NTR: డెన్మార్క్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

 డెన్మార్క్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  సామాజిక అసమానతలను తొలగించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated : 29 Jun 2023 15:55 IST

కొపెన్‌హెగెన్‌: డెన్మార్క్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు, మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడున్న తెలుగువారంతా ఒక్కచోట చేరి ఎన్టీఆర్‌ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించేందుకు, సామాజిక అసమానతలను తొలగించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. తెలుగు యువత, తెలుగు మహిళతోపాటు వివిధ విభాగాలకు చెందిన వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కారు ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ప్రజల సంక్షేమం కోసం రూ.2కే కిలో బియ్యం పథకం లాంటి కార్యక్రమాలెన్నింటినో ఎన్టీఆర్‌ తీసుకొచ్చారని, తెదేపా ఎప్పుడు అధికారంలో ఉన్నా.. ప్రజల అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు లాగా చూసుకుంటుందని వక్తలు పేర్కొన్నారు. మొదటిసారిగా ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన ‘పింఛన్‌ పథకం’ ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు దిక్సూచీగా మారిందని అన్నారు. మహానాడులో భాగంగా డెన్మార్క్ తెలుగు యువత సభ్యులు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిని తెదేపా డెన్మార్క్ కార్యవర్గ సభ్యులు ఆమోదించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఆంధ్రుల భవిష్యత్‌, యువత భవిష్యత్‌ బాగుండాలని, మున్ముందు ‘విదేశీ విద్య పథకం’ ప్రవేశ పెట్టి విద్యార్థులని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

నారా లోకేశ్ చేపట్టిన యువగళం స్పందన చూస్తూంటే.. ఆ యువనాయకుడి నాయకత్వంలో మన రాష్ట్రానికి ఉజ్వల భవిషత్తు రాబోతున్నట్లు తెలుస్తోందని వక్తలు పేర్కొన్నారు. మహానాడులో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, అన్నివర్గాల ప్రజలనుంచి అపూర్వమైన స్పందన వస్తోందని పలువురు ఎన్‌ఆర్‌ఐలు కొనియాడారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని, యువతకు ఉపాధి అవకాశాలు లభించి, అభివృద్ధితో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నినదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని