ICC Trophies - Team India: కథ మారదా.. వ్యథ తీరదా!

ఎప్పుడో 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది టీమ్‌ఇండియా.  అంతకు రెండేళ్ల ముందు వన్డే ప్రపంచకప్‌, దానికి నాలుగేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌ కూడా భారత్‌ సొంతమయ్యాయి.

Updated : 12 Jun 2023 07:45 IST

ఎప్పుడో 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది టీమ్‌ఇండియా.  అంతకు రెండేళ్ల ముందు వన్డే ప్రపంచకప్‌, దానికి నాలుగేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌ కూడా భారత్‌ సొంతమయ్యాయి. కానీ గత దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షే అవుతోంది. నాలుగు టీ20, రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో రిక్తహస్తమే మిగలగా.. టెస్టుల్లో అయినా ఐసీసీ ట్రోఫీ అందుతుందేమో అని చూస్తే, అక్కడా నిరాశ తప్పట్లేదు. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించినా.. రెండుసార్లూ ఓటమి వైపే నిలవడంతో మన జట్టు సామర్థ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనాడు క్రీడావిభాగం : ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మనదే పైచేయి. ముఖ్యంగా సొంతగడ్డపై సిరీస్‌లంటే చాలు.. మనవాళ్లు రెచ్చిపోతారు. భీకర ఫామ్‌తో మన దేశంలో అడుగు పెట్టే జట్లకు గర్వభంగం చేసి పంపిస్తారు.గత కొన్నేళ్లలో విదేశాల్లో కూడా అడపాదడపా కొన్ని విజయాలు సాధిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది టీమ్‌ఇండియా. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి న్యూజిలాండ్‌, రెండో పర్యాయం ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరాయి. కానీ రెండుసార్లూ అవతల ప్రత్యర్థి మాత్రం భారతే. ఫైనల్‌కు చేరే వరకు చూపించిన ఆధిపత్యం.. అసలు సమరంలో మాత్రం కనిపించలేదు. అయితే భారత్‌ రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరడానికి, తుది పోరులో ఓటమికి ప్రధాన కారణం సొంతగడ్డపై తయారు చేసుకున్న పిచ్‌లే అన్నది విమర్శకుల మాట! తమ బలానికి పూర్తి అనుకూలంగా స్పిన్‌ పిచ్‌లు తయారు చేసుకుని, వాటితో ఎలాంటి ప్రత్యర్థులనైనా దెబ్బ కొడుతున్న టీమ్‌ఇండియా.. ఫైనల్స్‌లో పేస్‌ పిచ్‌లు ఎదురయ్యేసరికి చేతులెత్తేసింది. ఐపీఎల్‌ అవ్వగానే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడటం, సరైన సన్నాహకం లేకపోవడం భారత్‌ను దెబ్బ తీయడం వాస్తవమే అయినా.. ఇలాంటి ప్రతికూలతలను అధిగమించి విజయం సాధించడం ఛాంపియన్‌ లక్షణం. ఆ సామర్థ్యం భారత్‌కు లేదని తేటతెల్లమైంది.

ప్రత్యామ్నాయాలు ఎక్కడ?: గత కొన్నేళ్లలో టీమ్‌ఇండియా విదేశాల్లో సాధించిన అద్భుత విజయాల వెనుక కీలక పాత్ర బౌలర్లదే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి దేశాల్లో ఆతిథ్య బౌలర్లను మించి మన పేసర్లు పిచ్‌లను సద్వినియోగం చేసుకుని వికెట్ల పంట పండించారు. ముఖ్యంగా బుమ్రా మంచి ఫిట్‌నెస్‌, ఫామ్‌లో ఉన్నపుడు భారత బౌలింగ్‌ ఎంతో ప్రభావవంతంగా కనిపించేది. బుమ్రా, షమి జోడీ విదేశీ పిచ్‌లపై గొప్ప ప్రదర్శన చేసింది. కానీ బుమ్రాను ఫిట్‌నెస్‌ సమస్యలు చుట్టుముట్టాక బౌలింగ్‌ బలహీన పడింది. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత పేస్‌ దాడిని ముందుండి నడిపించాల్సిన షమి విఫలమయ్యాడు. సిరాజ్‌ ఒక్కడు కొంచెం నిలకడ చూపించాడు. బుమ్రా స్థానంలో తుది జట్టులో ఆడిన ఉమేశ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతను కాకుండా వేరే ప్రత్యామ్నాయాలే కనిపించని పరిస్థితి. ఫాస్ట్‌బౌలర్లలో చాలామందికి టీ20ల్లోనే వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడే ఫిట్‌నెస్‌ ఉండట్లేదు. ఇక అయిదు రోజుల ఆటకు ఏం పనికి వస్తారు? ఇక బ్యాటింగ్‌లో కూడా సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచే ఆటగాళ్లు కరవైపోతున్నారు. అలా నిలిచే సామర్థ్యం ఉన్న పుజారా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్లో పేలవ ప్రదర్శన చేశాడు. మిగతా వారిలా ఐపీఎల్‌ ఆడకుండా కౌంటీల్లో ఎంతో అనుభవం సంపాదించిన పుజారానే నిలవలేకపోయాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో తెగువతో, ఆత్మవిశ్వాసంతో ఆడే రిషబ్‌ పంత్‌ లాంటి ఆటగాడు లేకపోవడం బ్యాటింగ్‌ను ముందే బలహీన పరిచింది. మిగతా బ్యాటర్లలో రహానె ఒక్కడే పోరాట పటిమ చూపాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన శుభ్‌మన్‌.. ఇంగ్లాండ్‌లో ఆ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. కోహ్లి ఒకప్పటిలా భరోసా కల్పించలేకపోతున్నాడు. రోహిత్‌ ప్రదర్శనా అంతంతమాత్రం. అతను కెప్టెన్‌గానూ అంచనాలను అందుకోలేకపోయాడు. మొత్తంగా చూస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచే సామర్థ్యం భారత్‌కు ఉన్నట్లు మ్యాచ్‌కు ముందూ కనిపించలేదు. మ్యాచ్‌ సమయంలోనూ ఎలాంటి ఆశా కలగలేదు. ఇలాంటి ఆటతో టెస్టు ఛాంపియన్‌షిప్‌ను భారత జట్టు అందుకుంటుందని ఎలా ఆశిస్తాం?

ఇక్కడేనా?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నిర్వహించే సమయం, వేదిక విషయంలో ఇప్పుడు భారత్‌ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇంగ్లాండ్‌నే వేదిక చేయడాన్ని ఐసీసీ ఎలా సమర్థించుకుంటుందో? ఇంగ్లాండ్‌ పరిస్థితులు.. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లకు అనుకూలం కావడం వారికి కలిసొచ్చింది. ఇక ఈ మ్యాచ్‌ను జూన్‌లోనే నిర్వహించడం కూడా భారత ఆటగాళ్లకు పెద్ద సమస్యగా మారుతోంది. రెండు నెలల పాటు ఐపీఎల్‌ ఆడిన అలసటతో, టీ20 దృక్పథంతో ఇంగ్లాండ్‌కు వచ్చి.. ఇక్కడి పరిస్థితులకు సరిగా అలవాటు పడకుండా మ్యాచ్‌ ఆడటం టీమ్‌ఇండియాకు ప్రతికూలమైంది. మరోవైపు రెండేళ్ల సుదీర్ఘ కాలం టెస్టు ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించి..   చివరికి ఫైనల్‌కు ఒక్క మ్యాచ్‌తో ముగించేయడం సరైందేనా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నిర్వహిస్తే బాగుంటుందని రోహిత్‌ సైతం మ్యాచ్‌ అనంతరం అభిప్రాయపడ్డాడు. తర్వాతి డబ్ల్యూటీసీ ఫైనల్‌ విషయంలో  ఐసీసీ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని