Rajamouli: రాజమౌళికి ‘జక్కన్న’ పేరు పెట్టిందెవరో తెలుసా? 

తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన పట్టుకున్న కథ హిట్‌ కావాల్సిందే. అంతగా దానిపై దృష్టిపెడతారాయన. సినిమాలోని ప్రతి సన్నివేశం తనకి నచ్చినట్టు వచ్చేంత వరకు టేక్‌ మీద టేక్‌ తీస్తుంటారు.

Published : 23 Jul 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన పట్టుకున్న కథ హిట్‌ కావాల్సిందే. అంతగా దానిపై దృష్టిపెడతారాయన. సినిమాలోని ప్రతి సన్నివేశం పర్‌ఫెక్ట్‌గా వచ్చేంత వరకూ టేక్‌ మీద టేక్‌ తీస్తుంటారు. అలా అన్ని సీన్లని ఎన్నోసార్లు చెక్కీ చెక్కీ మనకు అద్భుతాల్ని అందిస్తుంటారు. అందుకే ఆయన్ను అందరూ ‘జక్కన్న’ అని ముద్దుగా పిలుస్తారు. మరి రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టిందెవరో తెలుసా? ఆయనెవరో కాదు నటుడు రాజీవ్ కనకాల.

‘నా సీన్‌కి సంబంధించిన చిత్రీకరణ 6 గంటలకు ఉంటే అది కాస్త 10 గంటలకు అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఇతర నటులతో మొదలుపెట్టిన సన్నివేశాన్ని తీస్తూనే ఉంటారు రాజమౌళి. ఎన్ని రకాలుగా తీయొచ్చో అన్ని రకాల షాట్స్‌ తీసేస్తారు. అది పూర్తయ్యాకే ఇంకో సీన్‌ ప్రారంభిస్తారు. ఓ సారి అరపేజీ సన్నివేశం చేయాల్సి వచ్చింది. త్వరగా అయిపోతుందిలే అనుకున్నా. కానీ, అర్ధరాత్రి 12.30గంటలు అయింది. ‘వామ్మో! పని రాక్షసుడు.. చెక్కుతున్నాడు సీన్లని జక్కనలా’ అని సరదాగా అనుకున్నాను. అదే ఆయన పేరులా మారిపోయింది’ అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు రాజీవ్‌ కనకాల. అలా అనుకున్న పేరే ఈ రోజు ఓ బ్రాండ్‌ అయింది. సొంత పేరుకన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. రాజమౌళి, రాజీవ్‌ కనకాల ఇద్దరూ స్నేహితులనే విషయం తెలిసిందే. ‘శాంతి నివాసం’ సీరియల్‌తో ఈ ఇద్దరూ పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీళ్ల స్నేహం కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్‌ నెం: 1’, ‘సై’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’ తదితర చిత్రాల్లో రాజీవ్‌ కనకాల మంచి పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది ఈ చిత్రం. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు రాజీవ్‌ కనకాల.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని