Raviteja: నా నిఘంటువులోనే లేదు ఆ మాట!

రవితేజ అంటే మాస్‌ మనసులో ఆ పేరు మెదిలితే చాలు... ఆయన ఉత్సాహమే గుర్తొస్తుంది. కొత్తతరాన్ని ప్రోత్సహిస్తూ... అప్పుడప్పుడూ కొత్త రకమైన కథలకి పట్టం కడుతూ మాస్‌ని  ప్రభావితం చేస్తూంటారు. 

Updated : 23 Dec 2022 11:40 IST

ప్రతిదీ పాన్‌ఇండియా సినిమా కాదు

రవితేజ (Raviteja) అంటే మాస్‌ మనసులో ఆ పేరు మెదిలితే చాలు... ఆయన ఉత్సాహమే గుర్తొస్తుంది. కొత్తతరాన్ని ప్రోత్సహిస్తూ... అప్పుడప్పుడూ కొత్త రకమైన కథలకి పట్టం కడుతూ మాస్‌ని  ప్రభావితం చేస్తూంటారు.  మెరుపు వేగంతో సినిమాలు చేయడం రవితేజ శైలి. ఆయన ద్విపాత్రాభినయంలో రూపొందిన మరో చిత్రమే ‘ధమాకా’ (Dhamaka). శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

ఈ మధ్య అభిమానులతో సమావేశమయ్యారు. సినిమా వేడుకలోనూ ఎక్కువసేపే మాట్లాడారు. ‘ధమాకా’ మీలో ఉత్సాహం పెంచిందా? 

అభిమానుల్ని అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటాను. ఈసారి వాళ్లతో మాట్లాడటాన్ని బాగా ఆస్వాదించాను. అంతా పాజిటివ్‌గా ఉంది. సినిమాలు ఇచ్చే ఉత్సాహంతోపాటు..ఒక్కోసారి ఆయా సమయాన్నిబట్టి కూడా కొన్ని చేస్తుంటాం.

వేడుకల్లో ఎక్కువగా మాట్లాడరు ఎందుకని?

నేనెప్పుడూ చెప్పే సమాధానమే. నేను మాట్లాడటం కంటే కూడా నా పని మాట్లాడాలి, సినిమా మాట్లాడాలి. సినిమాలు ఎలాగో మాట్లాడతాయి కదా? శుక్రవారమే విడుదల. ఉదయం ఆటతోనే దాని గురించి బోలెడన్ని విషయాలు వినిపిస్తాయి.

‘ధమాకా’ ఎలా ఉంటుంది?

మంచి వినోదాత్మక చిత్రం. ‘రాజా ది గ్రేట్‌’ (Raja The Great) తర్వాత మళ్లీ అలా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం చేయలేదు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో కుదిరింది. ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. ఇందులో లాజిక్‌ కంటే మేజిక్‌ కనిపిస్తుంది. త్రినాథరావు నక్కిన చాలా ఉత్సాహంగా పనిచేశారు. నిర్మాతలు వృత్తిపరంగా ఎంత నచ్చారో, వ్యక్తిగతంగా కూడా అంతగా నచ్చారు. పాజిటివ్‌ ఆలోచనలున్న వ్యక్తులు వాళ్లు. అలాంటి నిర్మాతలకి విజయాలు రావాలి. అప్పుడే ఇంకా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అందుకే పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తానని చెప్పా.

ఇది ‘రౌడీ అల్లుడు’ సినిమాని గుర్తు చేస్తుందని మీ బృందం చెబుతోంది. దీనిపై మీ అభిప్రాయం?  

రచయిత ప్రసన్న ఆ మాట చెప్పాడనుకుంటా. కొంచెం అలా ఉంటుందనుకోవచ్చు. తెలుగులో వినోదాత్మక చిత్రాలంటే మనకు చిరంజీవి ఆ తర్వాత రాజేంద్రప్రసాద్‌లాంటి కథానాయకులే గుర్తుకొస్తారు. వాళ్ల శైలిలో సాగే వినోదాత్మక చిత్రమే ఇది. 

చాలాకాలం తర్వాత ద్విపాత్రాభినయం చేశారు...

కథ రావాలి. దాన్నిబట్టే చేస్తాం తప్ప... చాలా రోజులైంది ద్విపాత్రాభినయం చేసి అనుకుని, అదే పనిగా అలాంటి సినిమా చేయడం అంటూ ఉండదు.  

కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో మీరెప్పుడూ ముందుంటారు...

కొత్తవాళ్లతో పనిచేయడం నాకు ఇష్టం. వాళ్లలో ఓ ఉత్సాహం, ఆకలి ఉంటుంది. ఏదో నిరూపించుకోవాలనే తపన ఉంటుంది. నేనూ అలా వచ్చినవాణ్నే కదా. అందుకే నావల్ల ఎంత కుదిరితే అంత వాళ్లకోసం చేస్తుంటా. ప్రసన్నకుమార్‌ బెజవాడ మంచి రచయిత, తన సంభాషణలు చాలా బాగుంటాయి. త్రినాథరావు - ప్రసన్న కలయిక చాలా బాగా కుదిరింది. సంగీత దర్శకుడు భీమ్స్‌  కూడా అంతే. మంచి ట్యూన్‌ మేకర్‌. ఇప్పటికే అతను ఈ సినిమా విషయంలో విజయవంతమయ్యాడు. కొత్తతరం దర్శకులు, రచయితలు వస్తూనే ఉన్నారు. వాళ్లతో తరచూ కలుస్తుంటాను, కథల గురించి చర్చిస్తుంటాను. వాళ్ల ఆలోచనలు చాలా బాగుంటున్నాయి. కథానాయిక శ్రీలీలలో బోలెడంత ప్రతిభ ఉంది. అందం, ఉత్సాహానికి తోడు తను తెలుగమ్మాయి కూడా.

కరోనా తర్వాత కథల్లో వచ్చిన మార్పులపై మీ అభిప్రాయం?

కొత్త కథలేమీ పుట్టేయవు. అవే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. వాటిని ఎలా తెరపైకి తీసుకొస్తున్నాం అనేదే ముఖ్యం. కరోనా తర్వాత కూడా సోషల్‌ డ్రామాలు విజయవంతం అయ్యాయి. ఎప్పుడైనా సరే, ప్రతి సినిమాకీ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. కొన్ని అనుకున్నట్టు అవుతాయి, కొన్ని కావు. ప్రేక్షకులు కొన్ని సినిమాలకి కనెక్ట్‌ అవుతారు, కొన్నిటికి కాలేరు. కాకపోతే కరోనా తర్వాత ఓటీటీ కంటెంట్‌ని బాగా చూశాం. ఓటీటీ వేరు, థియేట్రికల్‌ అనుభవం వేరు. ఆ రెండిటినీ కలపకూడదు. వెబ్‌సిరీస్‌లో వాళ్లు అలా చేశారు కదా, మనం సినిమాలో అదే చేద్దాం అంటే కుదరదు.

పరాజయం తర్వాత కూడా ధైర్యంగా దర్శకులకి అవకాశాలు ఇస్తుంటారు. ఆ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?

పరాజయం ఎదురైంది కదా అని ఒకరిలో ప్రతిభ లేదనుకోవడం తప్పు. అందరికీ విజయాలుంటాయి, పరాజయాలు ఉంటాయి.  నాకు లేవా? నా లెక్క అది కాదు. వాళ్లలో ప్రతిభ ఉంది కాబట్టే మళ్లీ విజయాలు అందుకున్నారు కదా? వాళ్లు చెప్పే కథలు నాకు నచ్చుతుంటాయి.

కథల ఎంపికలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?

ఫలితం మన చేతుల్లో ఉండదు కానీ... కథ మాత్రం కచ్చితంగా నచ్చాల్సిందే. కథల ఎంపికలో ఇదివరకు వేగంగా ఉండేవాణ్ని. ఇప్పుడు పెట్టుబడులు పెరిగిపోయాయి కదా? కథలు  ఇంకా బాగా చూసుకోండని జాగ్రత్తలు చెబుతున్నా. దర్శకుల కోసమని, ఇతర కలయికలు బాగా కుదిరాయని సినిమాలు చేయను. నేనే కాదు, నాకు తెలిసి ఏ కథానాయకుడూ అలా  చేయరు.

వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ దశని ఎలా ఆస్వాదిస్తున్నారు?

ఇప్పుడే కాదు, నా జీవితంలో ప్రతి దశనీ ఆస్వాదిస్తుంటా. చిత్రీకరణ అంటే పండగ నాకు. ఏ రోజూ బోర్‌ కొట్టదు. బోర్‌ అనే మాట నా నిఘంటువులోనే లేదు. సెట్లో  ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తుంటాను.  ఏదైనా మన ఆలోచనా విధానాన్నిబట్టే ఉంటుంది. మనసులో వ్యతిరేక ఆలోచనల్ని తీసేయండి, జీవితాన్ని ఎందుకు ఆస్వాదించలేరో చూద్దాం. ఆవేశపడిపోవడాలు, కుంగిపోవడాలు ఎక్కువైంది ఈమధ్య. దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. తొందరగా వృద్ధాప్యం కూడా వస్తోంది. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. నేను ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను. నాలో ఈ మార్పు కొత్తగా వచ్చిందేమీ కాదు. నాకు ఊహ వచ్చినప్పట్నుంచి ఇలాగే ఉన్నా. నా జీవితంలో ఆటుపోట్లని కూడా ఆస్వాదించా.  ఒత్తిడి అనేది మనం తీసుకుంటేనే కదా మన దగ్గరికి వచ్చేది. ఎవరు తీసుకోమన్నారు?

మీకు భవిష్యత్తుకి సంబంధించి ప్రణాళికలేమీ ఉండవా?

వచ్చిన సినిమాలు చేస్తూ వెళ్లడమే. భవిష్యత్తు, ప్రణాళికలాంటి ఆలోచనలేమీ ఉండవు. భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. ఈ క్షణంలో ఉండటానికి ఇష్టపడతా. ధ్యానం, పుస్తకాలు ఇవేవీ నాకు అవసరం లేదంటాను?   సినిమా తప్ప నాకు ఇంకేమీ తెలియదు. మిగతా విషయాలేవీ పట్టించుకోను.

చాలారోజుల తర్వాత చిరంజీవితో కలిసి నటించారు. ‘వాల్తేర్‌ వీరయ్య’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

శక్తిమంతమైన పాత్ర చేస్తున్నా. పండగకి చూస్తారు కదా? చిరంజీవి అన్నయ్య అంటే వ్యక్తిగతంగా కూడా నాకు చాలా ఇష్టం. ఆయనతో పనిచేయడం మంచి అనుభవం. ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పుడూ ఉంటుంది. కథ, పాత్రలు సెట్‌ అవ్వాలంతే. అవి సెట్‌ అయ్యాయి, పైగా బాబీ దర్శకుడు.

పాన్‌ ఇండియా చిత్రాల గురించి మీ అభిప్రాయం?

ప్రతిదీ పాన్‌ ఇండియా సినిమా అయిపోదు. కథలే ఆ సినిమాల స్థాయిని నిర్ణయిస్తాయి. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చేస్తున్నా. అది పాన్‌ ఇండియా స్థాయి కథతో రూపొందుతోంది. 80 దశకం నేపథ్యం కదా, అందులో నా మేకోవర్‌ కూడా కొత్తగా ఉంటుంది. మరో చిత్రం ‘రావణాసుర’ దాదాపు 80 శాతం పూర్తయింది. ‘ఈగిల్‌’ అనే సినిమా కూడా చేస్తున్నా. కానీ దాని గురించి ఇప్పుడే మాట్లాడటం మరీ తొందర అవుతుంది. నా నిర్మాణంలో కూడా మరికొన్ని  సినిమాలు వస్తాయి, వాటి గురించి కూడా మాట్లాడుకునే సమయం వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని