ముంబయి విజయంతో..

డబ్ల్యూపీఎల్‌ గ్రూప్‌ దశలో తన చివరి మ్యాచ్‌లో ముంబయి 4 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచింది. మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది.

Published : 22 Mar 2023 02:24 IST

ఓటమితో ఆర్సీబీ వీడ్కోలు
అమేలియా ఆల్‌రౌండ్‌ జోరు

బ్ల్యూపీఎల్‌ గ్రూప్‌ దశలో తన చివరి మ్యాచ్‌లో ముంబయి 4 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచింది. మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. ఆ జట్టులో ఎలీస్‌ పెర్రీ (29), రిచా ఘోష్‌ (29), స్మృతి మంధాన (24) మాత్రమే పర్వాలేదనిపించారు. అమేలియా కెర్‌ (3/22), నాట్‌ సీవర్‌ (2/24), ఇసీ వాంగ్‌ (2/26) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో 6 వికెట్లు కోల్పోయిన ముంబయి 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమేలియా (31 నాటౌట్‌) బ్యాట్‌తోనూ మెరిసింది. యాస్తిక (30) కూడా రాణించింది.

దూకుడుగా మొదలెట్టి..: ఓపెనర్లు హేలీ (24), యాస్తిక బౌండరీల వేటలో సాగడంతో స్వల్ప ఛేదనను ముంబయి దూకుడుగా మొదలెట్టింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో డివైన్‌ రెండు నోబాల్స్‌ వేయడంతో బతికిపోయిన హేలీ.. మధ్యలో వరుసగా 6, 4 బాదింది. యాస్తిక ఫోర్లతో చెలరేగడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. తొలి వికెట్‌కు హేలీ, యాస్తిక 53 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరితో పాటు సీవర్‌ (13), హర్మన్‌ప్రీత్‌ (2) వికెట్లు పడగొట్టిన ఆర్సీబీ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది. 10 ఓవర్లకు 79/4తో నిలిచిన ముంబయిని.. పూజ (19) తోడుగా అమేలియా నడిపించింది. 16వ ఓవరో కనిక వరుస బంతుల్లో పూజ, వాంగ్‌ (0)ను ఔట్‌ చేసినా ముంబయికి ఇబ్బంది లేకపోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే జట్టును అమేలియా విజయతీరాలకు చేర్చింది.

అదే కథ..: డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌లో తమ చివరి మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆర్సీబీ వైఫల్యం కొనసాగింది. తొలి ఓవర్లోనే సోఫీ డివైన్‌ (0) అనవసరంగా రనౌటైంది. నెమ్మదిగా స్పందించిన పిచ్‌పై పరుగులు కష్టంగా వచ్చాయి. బౌండరీలతో మంధాన స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేసినా అమేలియా బంతి అందుకోగానే అంతా తారుమారైంది. వేగాన్ని తగ్గించి, ఊరించే బంతులతో ఆమె బ్యాటర్లను బుట్టలో వేసుకుంది. మంధాన, హెదర్‌ (12), కనిక (12)ను తన వరుస ఓవర్లలో ఔట్‌ చేసింది. 15 ఓవర్లకు స్కోరు 79/4. వరుసగా 4, 6తో రిచా దూకుడు ప్రదర్శించింది. కానీ ఒకే ఓవర్లో ఎలీస్‌, శ్రేయాంక (4)ను పెవిలియన్‌ చేర్చిన సీవర్‌ ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టింది. రిచా మెరుపుల కారణంగా ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

బెంగళూరు: 125/9 (ఎలీస్‌ పెర్రీ 29, రిచా 29, అమేలియా  కెర్‌ 3/22, సీవర్‌ 2/24, వాంగ్‌ 2/26);
ముంబయి: 129/6  (అమేలియా నాటౌట్‌ 31, యాస్తిక 30, కనిక 2/5)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని