Balagam: అందుకు నిదర్శనమే ఈ ‘బలగం’: మంత్రి గంగుల

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమా విజయోత్స వేడుకకు మంత్రులు గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Published : 11 Mar 2023 00:55 IST

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చిన తర్వాత మట్టిలో మాణక్యాలు బయటపడుతున్నాయని, దానికి ఓ నిదర్శనమే ‘బలగం’ (Balagam) సినిమా అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఈ చిత్ర విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. హాస్యనటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వేడుకకు కమలాకర్‌తోపాటు మరో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు శంకర్‌ నాయక్‌, ధర్మారెడ్డి, దర్శకులు హరీశ్‌ శంకర్‌, పరశురామ్‌, వేణు శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘‘తెలంగాణ వస్తే ఏం వస్తుంది? అని అనుకుంటే మట్టిలో మాణిక్యాలు వస్తున్నాయి. దానికి నిదర్శనమే ఈ ‘బలగం’. ఈ భూమి మనది కాదు.. దానిపై మనం తాత్కాలికంగా ఉండేవాళ్లం మాత్రమే అని చెప్పిందీ చిత్రం. పిల్లలే ఆస్తి అని చక్కని సందేశాన్ని ఇచ్చింది. డబ్బుకాదు ప్రేమే శాశ్వతం అని చాటి చెప్పింది. బలగం అంటే కుటుంబం’’ అని కమలాకర్‌ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ సంస్కృతిని తెరపైకి తీసుకొచ్చిన వేణుకి ధన్యవాదాలు. ఈ చిత్రంలోని ప్రతి పాత్రా అద్భుతంగా ఉంది. సూపర్‌ సినిమా ఇది. చాలా సహజంగా ఉంది. ఎన్నో వాస్తవాలను చూపించారు. నేను ఏ చిత్రాన్ని పూర్తిగా చూడను. నా జీవితంలో పూర్తిగా చూసిన సినిమా ఇదే. భావోద్వేగానికి గురై ఏడ్చేశా’’ అంటూ ఎర్రబెల్లి.. దర్శకుణ్ని ప్రశంసించారు.

వేణు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురి పుట్టినరోజు వేడుకలో నా పరిస్థితి గురించి చెబితే.. ‘ఏం టెన్షన్‌ పడకు. మన సంస్థ ఉంది’ అంటూ దిల్‌రాజు ధైర్యాన్నిచ్చారు. అలా వచ్చిందే ‘బలగం’. ఈ సినిమాకి గేయ రచయిత కాసర్ల శ్యామ్‌, సంగీత దర్శకుడు భీమ్స్‌ ప్రధాన బలం. సినిమాను ఆదరించిన ప్రేక్షకుందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రానికి కలెక్షన్‌ ఎంత వచ్చిందో నేను పట్టించుకోవట్లేదు. ఎంతమంది ప్రేక్షకులకు థియేటర్‌ వెళ్లి చూస్తున్నారనే దాని గురించే ఆలోచిస్తున్నా. వారంలో ఈ చిత్రాన్ని నాలుగు లక్షల మంది చూశారు. అది ఈ సినిమా బలం. సినిమా బాగుందంటూ వ్యక్తిగతంగా నాకు ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. సినిమాకు అందరూ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. చిరంజీవిగారు సినిమా చూసి, చిత్రానికి పనిచేసిన వారందరి గురించి తెలుసుకున్నారు. ఈ సినిమా గెలుపు అది’’ అని నిర్మాత దిల్‌ రాజు ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు