Dil Raju: నా 25ఏళ్ల సినీ కెరీర్‌లో ‘శాకుంతలం’ పెద్ద జర్క్‌.. ఆ షోతో విషయం అర్థమైంది: దిల్‌రాజు

Dil raju: సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం మార్నింగ్‌ షో పడగానే విషయం తనకు అర్థమైపోయిందని సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు.

Published : 30 Apr 2023 01:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సమంత (Samantha) కీలక పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ (Shaakuntalam) తన 25ఏళ్ల సినీ నిర్మాణ కెరీర్‌లో పెద్ద జర్క్‌ అని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు (Dil raju) అన్నారు. గుణశేఖర్‌తో కలిసి ఆయన ‘శాకుంతలం’ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్‌రాజు అనేక విషయాలను పంచుకున్నారు.

‘నా 25 సంవత్సరాల కెరీర్‌లో ‘శాకుంతలం’ పెద్ద జర్క్‌ ఇచ్చింది. ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును స్వాగితిస్తా. సినిమాను నేను నమ్మాను. ప్రేక్షకులకు నచ్చితే ఆదరిస్తారు. ఒకవేళ నచ్చలేదంటే నా జడ్జిమెంట్‌ తప్పని అర్థం. ఆ పొరపాటు ఎలా జరిగిందో ఒకసారి చెక్‌ చేసుకోవడమే. ‘శాకుంతలం’లో నా జడ్జిమెంట్‌ తప్పయింది. ఇంత సుదీర్ఘ కెరీర్‌లో 50కు పైగా సినిమాలను నిర్మిస్తే, ఫ్లాప్‌ అయినవి నాలుగైదు మాత్రమే ఉంటాయి. ‘శతమానంభవతి’ సమయంలో యూఎస్‌లో ఒకరోజు ముందుగానే వేశాం. అందరికీ నచ్చింది. ‘శాకుంతలం’ నాలుగు రోజులు ముందు షో వేశాం. మిశ్రమ స్పందన వచ్చింది. శుక్రవారం మార్నింగ్‌ షో అయిపోగానే పరిస్థితి అర్థమైంది. మొదటి రోజు ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూస్తే, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా ఆడుతుందో లేదో తెలుస్తుంది. కొన్నిసార్లు డివైడ్‌ టాక్‌ రావచ్చు. కొంతమందికి నచ్చి, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. ఎక్కువ మంది నచ్చలేదంటేనే అది ఫ్లాప్‌. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి కూడా ఫోన్లు రావడం లేదంటే అర్థం చేసుకుంటా. శుక్రవారం అయిపోతే ఆ సినిమా గురించి వదిలేస్తా. శనివారం నుంచి కొత్త సినిమాలపై దృష్టి పెడతా. తర్వాతి ప్రాజెక్టులు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటా’’అని చెప్పుకొచ్చారు.

తమిళ రీమేక్‌ ‘96’ విషయంలోనూ తన అంచనా తప్పయిందని దిల్‌రాజు చెప్పుకొచ్చారు. ‘‘ఆ సినిమా అల్లు అర్జున్‌, నాని సహా పలువురికి చూపిస్తే బాగుందని చెప్పారు. అయితే, కరోనా కారణంగా ఆ సినిమాను ఓటీటీలో ఎక్కువ మంది చూసేశారు. ఆ తర్వాత ‘జాను’ విడుదలైంది. ‘96’ చూసిన ఫీల్‌ను ఈ సినిమాతో ఆస్వాదించలేకపోయారు. ‘జాను’, ‘జెర్సీ’ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఓటీటీలో వచ్చేసిన తర్వాత ఏ సినిమాను రీమేక్‌ చేయకూడదు. ఈ రెండు సినిమాల గురించి అప్పటికి నిర్ణయం తీసుకోవడంతో వెనక్కి వెళ్లలేకపోయాం. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నాం. దీని తర్వాత ఎన్టీఆర్‌, ప్రభాస్‌లతో సినిమా ఉంటుంది. అయితే, వాళ్ల ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మా సంస్థలో సినిమా ఉంటుంది’’ అని దిల్‌రాజు(Dil raju) అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని