Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి

‘‘హాస్యం, యాక్షన్‌.. ఇలా నేపథ్యం ఏదైనా దర్శకులు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలగాలి. అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు.

Published : 29 Jun 2022 22:20 IST

హైదరాబాద్‌: ‘‘హాస్యం, యాక్షన్‌.. ఇలా నేపథ్యం ఏదైనా దర్శకులు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలగాలి. అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అన్నారు. ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy BirthDay) సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో దర్శకుడు రితేశ్‌ రానా తెరకెక్కించిన చిత్రమిది. జులై 8న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించింది.

వేడుకనుద్దేశించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు మంచి కథలను వెతికి మరీ పట్టుకుంటారు. క్లాప్‌ ఎంటర్‌టైనర్‌ సంస్థతో కలిసి వారు నిర్మించిన ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా ఎంత బావుంటుందో ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది. చెర్రీలాంటి ఎనర్జీ ఉన్న నిర్మాతని నేను చూడలేదు. 24 గంటలూ పనిచేస్తూనే ఉంటారాయన. దర్శకుడు రితేశ్‌ రానాకు తన కథలపై నమ్మకం ఎక్కువ. ఆయనకు వెటకారం కూడా ఎక్కువే. ‘పాన్‌ తెలుగు ఫిల్మ్‌’ అని ఈ సినిమా పోస్టర్‌పై చూడగానే నాకు నవ్వొచ్చింది. దీన్ని చూస్తుంటే నాపై జోక్‌ వేశాడేమో అనిపిస్తోంది. సినిమాపరంగా థ్రిల్లర్‌, కామెడీని కలపడం చాలా కష్టం. థ్రిల్‌ ఎక్కువైతే కామెడీ.. హాస్యం ఎక్కువైతే థ్రిల్‌ దెబ్బతింటాయి. అలాంటిది ఈ రెండిటినీ రితేశ్‌ చాలా బాగా మిక్స్‌ చేశాడనిపిస్తోంది. లావణ్య నటన బావుంది. ఇలాంటి ప్రధాన పాత్రలు నాయికలకు అరుదుగా లభిస్తుంటాయి. ఇప్పుడున్న కమెడియన్లలో నాకు బాగా ఇష్టమైన వారు వెన్నెల కిశోర్‌, సత్య. ఈ ఇద్దరూ టీజర్‌, ట్రైలర్లలో అద్భుతమైన కామెడీ పండించారు’’ అని రాజమౌళి అన్నారు.

‘‘థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని చాలామంది భయపడుతున్నారు. దీనిపై ఒక్కొకరు ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. నా విషయానికొస్తే కామెడీ, యాక్షన్‌.. ఇలా ఏ నేపథ్యాన్ని ఎంపిక చేసుకున్నా దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. అలా చేస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనేది నా అభిప్రాయం. ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రం ఆ కోవలోకే వస్తుంది. ఎలాంటి సందేహం లేకుండా సర్‌రియల్‌ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఎంపిక చేసుకుని, అనుకున్నది తెరకెక్కించారు’’ అని రాజమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయిక లావణ్య, దర్శకుడు రితేశ్‌ తదితరులు పాల్గొన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని