KL Rahul : ప్రస్తుతానికైతే టెస్టు కెప్టెన్సీ.. ఆలోచన లేదు! అవకాశం వస్తే..: కేఎల్‌ రాహుల్

టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ గురించి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని కేఎల్ రాహుల్ అన్నాడు. ఒక వేళ అవకాశం వస్తే మాత్రం వదులుకోనని పేర్కొన్నాడు. రేపటి (జనవరి 19)  నుంచి ప్రారంభం..

Published : 19 Jan 2022 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ గురించి ప్రస్తుతం ఎలాంటి ఆలోచనా లేదని కేఎల్ రాహుల్ అన్నాడు. ఒక వేళ అవకాశం వస్తే మాత్రం వదులుకోనని పేర్కొన్నాడు. రేపటి (జనవరి 19) నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడాడు. గాయం కారణంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డే సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్‌ జట్టుని నడిపించనున్న విషయం తెలిసిందే. 

‘ప్రస్తుతానికైతే టెస్టు కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదు. అవకాశం వస్తే మాత్రం జట్టుని ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా. దేశానికి నాయకత్వం వహించడమనేది అన్నింటికి మించిన గొప్ప గౌరవం. ఏ ఆటగాడైనా అలాంటి అవకాశాన్ని వదులుకునేందుకు ఇష్టపడడు. అందుకు నేనేం మినహాయింపు కాదు. ఇటీవల జొహన్నెస్‌ బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నా. అలాగే, జట్టుని నడిపించే విషయంలో మాజీ కెప్టెన్లు ధోని, విరాట్‌ కోహ్లీల నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకున్నా. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. వన్డే కెప్టెన్‌గా జట్టుని నడిపించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నేను గత 14 - 15 నెలలుగా వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తున్నా. కొన్నిసార్లు నాలుగు, ఐదు స్థానాల్లో కూడా ఆడా. జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధమే. ప్రస్తుత వన్డే సిరీస్‌కు రోహిత్ గైర్హాజరీతో.. నేను ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నా’ అని కేఎల్ రాహుల్ చెప్పాడు. 

‘కోహ్లీ నాయకత్వంలో టీమ్‌ఇండియా ఎన్నో మరుపురాని విజయాలు సాధించింది. కెప్టెన్‌గా అతడు కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడు. వాటిని అలాగే కొనసాగిస్తే చాలనుకుంటున్నాను. శిఖర్‌ ధావన్‌ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉండటం మా జట్టుకు కలిసొచ్చే అంశం. అతడి నుంచి భారత జట్టు ఏం ఆశిస్తుందో అతడికి బాగా తెలుసు. మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లున్నారు. తొలి వన్డే జరుగనున్న బోలాండ్ పార్క్‌ మైదానం స్పిన్‌కి అనుకూలిస్తుంది. ఆ పిచ్‌పై రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌ మెరుగ్గా రాణించగలరనే నమ్మకముంది. వన్డే క్రికెట్ అరంగేట్రం కోసం యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు. ఫాస్ట్ బౌలింగ్‌ చేయగల ఆల్‌ రౌండర్‌ కోసం భారత్‌ చాలా రోజులుగా వేచి చూస్తోంది. వెంకటేశ్ రాకతో ఆ లోటు తీరిందనుకుంటున్నాను’ అని రాహుల్ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని