Asia Cup 2023: ఆ రెండు దేశాల్లో.. ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఆసియా కప్‌

భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ను వీక్షించే క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. వన్డే ప్రపంచకప్‌ ముందే దాయాదుల పోరును చూసే అవకాశం రానుంది. ఆసియా కప్ (Asia Cup) నిర్వహణపై నిర్ణయం వెలువడింది.

Updated : 15 Jun 2023 17:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎట్టకేలకు ఆసియా కప్‌ (Asia Cup 2023) సంబరం సిద్ధమవుతోంది. రెండు దేశాల్లోని వేదికల్లో ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరుగుతుందని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌తో కూడిన టోర్నీ 18 రోజులపాటు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో 13 మ్యాచ్‌లు ఉంటాయి. హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ జరుగుతుందని ఏసీసీ వెల్లడించింది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏసీసీ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ టోర్నీకి అతిథ్యమిచ్చే అవకాశం పాకిస్థాన్‌కు రావడం గమనార్హం. మరోసారి భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు రానుంది. అయితే శ్రీలంక వేదికగానే ఇరు జట్ల మ్యాచ్‌ జరగనుంది. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మధ్య మాటల యుద్ధం  సాగడంతో ఆసియా కప్‌ నిర్వహణపై తొలుత సందిగ్ధత నెలకొంది. పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడం.. తమ టీమ్‌ కూడా భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేది లేదని పీసీబీ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ దేశంలో కొన్ని, తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్‌ మోడల్‌ను పాక్‌ ప్రతిపాదించింది. బీసీసీఐ సహా శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ అందుకు అంగీకరించకపోవడంతో పీఠముడి పడింది. దీంతో ప్రపంచకప్‌లో ఆడేది లేదని పాక్‌ తేల్చి చెప్పింది.ఈ క్రమంలో దాయాదుల పోరు లేకుండా ప్రపంచకప్‌ జరిగితే టోర్నీకి ఆకర్షణ తగ్గుతుందని భావించిన ఐసీసీ రంగంలోకి దిగింది. ఎలాంటి షరతులు లేకుండా పాక్‌ను ఒప్పించింది. అదే క్రమంలో పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను ఏసీసీ కూడా అంగీకరించడంతో ఆసియా కప్‌ నిర్వహణకు అడ్డంకులు తొలిగిపోయాయి. భారత్‌ ఆడే మ్యాచ్‌లతోపాటు సూపర్‌ - 4 పోరు శ్రీలంకలో జరుగుతుంది. ఇంకా వేదికలను ఖరారు చేయాల్సి ఉంది. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ విజేతగా శ్రీలంక నిలిచింది.

పోటీలు ఇలా..

  • ఆరు జట్లు రెండు గ్రూప్‌లు విడిపోతాయి. టాప్‌ -2 జట్లు సూపర్ -4కి చేరతాయి. 
  • భారత్, పాకిస్థాన్‌, నేపాల్ ఒక గ్రూప్‌ కాగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మరొక గ్రూప్‌.
  • టాప్‌ -4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. 
  • సెప్టెంబర్ 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు