
Sports news: హరియాణా.. ఒలింపిక్స్ వీరుల ఖిల్లా.. ఛాంపియన్ల కర్మాగారం
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: ఎన్నాళ్లకెన్నాళ్లకు .. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ మరోసారి స్వర్ణం సాధించింది. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శనతో స్వర్ణం లభించింది. 130 కోట్ల భారతీయుల మనస్సు ఉప్పొంగుతుండగా చోప్రా పతకం స్వీకరించాడు. చోప్రా స్వస్థలం హరియాణా. తాజా ఒలింపిక్స్లో ఇప్పటి వరకు భారత్కు ఏడు పతకాలు రాగా అందులో మూడు హరియాణా క్రీడాకారులే సాధంచడం విశేషం. చోప్రా స్వర్ణంతో, కుస్తీలో రవికుమార్ దహియా రజతంతో, భజరంగ్ పునియా కాంస్యం గెలుపొందారు. చిన్న రాష్ట్రమైన హరియాణా క్రీడల్లో దేశంలో అగ్రభాగాన నిలువడం వెనుక గల కారణాలను తెలుసుకుందాం.
ప్రభుత్వ క్రీడా విధానం
హరియాణా ప్రభుత్వ క్రీడాల విధానంతో మారుమూల ప్రాంతాల్లోనూ క్రీడలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు ఏర్పాటుచేశారు. 22 జిల్లాల్లో అనేక క్రీడా నర్సరీలను నెలకొల్పారు. అంబాలాలో భారీ స్టేడియం ఉంది. దీంతో ప్రాథమిక స్థాయిలోనే పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఏర్పడుతోంది.
పతకం తెచ్చుకో ఉద్యోగం అందుకో
హరియాణాలో కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అలాగే ఉంది. దీంతో చిన్న వయసులోనే క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ సర్కారీ లభిస్తుందన్న విశ్వాసం యువతలో ప్రబలంగా ఉంది. ప్రభుత్వం సైతం పతకాలు తెచ్చుకున్న క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడంతో యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
పతకాల వెల్లువ
గత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 66 మెడల్స్ సాధిస్తే హరియాణ వాటా 22. దీంతో పాటు దేశవాళీ క్రీడల్లోనూ వీరు సత్తా చూపుతుండటంతో యువత క్రీడలపై ఆసక్తి చూపుతున్నారు.
ఛాంపియన్ల కర్మాగారం
1983లో తొలిసారి భారత్ క్రికెట్లో వరల్డ్కప్ గెలిచింది. ఆ సమయంలో భారత క్రికెట్ సారథి కపిల్దేవ్. ఆయన హరియాణాకు చెందినవారే. అనంతరం బాక్సింగ్ సంచలనం విజేంద్రసింగ్, కుస్తీలో ఫొగట్ సోదరీమణుల అద్వితీయ ప్రదర్శన తెలిసిందే. హరియాణా ప్రభుత్వం సైతం కోట్లాది రూపాయలను విజేతలకు కానుకగా ఇవ్వడంతో వేలాదిమంది యువత క్రీడల్లో రాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక దిల్లీ నగరం దగ్గరగా ఉండటంతో ఎక్కువమంది ప్రైవేటు కంపెనీల్లో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. దీనికి దేహ దారుఢ్యం ఉండాలి. హరియాణ యువత భారీగా కసరత్తులు చేసి ఫిట్నెస్తో ఉండటంతో ఆరోగ్యంతో పాటు ఉపాధి లభిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.