చాహర్‌ అద్భుతం.. భారత్‌ ఘన విజయం

దీపక్‌ చాహర్‌ మాయ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్‌ ఉండగానే భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ

Updated : 21 Jul 2021 01:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దీపక్‌ చాహర్‌(69 నాటౌట్‌; 82 బంతుల్లో 7x4, 1x6) మాయ చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేశాడు. భువనేశ్వర్‌ కుమార్‌(19; 28 బంతుల్లో 2x4)తో కలిసి భారత్‌కు ఊహించని విజయం అందించాడు. దాంతో గబ్బర్‌సేన మూడు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో గెలుపొందడమే కాకుండా 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన చాహర్‌, భువనేశ్వర్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వికెట్లు కాపాడుకుంటూ చివరి వరకూ క్రీజులో పాతుకుపోయారు. ఈ క్రమంలోనే చాహర్‌ 64 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివరికి 49.1 ఓవర్‌కు విన్నింగ్‌ షాట్‌ కొట్టి భారత్‌కు మరిచిపోలేని విజయం అందించాడు. అంతకుముందు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ (53: 44 బంతుల్లో 4X6), కృనాల్‌ పాండ్యా (35: 54 బంతుల్లో 3X4) రాణించారు. అయితే, టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా(13), శిఖర్‌ ధావన్‌(29), ఇషాన్‌ కిషన్ (1) విఫలమయ్యారు. మధ్యలో మనీశ్‌ పాండే (37; 31 బంతుల్లో 3x4) ఉన్నంతసేపు బాగా ఆడినా అనుకోని పరిస్థితుల్లో ఔటయ్యాడు.

ఇక తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (50; 71 బంతుల్లో 4x4, 1x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ చారిత్‌ అసలంక (65; 68 బంతుల్లో 6x4) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నె(44 నాటౌట్‌; 33 బంతుల్లో 5x4) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆతిథ్య జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ లంక ఓపెనర్లు ఫెర్నాండో, భానుక (36; 42 బంతుల్లో 6x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరిని చాహల్‌ విడదీశాడు. 14వ ఓవర్‌లో వరుస బంతుల్లో భానుకతో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రాజపక్స(0)ను ఔట్ చేశాడు. దాంతో భారత్‌కు ఉపశమనం కలిగించాడు. తర్వాత ధనంజయ (32; 45 బంతుల్లో 1x4)తో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్‌ నిర్మించాడు. వీరిద్దరూ 47 పరుగులు జోడించాక ఫెర్నాండో ఔటయ్యాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్నాక భువనేశ్వర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. కాసేపటికే ధనంజయ సైతం ఔటయ్యాడు. అప్పటికి శ్రీలంక స్కోర్‌ 134/4గా నమోదైంది.

ఈ నేపథ్యంలోనే మరోసారి జోడీ కట్టిన అసలంక, కెప్టెన్‌ దాసున్‌ షనక (16; 24 బంతుల్లో 1x4) నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, చాహల్‌ బౌలింగ్‌లో షనక బౌల్డయ్యాక.. కాసేపటికే హసరంగా(8)ను దీపక్‌ చాహర్‌ బోల్తా కొట్టించాడు. ఆపై అసలంక, కరుణరత్నె మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అయితే, చివర్లో అసలంక ధాటిగా ఆడే క్రమంలో భువి బౌలింగ్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ దేవ్‌దత్‌ చేతికి చిక్కాడు. అనంతరం టెయిలెండర్లతో కలిసిన కరుణరత్నె చివరివరకు బ్యాటింగ్‌ చేశాడు. దాంతో శ్రీలంకకు మరోసారి విలువైన పరుగులు అందించాడు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని