Asian Games: భారత్‌ జోరు.. ఈక్వస్ట్రియన్‌లో బంగారు పతకం

ఆసియా గేమ్స్‌లో (Asian Games) భారత్‌ అథ్లెట్లు పతకాల వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ మరో బంగారు పతకం కైవసం చేసుకున్నారు.

Updated : 26 Sep 2023 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ బంగారు పతకం కైవసం చేసుకోవడం గమనార్హం. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌లో భారత్‌కి నాలుగో గోల్డ్ మెడల్. మిగిలిన మూడు బంగారు పతకాలు 1982 ఆసియా క్రీడల్లో గెల్చుకోవడం విశేషం. మరోవైపు, సెయిలింగ్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సెయిలింగ్‌లోనే మరో రెండు పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి. పురుషుల విభాగంలో రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఎబాద్‌ అలీ ఆర్‌ఎస్ - X కేటగిరీలో, విష్ణు శరవణన్ ఐఎల్‌సీఏ విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య పతకాలు సాధించారు.

భారత బాక్సర్ సచిన్‌ అదరగొట్టేశాడు. దీంతో రెండో రౌండ్‌లోకి ఎంటరయ్యాడు. 57 కేజీల విభాగంలో ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్‌పై 5-0 ఆధిక్యంతో విజయం సాధించాడు. ఇక 92 కేజీల విభాగంలో 16వ రౌండ్‌లో కర్గిస్థాన్‌ బాక్సర్ ఒముర్‌బెక్‌తో భారత బాక్సర్ నరేంద్ర తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఈస్పోర్ట్స్‌లో భారత ద్వయం అయాన్ బిస్వాస్, మయాంక్ అగర్వాల్ స్ట్రీట్‌ ఫైటర్ నాకౌట్‌ రౌండ్ల నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. టెన్నిస్‌లో సుమిత్‌ నగల్‌ మూడో రౌండ్‌లో తలపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని