

ప్రేక్షకుల అభిమానానికి హద్దులు లేనట్లే.. తమ నట ప్రతిభకు హద్దులు లేవని నిరూపించుకున్నారు ఈ అపూర్వ సహోదరులు. బాలనటులుగా తెలుగు తెరపై అడుగుపెట్టారు. ఎన్నో సీరియల్స్‌, సినిమాల్లో నటించి బుల్లితెరతో పాటు...

Updated : 05 Nov 2023 15:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేక్షకుల అభిమానానికి హద్దులు లేనట్లే.. తమ నటనా ప్రతిభకు హద్దులు లేవని నిరూపించుకున్నారు ఈ అపూర్వ సహోదరులు. బాలనటులుగా తెలుగు తెరపై అడుగుపెట్టారు. ఎన్నో సీరియల్స్‌, సినిమాల్లో నటించి బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న సోదరులు కౌశిక్‌, బాలాదిత్య ‘ఆలీతో సరాదా’లో పంచుకున్న విశేషాలు మీకోసం..

ఇద్దరిలో మొదట పరిశ్రమకి వచ్చిందెవరు?

కౌశిక్‌: నేనే.. ‘కిట్టిగాడు’తో బాలనటుడిగా వచ్చాను.

బాలాదిత్య: ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ సినిమాతో నేను ఎంట్రీ ఇచ్చాను. ఈ నెలతో థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ.

మీ ఫ్యామిలీలో ఎంత మంది?

బాలాదిత్య: మేమిద్దరం అబ్బాయిలం. నాకు ఓ పాప. అన్నయ్య, వదినలకు బాబు.

కౌశిక్‌: అమ్మకు ఆడపిల్లలంటే ఇష్టం. నేను పుట్టిన అయిదేళ్లకు వీడు పుట్టాడు. అమ్మాయి పుడుతుందని కోరుకుంది మా అమ్మ. అందుకే వీడు పుట్టాక రెండు గంటల వరకు మొహం చూడలేదు.

బాలాదిత్య: అందుకే అన్నయ్య ఓన్‌ కొడుకు, నేను లోన్‌ కొడుకుని అని అమ్మతో ఇప్పటికీ అంటుంటాను.

అప్పట్లో బిజీ చైల్డ్‌ ఆర్టిస్ట్‌వి కదా? ఎన్ని సినిమాలు చేశావు?

బాలాదిత్య: తరుణ్‌ తర్వాత నేను బాలనటుడిగా ప్రవేశించాను. తర్వాత తరంలో తేజ, తనీష్‌ వచ్చారు. నేను చేస్తున్న సమయంలో పోటీ తక్కువగానే ఉండేది. బాలనటుడిగా ఆరు భాషల్లో 41 సినిమాలు చేశాను.

ఇంగ్లిష్‌లో బెన్‌కింగ్‌స్లే ‘డివోర్స్‌’ సినిమాలో కూడా చేశాను. హీరోగా పది చిత్రాలు చేశాను.

నటుడిగా బిజీగా ఉన్నసమయంలో రచయితగా ఎందుకు మారాల్సివచ్చింది?

బాలాదిత్య: కాలేజీ రోజుల నుంచే పాటలు రాసేవాణ్ని. మొదటి సినిమా ‘చంటిగాడు’కి టైటిల్‌ సాంగ్‌ రాశాను. జయగారు బాగుందన్నారు. కానీ హీరోగా చేస్తూ ఇప్పుడే పాటలు ఎందుకన్నారు. కానీ, ఆ తర్వాత సినిమాలో పాట రాసే అవకాశం ఇచ్చారు. మీ సినిమాలో ‘గుండమ్మగారి మనవడు’లో ‘ఒక్కసారి..ఒక్కసారి’ అనే పాట రాశాను.

మధ్యలో గ్యాప్‌ ఎందుకు వచ్చింది?

బాలాదిత్య: మొదటి సినిమా ‘చంటిగాడు’ చేసేనాటికి ఇంటర్మీడియట్‌ అయిపోలేదు. మా అమ్మ నేను చదువాలని పట్టుపట్టింది. అప్పుడు బిట్స్‌ పిలానిలో చదువుకునే అవకాశం కూడా వచ్చింది. ఎన్టీఆర్‌, తరుణ్‌ లాంటి యంగ్‌ హీరోస్‌ సినిమాల్లోకి ప్రవేశిస్తున్న సమయం అది. ఈ సమయం దాటిపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుందేమోనని కొంచెం తొందరపడ్డాను. కానీ ‘1940 ఓ గ్రామం’ సినిమా అయిపోయాక కావాలనే విరామం తీసుకున్నాను. అమ్మకు మాటిచ్చాను. ఇప్పుడు చదువుకోపోతే మళ్లీ అవకాశం రాదని విరామం తీసుకున్నాను. అందుకే ఆ తర్వాత మూడేళ్లు చదివి సీఏ వాళ్లకు ఫ్యాకల్టీగా చేశాను. ఆ తర్వాత ‘ఈటీవీ ఛాంపియన్‌’తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాను. ప్రస్తుతం సీరియల్స్‌, ఓటీటీ సినిమాలు చేస్తున్నాను.

నాన్నగారు ఏం చేస్తున్నారు?

కౌశిక్‌: మొన్నటి దాకా ఐఏఎస్‌ అధికారులకు శిక్షణిచ్చేవారు. కొవిడ్‌ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు.

నాన్నగారి మొదటి సినిమా?

కౌశిక్‌: బాపుగారి ‘స్నేహం’ చిత్రంలో మొదటిసారిగా నటించారు. ఆ తర్వాత ‘ప్రేమలు-పెళ్లిళ్లు’, జంధ్యాల ‘ముద్దమందారం’, ‘నాలుగుస్తంభాలాట’, ఆ తర్వాత ‘ప్రేమించుపెళ్లాడు’ సినిమాల్లో చేశారు. చివరగా ‘అరుంధతి’లో అనుష్కకు తండ్రిగా చేశారు. బాపుగారి ‘భాగవతం’లోనూ నాన్న చేశారు. ఇప్పటికీ నాన్న ‘స్నేహం శంకర్‌’గానే గుర్తుండిపోయారు. అంతలా బాపుగారు ఆయన జీవితంలో కీలకపాత్ర పోషించారు. ‘భాగవతం’లో నేను శ్రవణకుమారిడిగా చేశాను. బాపుగారి దర్శకత్వంలో చేయడం అదృష్టం.

బాపుగారి దర్శకత్వంలో చేయడం అదృష్టం కదా?

బాలాదిత్య: బాపుగారి పిలుపుతో నాన్న బ్యాంకులో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి సినిమాల్లోకి వచ్చేశారు. ‘స్నేహం’లో బాపుగారు రాసిన ఉత్తరాన్ని నాన్న ఇప్పటికీ దాచుకున్నారు. నాన్న పెళ్లిపత్రికను బాపుగారే రాసి ఇచ్చారు.

ఇండస్ట్రీలోకి ఎలా వచ్చావు?

కౌశిక్‌: హిందుపేపర్‌లో టామ్‌ సాయర్‌ ‘మార్క్ ట్వైన్‌’ని తెలుగులో చేస్తున్నామని, కుర్రాళ్లు కావాలనే ప్రకటన వచ్చింది. నాన్నకు చెబితే ఆడిషన్‌కు తీసుకెళ్లారు. దాదాపు వెయ్యి మందికి పైగా పోటీకి వచ్చారు. నాలుగైదు రౌండ్లు పూర్తయ్యాక అంతమందిలో నన్ను ‘కిట్టుగాడి’గా తీసుకున్నారు. ఆ సీరియల్‌కు నంది అవార్డు వచ్చింది.

తనక్కూడా అవార్డు కావాలని బాలాదిత్య ఏడ్చారంట?

బాలాదిత్య: అవును. నాన్న ఏం కొన్నా, ఏది తెచ్చినా ఇద్దరికీ తెచ్చేవారు. అవార్డు మాత్రం అన్నయ్యకి ఒక్కడికే ఇచ్చారు. ‘నువ్వు నటిస్తే నీకూ ఇస్తారు’ అని నాన్న చెప్పారు. రేలంగి నర్సింగరావు చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌ అందులో హీరో. జూన్‌ 13నే బాలనటుడిని అయ్యాను.  ‘చంటిగాడు’తో మళ్లీ అదే రోజున హీరోగా మారాను. అందుకే నాకది ప్రత్యేకమైన రోజు.

జీవితంలో బాధపడిన సందర్భం ఉందా?

కౌశిక్‌: ‘అందం’ అనే ఒక సినిమాలో హీరోగా చేశాను. సినిమా థియేటర్‌ దాకా వెళ్లి షో పడుతుందనగా ఆగిపోయింది. 2002, మే 9న నాగార్జున ‘సంతోషం’తో పాటు నా సినిమా కూడా విడుదలవ్వాల్సింది. నిర్మాత ఎమ్మెస్‌ రాజుకి, డిస్ట్రిబ్బూటర్‌కి ఏదో గొడవచ్చి ఆగిపోయింది. అది కోలుకోలేని దెబ్బ. ఆగిపోయిన సినిమా హీరో అనే ముద్ర పడిపోయింది. సినిమా బయటకొస్తే బాగుండేది. పాటలు పెద్ద హిట్టు. సినిమా ఆగిపోవడంతో మానసికంగా కుంగిపోయాను. అలా రెండేళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యాను. మళ్లీ ఈటీవీతోనే సీరియల్‌ హీరోగా రీఎంట్రీ ఇచ్చాను. 30 సీరియళ్లలో నటించాను.

ప్రేమ పెళ్లా? పెద్దలు కుదర్చిందా?

కౌశిక్‌: పెళ్లిచూపులకి వెళ్లినప్పుడు ఆ అమ్మాయికి నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటానని స్పష్టంగా చెప్పేశాను. రూపాయి వచ్చినా ఇక్కడే, లక్ష వచ్చినా ఇక్కడే అని చెప్పాను. వాళ్లు మాకు కుదరదని చెప్పేశారు. అదే రోజు ఎదురింటిలో మా ఆవిడకు కూడా పెళ్లి చూపులు అయ్యాయి. ఆమెది నార్తిండియా. ఆవిడ కూడా పెళ్లి చూపుల్లో నాలాంటి సమాధానమే ఇవ్వడంతో ఆమెదీ ఆగిపోయింది. వాళ్ల అమ్మానాన్న అదే రోజు సాయంత్రం వచ్చి పెళ్లి చూపుల గురించి మాట్లాడారు. అలా మొదలై చివరకు పెళ్లి దాకా వచ్చింది.

బాలాదిత్య: నాకు 9 పెళ్లి చూపులు జరిగాయి. పదో పెళ్లి చూపులకు నేరుగా వెళ్లకుండా ఫోన్‌లోనే మాట్లాడాను. మనిషిని బట్టే వ్యక్తిత్వం ఉంటుంది కానీ వృత్తిని బట్టి ఉండదని చెప్పింది. ఆవిడన్న మాట బాగా నచ్చింది. మనిషిని మనిషిలా గౌరవించాలి కానీ, వ్యక్తులు చేసే వృత్తిని బట్టి మనిషిని నిర్ణయించకూడదు. ఆవిడ విషయంలో నేను లక్కీ.

విజయవాడ దగ్గర కంచికచర్ల ఊరు ఎందుకు వెళ్లావు?

కౌశిక్‌: ఆ ఊర్లో ఒకమ్మాయికి చూపు కనిపించదు. కానీ నా సీరియల్స్‌ అన్ని క్రమం తప్పకుండా వింటుంది. వాళ్ల నాన్న అక్కడ సర్పంచ్‌. ఆవిడను కలిసేందుకు వెళ్లినప్పుడు జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. హేమంత్‌ నాయుడు అని మరో అబ్బాయి నా పుట్టినరోజు, పెళ్లిరోజులకు అనాథాశ్రమాలకు వెళ్లి వేడుక చేస్తాడు. బుల్లితెర సూపర్‌ స్టార్‌ కౌశిక్‌ అని సోషల్ మీడియాలో పెడుతుంటాడు. ఇలాంటి అభిమానులుండటం అదృష్టమే.

సోషల్‌ మీడియాను వదిలేయడానికి కారణం ఏమిటి?

కౌశిక్‌: ప్రతి వారు ఇంకొకరిని కామెంట్ చేయడం, శృతిమించి మాట్లాడటం, గొడవపడటం ఇవేవీ నచ్చట్లేదు. అందుకే వదిలేశాను.

శోభన్‌బాబు మెచ్చుకున్నారంట?

బాలాదిత్య: జనవరి 14న ఆయన పుట్టినరోజు. క్రమశిక్షణలో ఆయన తర్వాత ఎవరైనా. నేనంటే బాగా ఇష్టం. ‘మా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు రా. వాళ్లకు నిన్ను చూపించాలి. నీలా ఉండమని చెప్పాలి’ అని మెచ్చుకున్నారు. ఆరోజు రాత్రి ఇంటికి పిలిపించుకుని ఓ పళ్లబుట్ట ఇచ్చి మంచి నటుడివి అవుతావని రాసిచ్చారు. ఇప్పటికీ ఉందా కాగితం.

రంభ నీ మీద ఫిర్యాదు చేసిందంట?

బాలాదిత్య: రంభక్కను నేనేమి అనలేదు. కానీ ఓ సరదా సంఘటన గురించి చెప్పుకోవాలి. (నవ్వులు) ఈ అక్క అని పిలవడంపై ఓ జోక్‌ ఉంది. జయప్రదను ఓసారి వెళ్లొస్తాను ఆంటీ అని చెప్పాను. అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి.. ‘రోజా, రమ్యకృష్ణ, రంభను ఏమని పిలుస్తావురా?’ అని అడిగింది. ‘అక్క’ అని అంటానన్నాను. ‘మరి నన్ను మాత్రం ఆంటీ అని ఎందుకు పిలుస్తావురా’ అని సరదాగా ప్రశ్నించింది. రంభక్క ఓ రోజు డైలాగ్స్‌ చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే ఆ డైలాగ్స్‌ అన్ని చెప్పేశాను. దాంతో ఆమె మా అమ్మ దగ్గరికొచ్చి ‘మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కెమెరా వెనకేమో ప్రశ్నలతో చంపుతున్నాడు. కెమెరా ముందేమో నా డైలాగ్స్ చెప్పి చంపుతున్నాడు. ఇకపై వీడిని లోకేషన్‌కు తీసుకరాకండి’ అని అమ్మకు సరదాగా ఫిర్యాదు చేసింది.

బాలకృష్ణ సంగతి ఏంటి? ఏదో అన్నారట?

బాలాదిత్య: ఆయనతో అయిదు సినిమాలు చేశాను. అప్పటి హీరోలందరితో చేశాను. సీనియర్‌ ఎన్టీఆర్‌తో మాత్రం సినిమా తీయలేదు. ఒకసారి ఇంటికెళ్లి ‘అంకుల్‌ తాతగారిని చూపిస్తారా?’ అని బాలకృష్ణను అడిగాను. అలా రెండుసార్లు ప్రయత్నించాను. ఆలోపే ఆయన పరమపదించారు. అస్థికలు తీసుకొచ్చినప్పుడు వెళ్లాను. ఆయనే నన్ను చూడగానే గుర్తుపట్టి ‘అరె ముదురు.. మాట తప్పానురా. నాన్నగారిని చూపించలేకపోయాను. సారీ రా’ అన్నారు.

హిందీ సినిమా డైరెక్టర్‌ అనరాని మాట అన్నారంట? ఏంటా సంగతి?

బాలాదిత్య: హిందీలో ‘లవకుశ్‌’ సినిమాలో లవుడు పాత్ర నాది. రోజు ఉదయాన్నే 5 గంటలకు మేకప్‌తో వెళ్లాలి. ఊటీలో పది రోజులు గడిచింది. అప్పుడే న్యూ ఇయర్‌ వచ్చింది. ప్రతి ఏడాది ఆ రోజున అన్నయ్యతో మాట్లాడకుండా ఉండను. నాకు అన్నయ్యే అన్ని. ఆ రోజు ఫోన్‌ కలిసేందుకు చాలా సమయం పట్టింది. దాంతో ఆ రోజు ఉదయం 9 గంటలకు ఎప్పటిలాగే సరదాగా లోకేషన్‌కు వెళ్లాను. అప్పుడు వి.మధుసూదన్‌రావుగారు నన్ను బాగా తిట్టారు. నీకోసం ఎంతమంది వేచి చూడాలి. డేట్స్‌ ఇచ్చావంటే వచ్చి తీరాలి.. లేదా సమాచారం అందించాలి.. అని గట్టిగా చెప్పారు. ఆ మాటల ప్రభావం ఇప్పటికీ ఉంది. పెద్దవాళ్ల తిట్లు గుణపాఠాలు. వి.మధుసుదన్‌రావు  చిరస్మరణీయులు.

ఇప్పటికీ తమ్ముడిని చిన్నోడిలాగా చూస్తాడంట?

బాలాదిత్య: మనం ఎంత ఎదిగినా మనం చేసింది తప్పు అని చెప్పడానికి ఒకరు ఉండాలి. నేను సినిమాలు మానేసిన తర్వాత విపరీతంగా అప్పులు అయ్యాయి. భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థలం అమ్మేశాక అన్నయ్యకు కూడా డబ్బులు ఇవ్వాలి. కానీ నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు. మా అన్నయ్య, వదిన ఇద్దరూ అంతే. వాడికి అవసరం వాడికిచ్చేయండి అన్నారు. కైకేయి రాజ్యం వదిలేసి వెళ్లమన్నప్పుడు రాముడొక మాటంటాడు. ‘అమ్మా.. అనవసరంగా రెండు వరాలు అడిగి వృథా చేసుకున్నావు. నాకే చెబితే నేను వెళ్లిపోయేవాడిని కదా. రాజ్యం వాడికి (భరతుడికి) ఉంటే ఒకటి నాకు ఉంటే ఒకటా?’ అని అంటాడు. నా అన్నయ్య అలాంటోడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని