Priyanka Chopra: మానసికంగా ఎన్నోసార్లు బాధపడ్డా: ప్రియాంకా చోప్రా

బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో తన కెరీర్‌ ఎలా సాగిందో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) తెలిపారు. తొలినాళ్లలో ప్రతి చిన్న విషయానికి తాను కంగారుపడినట్లు వివరించారు.

Published : 27 May 2023 20:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌లో నటిగా కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు మానసికంగా తాను ఎన్నోసార్లు బాధపడినట్లు నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో తొలినాళ్లలో భయపడినట్లు చెప్పారు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

‘‘20 ఏళ్ల వయసులో నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకునేదాన్ని. మానసికంగా ఎన్నోసార్లు బాధపడ్డా. ఏదైనా సినిమా ఫెయిల్‌ అయినా, లేదా ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధతో సెట్‌లోకి అడుగుపెట్టడం కష్టంగా అనిపించేది. ఎవరినైతే టీవీలో చూస్తూ పెరిగానో అలాంటి బిగ్గెస్ట్‌ స్టార్స్‌తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఒకవేళ ఆనాటి ప్రియాంకకు ఏమైనా చెప్పాలి అనుకుంటే.. ‘‘కంగారు పడకు.. కాస్త సరదాగా జీవించు. ఇది అంత ఇబ్బందికరంగా ఉండదు. నీకు అంతా మంచే జరుగుతుంది. కొంచెం నవ్వుతూ ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించు’’ అని చెబుతా’’ అంటూ ప్రియాంక వివరించారు.

బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ఒకప్పుడు అగ్రకథానాయికగా రాణించిన ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆమె బీటౌన్‌కు దూరమయ్యారు. ఇదే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. బీటౌన్‌లో రాజకీయాలు తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వెళ్లిపోయినట్లు చెప్పారు. ‘‘హిందీ సినీ పరిశ్రమలో నన్ను ఒక పక్కకు పెట్టేశారు. నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు. పలువురితో విభేదాలు ఏర్పడ్డాయి. రాజకీయాలు ఉంటాయి. వాటితో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనిపించింది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని