Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్‌

Sai pallavi: తనకు పెళ్లైపోయిందంటూ వచ్చిన వార్తలపై సినీ నటి సాయి పల్లవి మండిపడ్డ్డారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించారు.

Updated : 22 Sep 2023 16:33 IST

హైదరాబాద్‌: ‘సాయి పల్లవికి పెళ్లి అయింది.. ఇదిగో సాక్ష్యం.. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంది ఎవరో తెలుసా? సాయి పల్లవిని పెళ్లి చేసుకున్న దర్శకుడు అతడే?’ ఇవి గత కొద్ది రోజులుగా యూట్యూబ్‌ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న హెడ్‌లైన్స్‌. ఆ ఫొటోలపై దర్శకుడు వేణు ఊడుగుల ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో సాయి పల్లవి (Sai pallavi) కూడా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. చిత్ర పరిశ్రమలో తనపై వచ్చే రూమర్స్‌పై సాయి పల్లవి పెద్దగా స్పందించదు. అసలు వాటిని పట్టించుకోదు. కానీ, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ఇందులోకి లాగుతుండటంతో ఆమె స్పందించారు.

‘‘నిజం చెప్పాలంటే, రూమర్స్‌ను నేను అసలు పట్టించుకోను. కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా. నేను నటించిన ఓ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్‌ చేసి, డబ్బు కోసం, నీచమైన ఉద్దేశాలతో వాటిని ప్రచారం చేస్తున్నారు. నా సినిమాలకు సంబంధించి మంచి అప్‌డేట్స్‌ పంచుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించడం నిజంగా బాధగా ఉంది. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందిని కలిగించడం నిజంగా నీచమైన చర్యే’’ అంటూ సాయి పల్లవి అసహనం వ్యక్తం చేశారు.

నటి సాయి పల్లవికి సంబంధించిన ఓ ఫొటో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామితో ఆమె ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. సాయిపల్లవి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ‘SK21’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటో అది. మరోవైపు సాయి పల్లవి నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించనుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. #NC23 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని