Amaravati: రాజధాని అమరావతే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు ప్రధానాంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 58కి లోబడి అమరావతి రాజధాని నగరం,
ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందే
మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
రాజధాని ప్రాంతంలో నెలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
రాజధాని నగరాన్ని ఆరు నెలల్లో నిర్మించాలి
రైతులకు 3 నెలల్లో ప్లాట్లు అప్పగించాలి
దీనికి తప్ప మరే అవసరాలకూ ఆ భూముల్ని తాకట్టు పెట్టకూడదు
సీఆర్డీఏ, ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు
ఈనాడు - అమరావతి
29,754 మంది రైతులు భూసమీకరణలో 33,771 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. వీరిలో 93శాతం మంది చిన్న, సన్నకారు రైతులు. వారి జీవనాధారం దెబ్బతింటున్నప్పుడు కోర్టు మౌనసాక్షిగా ఉండాలా? అధికారాన్ని ఉపయోగించాలా? రైతులు హుందాతనంగా జీవించే హక్కును ప్రభుత్వం లాగేసుకుంది.
- హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు ప్రధానాంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 58కి లోబడి అమరావతి రాజధాని నగరం, ఆ ప్రాంతంలో రహదారులు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో కల్పించాలని ఆదేశించింది. సెక్షన్ 61 ప్రకారం రాజధానిలోని టౌన్ ప్లానింగ్ స్కీమ్ (నవ నగరాలు) పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
రాజధాని కోసం భూములిచ్చిన యజమానులు, రైతులకు మౌలిక సదుపాయాలన్నీ కల్పించి, నివాసయోగ్యంగా ప్లాట్లను సిద్ధం చేసి మూడు నెలల్లోగా అప్పగించాలని నిర్దేశించింది. భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తేల్చిచెప్పింది. రాజధాని కోసం సమీకరించిన భూములను రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధికి తప్ప.. తాకట్టు పెట్టడానికి, వాటిపై మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ)కి హక్కులు కల్పించొద్దని స్పష్టం చేసింది. అమరావతిలో అభివృద్ధి పనులపై పురోగతిని తెలియజేస్తూ ప్రత్యేకంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టంగా నిర్దేశించింది. వీటన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సమస్యలను కారణాలుగా చూపుతూ అమరావతిలో నిర్మాణాలు చేపట్టలేమంటే కుదరదని కుండబద్దలు కొట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు రాజధానిలోని కార్యాలయాల తరలింపును నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాలను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, ఎస్.మురళీధర్రెడ్డి, మండల రమేశ్, గిరిబాబు తదితరులకు 17 వాజ్యాల్లో ఒక్కోదానికి రూ.50 వేల చొప్పున మొత్తం 8.5 లక్షలు ఖర్చులు కింద చెల్లించాలని ఆదేశించింది. రాజధాని బృహత్తర ప్రణాళికను సీర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా సవరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జీఎన్రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, ఉన్నతస్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలను తగిన సమయంలో పిటిషనర్లు సవాలు చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చింది. అమరావతి నుంచి రాజధాని తరలిస్తూ శాసనం చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను పెండింగ్లోనే ఉంచింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం (యాక్ట్ 11/2021) తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినా.. తమ వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను అమలు చేయాలని విన్నవించారు. భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా, హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో దాని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని కోరారు. మూడు రాజధానుల నిర్ణయానికి ఆధారమైన కమిటీ నివేదికలను రద్దు చేయాలని, రాజధానిని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాన్ని కొనసాగించాలని, సీఆర్డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనలతో వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినందున ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. గురువారం నిర్ణయాన్ని వెల్లడించింది.
మొత్తం పది అంశాలపై స్పష్టత
ఇరువైపుల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం మొత్తం పది అంశాలపై స్పష్టత ఇస్తూ తీర్పు వెలువరించింది. ఏపీ సీఆర్డీఏ చట్టప్రకారం నోటిఫై అయిన రాజధాని నగరం, హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి శాసనం చేసే అధికారం లేదంటూ కీలక ఉత్తర్వులిచ్చింది. రాజధానిగా నోటిఫై అయిన అమరావతిని మార్చడం లేదా మూడు రాజధానులుగా విభజించడంపై శాసనం చేసే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు ప్రధానంగా వాదనలు వినిపించారని తెలిపింది. ప్రస్తుతం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినప్పటికీ.. బహుళ రాజధానులు తెస్తామని ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో రాజధానిని మారుస్తూ శాసనం చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ప్రకటించాలని కోరారని తెలిపింది. అధికరణ 3, 4 ప్రకారం పార్లమెంటు తీసుకొచ్చిన ఏపీ విభజన చట్టప్రకారం నూతన రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారన్నారని గుర్తుచేసింది.
‘మూడు రాజధానుల చట్టం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. చట్టబద్ధ పాలన (రూల్ ఆఫ్ లా) సూత్రం ప్రకారం సుపరిపాలన అందించాలంటే స్థిరత్వం, నిలకడ ఉండాలి. ఈ నేపథ్యంలో నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరెక్కడా రాజధాని ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. అందుకు భిన్నంగా చట్టం తెస్తే న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చు’ అని పిటిషనర్లు వాదించారని గుర్తుచేసింది.
* మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసినా పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత ఆ విషయంలో శాసనం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అని తేల్చాల్సింది కోర్టేనని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మళ్లీ చట్టం చేసే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. కోర్టు తీర్పు రాకముందే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసుకుంది. భాగస్వాములతో సంప్రదింపులు జరిపి తిరిగి బిల్లులు పెడతామంటోంది. ఈ నేపథ్యంలో పిటిషనర్లు శాసనాధికారంపై తేల్చాలని కోర్టును కోరుతున్నారు. ఏపీ సీఆర్డీఏ చట్టం తెచ్చి, భూములు సమీకరించాక, రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అధికారాన్ని ఉపయోగించే రాజధానిని ఏర్పాటు చేశారనే పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తున్నాం. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగరం నుంచి హైకోర్టు, రాజధాని, శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు, మూడురాజధానులు తీసుకొచ్చే విషయంలో రాష్ట్రానికి శాసనాధికారం లేదని స్పష్టం చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి శాసనం చేయలేదు
రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం.. రాష్ట్రప్రభుత్వానికి ఒకేసారి అధికారాన్ని దఖలుపరిచింది. ఆ అధికారం ప్రకారం ఒకసారి రాజధాని నిర్ణయం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో రెండోసారి శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ‘మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తూనే.. బహుళ రాజధానులు తీసుకొస్తామని ప్రభుత్వం అంటోంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని, రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మండలి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని చెబుతోంది. పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా రాజధాని అమరావతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి శాసనం చేయలేదు. రాష్ట్రానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు కూడా ఉంది. దాన్ని ఉపయోగించి పార్లమెంట్ ఓసారి ఏపీ విభజన చట్టం-2014 తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తర్వాత సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టం తీసుకురావడం చట్టవిరుద్ధమని అభిప్రాయపడుతున్నాం. వివిధ రాష్ట్రాల విభజన చట్టాల్లో రాజధాని ప్రస్తావన లేదు. ఏపీ విభజన చట్టంలో మాత్రమే రాజధాని ప్రస్తావన ఉంది. పార్లమెంట్ ఏపీ కోసం ఆంగ్ల పదం ‘ఏ క్యాపిటల్’ అని స్పష్టం చేసింది. అంటే ఒక రాజధాని మాత్రమేనని పేర్కొంది.
కోర్టు మౌనసాక్షిగా ఉండాలా?
29,754 మంది రైతులు భూసమీకరణలో 33,771 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. వారికి ఇతర ప్రయోజనాలతోపాటు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజారాజధాని నిర్మిస్తాం, అందులో నివసిస్తారని ప్రభుత్వం చెప్పింది. ఈ కేసుల్లో 93 శాతం పిటిషనర్లు చిన్న, సన్నకారు రైతులు. వారి జీవనాధారం దెబ్బతింటున్నప్పుడు కోర్టు మౌనసాక్షిగా ఉండాలా? అధికారాన్ని ఉపయోగించాలా? ఈ కేసుల్లో రైతులు హుందాగా జీవించే హక్కును ప్రభుత్వం లాగేసుకుంది.
హైకోర్టును తరలించే అధికారం రాష్ట్రానికి లేదు
మూడు రాజధానుల చట్టంలో న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తామని అంటున్నారు. దీన్ని అంగీకరిస్తే.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నచ్చినట్లు హైకోర్టును మార్చుకోవచ్చు. అదే జరిగితే న్యాయవ్యవస్థకు తీవ్ర నష్టమే కాదు రాష్ట్ర ఖజానాకు భారం కూడా. శ్రీకాకుళం నుంచి కర్నూలుకు కక్షిదారులు ప్రయాణించడం భారంగా మారుతుంది. సుప్రీంకోర్టు తీర్పు, ఏపీ విభజన చట్టం నిబంధనల ప్రకారం హైకోర్టు ప్రధాన స్థానాన్ని రాష్ట్రపతి మాత్రమే నిర్ణయించగలరు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. హైకోర్టు ప్రధాన బెంచ్ను తరలించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు. ఏపీ గవర్నర్ ఆమోదంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ప్రాంతీయ ధర్మాసనాలు ఏర్పాటు చేయవచ్చు’ అని తీర్పులో పేర్కొంది.
చట్టబద్ధమైన ఒప్పందాన్ని ఉల్లంఘించలేరు
అభివృద్ధి ఒప్పందం, భూసమీకరణ పథకం నిబంధనల ప్రకారం సీఆర్డీఏకు, రైతులకు మధ్య కుదిరింది చట్టబద్ధమైన ఒప్పందం. దీన్ని ఏ ఒక్కరూ అతిక్రమించజాలరు. ఈ ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. కాంట్రాక్ట్ చట్టం ప్రకారం ప్రస్తుతం కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు. ఈ ఒప్పందం ప్రకారం సమీకరించిన భూమిని అభివృద్ధి చేసి రాజధానిలో ప్లాట్లను రైతులకు అప్పగించాలి. ఇందుకుగాను ఎకరాకు 3,400 చదరపు గజాలు సీఆర్డీఏ వద్దే ఉంటుంది. ఏదైనా షరతు ఉంటే తప్ప కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం కుదిరిన ఒప్పందంలోని ఫాం 9.14లో అలాంటి షరతేమీ లేదు. భూసమీకరణలో భాగంగా సీఆర్డీఏ రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎలాంటి చెల్లింపులు లేకపోయినప్పటికీ.. సీఆర్డీఏ వద్ద భూమి ఉంటుంది. ఇరుపక్షాలూ ప్రయోజనం పొందుతున్నందున, ఒప్పందం అమలు పరస్పర బాధ్యత. అభివృద్ధి ఒప్పందంలోని నిబంధనలు ఫాం 9.14 ప్రకారం ఒప్పందాన్ని రద్దు చేసుకునే అధికారం ఇరు పక్షాల(పార్టీల)కూ లేదు. జీపీఏ రద్దుకు అవకాశం లేనందున అభివృద్ధికి సీఆర్డీఏ కట్టుబడి ఉండాల్సిందే. భూసమీకరణ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో ప్రకారం సీఆర్డీఏ దశలవారీగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఒప్పందంలోని షరతులను విస్మరిస్తే అది సీఆర్డీఏ చట్టానికి, భూసమీకరణ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లే. ఇది ప్రైవేటు ఒప్పందం కాదు. శాసనం ద్వారా కొన్ని నిబంధనలతో కుదిరింది. ఇందులో సీఆర్డీఏకు భూమిని అప్పగించడం స్వచ్ఛందమైనప్పటికీ అది రైతుల చట్టబద్ధమైన బాధ్యత. అభివృద్ధి చేసిన ప్లాటును రైతుకు అప్పగించడం సీఆర్డీఏ బాధ్యత.
రైతుల హక్కుల్ని కాలరాయటమే
రాజధాని కోసమే భారీ ఎత్తున భూమి అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం రాజధానిని ఇక్కడి నుంచి మార్చలేదు. అలాంటి చర్యలు చేపట్టటమంటే అది భూములిచ్చిన రైతుల హక్కుల్ని కాలరాయటమే. సమీకరించిన భూముల్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ కట్టుబడి ఉండాలి. ఆ భూముల్ని పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించటం, ఇతర అవసరాలకు రుణాలు పొందటం కోసం తనఖా పెట్టటం వంటి చర్యలు భూసమీకరణ పథకానికి విరుద్ధం.
అది చట్టబద్ధమైన ఒప్పందం
రాజధాని ప్రాంత అభివృద్ధి కోసమే భూసమీకరణ జరిగింది. ఇది చట్టబద్ధమైన ఒప్పందం. రాజ్యాంగంలోని అధికరణ 298, 299 పరిధిలోకి రాదు. ఒప్పందాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ సంస్థలు విఫలమైనప్పుడు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సీఆర్డీఏ ప్రభుత్వ సంస్థ అయినందున రాజధానిని ప్రభుత్వమే నిర్మించాలి. భూములిచ్చిన రైతులు ప్రభుత్వ చర్యలతో జీవనాధారాన్ని కోల్పోయారు. ప్రభుత్వం, సీఆర్డీఏలు రాజ్యాంగంలోని అధికరణ 21, 300-ఎలను ఉల్లంఘించాయి.
ఏకాభిప్రాయంతోనే రాజధాని నిర్ణయం
శివరామకృష్ణన్ కమిటీ సిఫారసుల్లో భాగంగా గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీగా అమరావతిని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ ప్రతిపాదనను ఎలాంటి నిరసన వ్యక్తం చేయకుండా ఆమోదించారు. దీంతో గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ 2014లో ఉత్తర్వులిచ్చింది. సీఆర్డీఏ చట్టం కింద భూసమీకరణ పథకానికి రూపకల్పన జరిగింది. కార్యనిర్వాహక, న్యాయ, శాసనవ్యవస్థలు అమరావతిలోనే ఉంటాయని రైతులు భావించారు. అయితే కొత్త ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చింది. ఒప్పందం ప్రకారం చట్టబద్ధ అంచనాలను అమలు చేసి తీరాల్సిందే. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, పట్టణాభివృద్ధిశాఖ అదనపు కార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని అంగీకరించారు. అందువల్ల సీఆర్డీఏ చట్టం, భూసమీకరణ నిబంధనల ప్రకారం సీఆర్డీఏ తన బాధ్యతలను నెరవేర్చాల్సిందే. మూడు రాజధానుల విధానం వల్ల అమరావతిలో శాసన రాజధాని తప్ప మరేమీ మిగలదు. భవనాల నిర్మాణం తప్ప ఎలాంటి అభివృద్ధీ ఉండదు. గవర్నరుకు రాజ్యాంగంలోని అధికరణ 163 ప్రకారం సభలను ఎక్కడైనా నిర్వహించే అధికారం ఉంది. సంబంధిత ప్రదేశంలో సమావేశానికి హాజరుకావాలని రెండు సభలనూ ఆదేశించవచ్చు. దీనికి అసెంబ్లీ భవనమే అక్కర్లేదు. గవర్నరు బంగళాను కార్యనిర్వాహక రాజధానికి తరలిస్తే ఆయన ఉన్న ప్రాంతంలోనే సభలు జరిగే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా రాజధాని రైతులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి 3 రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటు కాదు.
* కేటీ రవీంద్రన్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు, ఉన్నత స్థాయి కమిటీలు సమర్పించిన నివేదికల చట్టబద్ధతను మేము నిర్ణయించట్లేదు. పిటిషనర్లు అవసరం అనుకుంటే ఆ అంశంపై విడిగా ప్రత్యేక రిట్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు’ అని హైకోర్టు పేర్కొంది.
కోర్టు పేర్కొన్న అంశాలు
1. రైతులతో చేసుకున్నది చట్టబద్ధ ఒప్పదం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ ఉల్లంఘించాయి. అందువల్ల జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చే అధికారం కోర్టుకు ఉంది.
2. నిర్మాణాలు చేపట్టడంలో విఫలమవడం.. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నుంచి వైదొలగడమే.
3. భూములు అందజేసిన రైతులకు హామీ ఇచ్చి దాని నుంచి వైదొలగడానికి వీల్లేదు.
4. రైతులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండటంలో ప్రభుత్వం, సీఆర్డీఏ విఫలమయ్యాయి. కాబట్టి కోర్టు తగిన ఆదేశాలివ్వొచ్చు.
5. జీవనాధారమైన భూములను అప్పగించిన రైతుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసింది. ఒప్పందం ప్రకారం భూములిచ్చిన వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు మూడేళ్లలో ఇవ్వాలి. ఆ గడువు 2018తోనే ముగిసింది.
6. ప్రభుత్వం మారినంత మాత్రాన విధానాలు మారకూడదు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన చట్టబద్ధ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ అభివృద్ధి పనులను నిలిపేయడాన్ని అనుమతించం. చేసిన ఖర్చుకు రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏదే బాధ్యత. ఈ నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాం.
7. నోటిఫై చేసిన రాజధాని బృహత్ప్రణాళికను.. ప్రభుత్వం, సీఆర్డీఏ తమంతట తాముగా సవరించడానికి వీల్లేదు.
8. రాజధానిని మార్చేందుకు, మూడుగా విభజించేందుకు శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తున్నాం.
తీర్పులోని మరికొన్ని ముఖ్యాంశాలు..
రైతులను మోసగించినట్లే..
‘ఈ కేసులో రైతులకు దఖలు పరిచిన రాజధాని ఏర్పాటు హక్కును వెనక్కు తీసుకుంటే అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం.. భరోసా ఇచ్చే ప్రాథమిక హక్కు ఉల్లంఘనా జరుగుతున్నట్లే. రైతుల హక్కులను కాపాడేందుకు ఈ కోర్టు నిరంతరం అవసరమైన ఆదేశాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. (ఇష్యూ ఏ రిట్ ఆఫ్ కంటిన్యూస్ మాండమస్) సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నుంచి వెనక్కు వెళ్లకూడదు అనే వాదన ఆధారంగానే చాలా మంది రైతులు కేసు దాఖలు చేశారు. సీఆర్డీఏ లేదా ప్రభుత్వం రాజధానిలో సగంలో ఆగిన నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రయత్నించలేదు. మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయి. నిర్దేశిత సమయంలోపు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ఈ విషయంలో సీఆర్డీఏ, రాష్ట్రం తదనుగుణంగా చర్యలు తీసుకోపోవడాన్ని మోసంగానే అభివర్ణించవచ్చు.
ఆర్థిక కష్టాలున్నా రాజధాని నిర్మించాల్సిందే
రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ రాజ్యాంగం ప్రజలకు కల్పిస్తున్న విశ్వాసాన్ని కాపాడాల్సిందే. ముఖ్యమంత్రి, మంత్రిమండలి కూడా రాజ్యాంగం ప్రజలకు కల్పించే నమ్మకాన్ని నిలబెట్టే ప్రతినిధులుగా ఉండాలి. ఏ ఒక్కరికో ప్రయోజనం కల్పించేందుకో, విస్తృత రాజకీయ ప్రయోజనాల కోసమో నిర్ణయాలు తీసుకోకూడదు. పాత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించడం కొత్త ప్రభుత్వ బాధ్యత. ఆ నిర్ణయాలు, ప్రాజెక్టులు రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా ఉంటే తప్ప మార్పులు చేయకూడదు. ప్రస్తుత కేసులో పాత ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న అభియోగాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సీఆర్డీఏ, ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూముల్లోనే రాజధాని నిర్మించాలి.
పథకాలకు కోట్లు ఖర్చుపెడుతున్నారుగా..
రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్న విషయాన్ని మేం అంగీకరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆర్టికల్ 38 ప్రకారం ప్రజలకు సాంఘిక సంక్షేమం కింద వివిధ పథకాల పేరుతో కోట్లకు కోట్లు చెల్లిస్తోంది. లక్షల కోట్లు అప్పులు చేయడంతో పాటు వచ్చిన ఆదాయం మొత్తం పథకాలపైనే ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 38 ప్రకారం తన బాధ్యత నెరవేర్చడానికి ఎంత శ్రద్ధ చూపుతోందో సీఆర్డీఏ చట్టం 2014, 2015 నిబంధనల ప్రకారం రాజధాని అభివృద్ధిపై అంతకన్నా ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఇప్పటికే అమరావతి రాజధానిలో రూ.15 వేల కోట్లు ఖర్చు చేయడంతో పాటు మరో రూ.32 వేల కోట్ల పనులు ప్రారంభించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా మౌనం పాటిస్తోంది. పట్టణపరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు అభివృద్ధి చేస్తామంటూ అఫిడవిట్లు సమర్పించడం తప్ప పనుల విషయంలో మౌనంగా ఉండటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే. అమరావతిలో ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు నెలకొల్పేందుకు భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.15వేల కోట్లు సమీకరించింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదిలేయడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
మొక్కలు నాటటం తప్ప ఏ అభివృద్ధీ లేదు
ఆర్థిక సమస్యలు లేదా మరే ఇతర కారణమో చూపించి రాజధాని నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనను మధ్యలో నిలిపేయటానికి వీల్లేదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను మధ్యలో వదిలిపెట్టరాదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని నిర్మాణాలు నిలిచిపోయాయి. రోడ్డు పక్కన, డివైడర్లపై మొక్కలు నాటటం మినహాయించి రాజధానిలో ఏ అభివృద్ధి పనులూ చేపట్టలేదు. ప్రజోపయోగ పనుల కోసం భూముల్ని సేకరించినప్పుడు ఆ భూమిని స్థిరాస్తి వ్యాపారం లేదా లాభదాయకత కోసం వినియోగిస్తామంటూ వినతులిచ్చే శాఖలు, వ్యక్తుల్ని అనుమతించకూడదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. సీఆర్డీఏ చట్టం నియమావళిలోని 12, 13, 14 నియమాల ప్రకారం భూసమీకరణ పథకానికి సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి మూడేళ్లలోగా ఆ భూముల్లో దశలవారీగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. తర్వాత 30 రోజుల వ్యవధిలో సీఆర్డీఏ కమిషనర్ దానిపై నోటీసు ప్రచురించాలి. లే అవుట్ల పూర్తికి సంబంధించిన ధ్రువపత్రాలు జారీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్డీఏ ఇప్పటివరకూ ఆ నియమావళికి అనుగుణంగా నడుచుకోలేదు.
ఆర్5 జోన్ ఏర్పాటు చేయటం అక్రమం
రాజధాని అమరావతి నగర నిర్మాణ బృహత్ప్రణాళికను సవరించి కొత్తగా ఆర్5 జోన్ను ఏర్పాటు చేస్తూ 2020 మార్చి 10న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అక్రమం. ఏకపక్షం. దాన్ని కొట్టేస్తున్నాం. రాజధానిలో ఆర్5 జోన్ను సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా బృహత్ ప్రణాళికను సవరించిందని సీఆర్డీఏ కమిషనర్ న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలా సవరించే అధికారం సీఆర్డీఏకి లేదు. చట్టప్రకారం బృహత్ ప్రణాళిక తయారీ, దాన్ని గెజిట్లో ప్రచురించేందుకు, సవరించేందుకు సీఆర్డీఏకి అధికారం ఉంది. అయితే స్థానిక సంస్థల నుంచి సూచనలు, ప్రతిపాదనలు వస్తేనే ఆ సవరణ చేపట్టాలి. ఆర్5 జోన్ ఏర్పాటుకు బృహత్ప్రణాళికను సవరిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇవేమీ అమలుకాలేదు.
ప్రభుత్వానిది అధికార దుర్వినియోగం
ప్రభుత్వం, సీఆర్డీఏ మితిమీరిన విచక్షణతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి. ఏకపక్ష నిర్ణయాలతో చట్టబద్ధమైన అంచనాలను దెబ్బతీస్తున్నపుడు అధికరణ 226 కింద కోర్టులు ఆదేశాలివ్వచ్చు. రాజధాని నిర్మాణం, అభివృద్ధి చేయని పక్షంలో రైతుల హక్కులకు భంగం కలుగుతుంది. ప్రభుత్వం అమరావతిలో సచివాలయం, హైకోర్టు, ఐఏఎస్ క్వార్టర్లు, ఎమ్మెల్యే, ఎంపీల నివాసాల నిర్మాణం చేపట్టింది. శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం ప్రారంభమైంది. కార్యదర్శులు, మంత్రుల క్వార్టర్లు పాక్షికంగా పూర్తయ్యాయి. ఇలాంటి సమయంలో మూడు రాజధానుల నిర్ణయం ఏకపక్షమే. చట్టం రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతమున్న నిర్మాణాలను కొనసాగించడం తప్ప మరో చర్య చేపట్టడానికి వీల్లేదు. ఒకవేళ ప్రభుత్వం, సీఆర్డీఏ భూమిని వెనక్కి ఇవ్వాలని నిర్ణయించినా వారి భూములను గుర్తించడం కష్టం. గత అయిదేళ్లుగా అవన్నీ పొదలు, ముళ్ల కంపలతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తులైన్లు వేయడంతో వ్యవసాయ భూములు ఉనికినే కోల్పోయి, సాగుకు పనికిరాకుండా తయారయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM