ప్రతి ఆరుగురిలో ఒకరికి.. భారతీయుల్లో మధుమేహం ముప్పు

భారతీయుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ బాధితులు కావొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంటున్నారు. టైప్‌-2 మధుమేహానికి జన్యువులు ఎలా దోహదం చేస్తున్నాయో

Updated : 13 May 2022 06:08 IST

సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ బాధితులు కావొచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు అంటున్నారు. టైప్‌-2 మధుమేహానికి జన్యువులు ఎలా దోహదం చేస్తున్నాయో తెలుసుకునేందుకు జనాభా నిర్దిష్ట జన్యుపర వ్యత్యాసాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. విభిన్న వర్గాల జనాభాపై ప్రపంచవ్యాప్త అధ్యయనం చేపట్టారు. ఇప్పటివరకు ఈ తరహా అధ్యయనాలు ఎక్కువగా యూరోపియన్‌ పూర్వీకుల జనాభాపై చేపట్టారు. అయితే ఇటీవలి కాలంలో మధుమేహ ముప్పును దక్షిణాసియా, భారత్‌, చైనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన ప్రముఖ పరిశోధకుల్లో ఒకరైన సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ గిరిరాజ్‌ ఆర్‌ చందక్‌ ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ అధ్యయనం చేపట్టారు. యూరోపియన్లతో పోలిస్తే భారతీయుల్లో జన్యుపరమైన వైవిధ్యం ఎక్కువ కావడంతో యూరోపియన్‌ డేటాను ఉపయోగించి భారతీయ జనాభాలో టైప్‌-2 మధుమేహం ప్రమాదాన్ని అంచనా వేశారు. మధుమేహంతో బాధపడుతున్న 1.8 లక్షల మంది వ్యక్తుల డీఎన్‌ఏను అయిదు పూర్వీకుల సమూహాలకు చెందిన 11.6 లక్షల సాధారణ నమూనాలతో పోల్చారు. ఈ సమూహాల్లో యూరోపియన్లు, తూర్పు ఆసియా వాసులు, దక్షిణాసియా వాసులు, ఆఫ్రికన్లు, హిస్పానిక్‌లు ఉన్నారు. ఈ అధ్యయనం ఫలితాల ఆధారంగా భారతీయుల్లో ప్రతి ఆరో వ్యక్తి మధుమేహ బాధితుడు కావొచ్చని తేలిందని డాక్టర్‌ గిరిరాజ్‌ చందక్‌ పేర్కొన్నారు. దక్షిణాసియా జనాభాను మరింతగా పరిశోధించడానికి, కచ్చితమైన ఔషధం అభివృద్ధికి ఈ పరిశోధన దోహదం చేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ నందికూరి తెలిపారు. డయాబెటిస్‌ మెటా-ఎనాలలిస్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ ఎత్నిక్‌ అసోసియేషన్‌ పేరుతో చేపట్టిన ఈ అధ్యయనం తాజాగా నేచర్‌ జెనిటిక్స్‌లో ప్రచురితమైంది.

నేడు ఎంఆర్‌ఎన్‌ఏ టీకా వివరాల వెల్లడి
సీసీఎంబీ దేశీయంగా తొలి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ సాంకేతికతపై ప్రైవేటు సంస్థలతో కలిసి సీసీఎంబీ కొవిడ్‌ సమయం నుంచి పరిశోధనలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని