Unstoppable 2: మీలాంటి వారిని ‘షో’కు పిలవడమే తప్పు: బాలకృష్ణ

‘అన్‌స్టాపబుల్‌ 2’ కొత్త ఎపిసోడ్‌. శర్వానంద్‌, అడివి శేష్‌లు బాలకృష్ణతో పంచుకున్న విశేషాలివీ.. 

Published : 05 Nov 2022 01:39 IST

హైదరాబాద్‌: ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable) టాక్‌ షోతో ఓటీటీ ప్రేక్షకులను ప్రతి వారం అలరిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ కార్యక్రమ తాజా ఎపిసోడ్‌కు యువ నటులు అడివి శేష్‌ (Adivi Sesh), శర్వానంద్‌ (Shrwanand) హాజరయ్యారు. ‘మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు’ అని బాలకృష్ణ ఎందుకు అనాల్సి వచ్చిందంటే..?

‘‘నా చిన్నప్పుడు మీ (బాలకృష్ణ) సినిమాలోని ‘బీడీలు తాగండి బాబులు’, ‘ముద్దు పాప’ పాటలు పాడుతుంటే మా అమ్మ నన్ను కొట్టింది. తలపై పడిన మచ్చ ఇప్పటికీ ఉంది. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు శర్వానంద్‌ నాకు స్ఫూర్తిగా నిలిచాడు. కెరీర్‌ ప్రారంభంలో నాకెవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. స్వతహాగా రచనపై ఆసక్తి ఉండటంతో నా సినిమాలకు నేనే కథలు రాసుకునేవాణ్ని. సినిమాలు చేయడమనేది ఓ వరంలాంటిది. అది అందరికీ దక్కేదికాదు. నా తొలి సినిమాని కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తీశానని, ‘కర్మ’ అనే టైటిల్‌ పెట్టా. ప్రేక్షకులు దాన్ని తిట్టు అనుకుని సినిమాకు వెళ్లలేదు (నవ్వులు). నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ‘బాయ్స్‌’ సినిమా స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ, నేను వెళ్లలేదు. శంకర్‌గారి దర్శకత్వంలో నటించలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. గతంలోనే నేను ఒకరితో రిలేషన్‌లో ఉన్నా. సినీ పరిశ్రమలో ఇంకా పెళ్లికాని హీరోలు చాలామంది ఉన్నారు. మన కంటే పెద్దవారి వివాహం అయ్యాకే కదా మనం చేసుకునేది (నవ్వుతూ..). దానికి చాలా టైమ్‌ పడుతుందని రిలేషన్‌షిప్‌ను కట్‌ చేశా’’ అని శేష్‌ తెలిపారు.

‘‘నాది సినీ నేపథ్యమున్న కుటుంబం కాదు. మా నాన్న దగ్గర నుంచి ఒక్క రూపాయీ తీసుకోకుండా నా కాళ్లపై నేను నిలబడాలనుకున్న సమయంలో చిత్ర పరిశ్రమను ఎంచుకున్నా. నేను హీరోగా నటించిన తొలి సినిమా ఆడలేదు. దాంతో కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు షోషించా. ఎప్పటికైనా ఓ స్థాయికి వెళ్తా అనే నమ్మకం ఉండేది. నేను దర్శకులు చెప్పిన కథల్లో మంచివి ఎంపిక చేసుకుని నటిస్తుంటా. హీరోయిన్‌ సెలక్షన్‌ కూడా దర్శకులదే (నవ్వులు)’’ అని శర్వానంద్‌ చెప్పారు. బాలకృష్ణ.. ‘మహా సముద్రం’ సినిమా హీరోయిన్‌ అదితీరావు హైదరీ ప్రస్తావన తీసుకురాగా.. ‘సిద్ధార్థ్‌, అదితికి మధ్య ఏం ఉందో నాకు తెలియదు సర్‌. నేనూ సోషల్‌ మీడయాలో సిద్ధు పెట్టిన పోస్ట్‌ చూశా’ అని తెలిపారు.

అనంతరం, ఓ గేమ్‌లో భాగంగా శేష్‌, శర్వానంద్‌లపై బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. సినిమాల్లో ఎవరెవరకి ముద్దు పెట్టావ్‌? ఏ హీరోయిన్‌కు పెట్టాలనుకుంటున్నావ్‌? అనే ప్రశ్నకు ‘‘నేను తొలిసారిగా అదాశర్మకు, చివరిగా మీనాక్షి చౌదరికి పెట్టా. కత్రినా కైఫ్‌ను కిస్‌ చేయాలనుంది’’ అని శేష్‌ సమాధానమిచ్చారు. నీ ఫోన్‌లో ఆ వీడియోలు ఎన్ని ఉన్నాయ్‌? అని అడగ్గా ‘‘సర్‌.. మీ నాన్నగారి దగ్గర మా తాత అకౌంటెంట్‌గా పనిచేశారు. మీకు సంబంధించిన అన్ని వివరాలు మా దగ్గరున్నాయి. ఇప్పుడు చెప్పమంటారా’’ అంటూ శర్వానంద్‌ సమాధానం దాటవేశారు. దాంతో, ‘మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు’ అంటూ బాలకృష్ణ నవ్వులు పంచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని