Cinema News: గాసిప్స్‌ నిజమైతే ఆ లెక్క వేరే..

సినీ పరిశ్రమలో గాసిప్స్‌కి కొదవే ఉండదు. ఎప్పుడూ ఎదో ఒక సినిమా లేదా నటీనటుల గురించో పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక, సోషల్‌మీడియా వచ్చాక ఇలాంటి వార్తలకు అంతం అనేది లేకుండా పోయింది.....

Updated : 06 Jun 2021 12:08 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ పరిశ్రమలో గాసిప్స్‌కి కొదవే ఉండదు. ఎప్పుడూ ఎదో ఒక సినిమా లేదా నటీనటుల గురించో పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక, సోషల్‌మీడియా వచ్చాక ఇలాంటి వార్తలకు అంతు లేకుండా పోయింది. అలా, గత కొన్నిరోజుల నుంచి మనం తరచూ వింటోన్న సరదా పుకార్ల గురించి ఒక్కసారి చూద్దాం..!

విశ్వనటుడు + సూపర్‌స్టార్‌ = భారీ ప్రాజెక్ట్‌

విశ్వనటుడు కమల్‌హాసన్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కలిసి స్క్రీన్‌ పంచుకోనున్నారట. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ వీరిద్దరితో ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేశారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌లో మురుగదాస్‌ బిజీగా ఉన్నారంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ.. ఇదే నిజమైతే సినీ ప్రియుల ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పాలి.


మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌ + మెగా పవర్‌స్టార్‌

కేజీఎఫ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని స్టార్‌ హీరోలతో వరుస ప్రాజెక్ట్‌లు అనౌన్స్‌ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే ప్రభాస్‌, ఎన్టీఆర్‌లతో ప్రాజెక్ట్‌లు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, త్వరలోనే ఆయన మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని టాక్‌. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించే అవకాశముందని అందరూ అనుకుంటున్నారు.


ప్రాణమిత్రులు కలిస్తే..!

రామ్‌చరణ్‌, నటుడు శర్వానంద్‌.. చిన్నప్పటి నుంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ ఇప్పటివరకూ ఓ ప్రాజెక్ట్‌ కోసం కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. కాగా, కరోనా పరిస్థితుల్లో ప్రజలను కాపాడేందుకు వైద్యులు ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వైద్యుల గొప్పతనాన్ని తెలియజేస్తూ ఓ షార్ట్‌ ఫిల్మ్స్‌ నిర్మించాలని ఉపాసన భావిస్తున్నారట. ఇందులో రామ్‌చరణ్‌, శర్వానంద్‌ నటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగా కుటుంబంతో ఉన్న అనుబంధంతో శర్వా కూడా తనవంతు బాధ్యతగా ఇందులో నటించేందుకు సరే అన్నట్లు సమాచారం.


రాజముద్ర..!

ఇండస్ట్రీకి భారీ విజయాలను అందించిన దర్శకుల్లో ఒకరు దర్శకధీరుడు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉన్న ఆయన త్వరలో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించనున్నారట. కరోనా సమయంలో మన కోసం మన వారి కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులపై ఆయన ఈ ఫిల్మ్‌ చిత్రీకరించనున్నట్లు సమాచారం. పోలీసుల సేవాగుణాన్ని తెలిపేలా దీనిని రూపొందించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో, మరెన్నో గాసిప్స్‌ ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటిని చూసిన నెటిజన్లు.. ఇలాంటి క్రేజీ గాసిప్స్‌ కనుక నిజమైతే లెక్క మరోలా ఉంటుంది అనుకుంటున్నారు. ఈ గాసిప్స్‌లో ఎంతవరకూ నిజముందో చూడాలంటే వేచి చూడక తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని