నీటి వాటా 50:50

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు.  తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడతామని ఆయన పునరుద్ఘాటించారు. రైతుల సంక్షేమం కోసం ఎంత వరకైనా వెళ్లడానికి, ఎవరినైనా ఎదుర్కొనడానికి సిద్ధమేనన్నారు.

Updated : 04 Jul 2021 09:52 IST

ఈ ఏడాది నుంచి కృష్ణా నీటిని ఇలాగే పంచాలి
పోతిరెడ్డిపాడును అంగీకరించం...రాయలసీమ ఎత్తిపోతలా అక్రమమే
హక్కులను కాలరాస్తే తెలంగాణ ప్రజలు సహించరు
అవసరమయితే కేంద్రంతో పోరాడతాం
కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తాం
నీటిపారుదల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


దశాబ్దాలపాటు తెలంగాణ.. సాగునీటికి గోస పడింది. స్వయంపాలనలోనూ అటువంటి పరిస్థితి రానివ్వం. జలవిద్యుత్‌ను కూడా రాష్ట్రానికి కేటాయించిన నీటి ద్వారానే ఉత్పత్తి చేస్తున్నాం. ఇందులో ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీల్లేదు. ట్రైబ్యునళ్ల ముందు, కేఆర్‌ఎంబీ వంటి బోర్డుల ముందు, న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ తెలంగాణ వాణిని వినిపిస్తాం. 


పొరుగు రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటాలను అవి హక్కుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. కేటాయింపులు లేని నికరజలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే ఇక్కడి ప్రజలు చూస్తూ ఊరుకోరు.


విద్యుత్‌ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్‌ఎంబీకి లేదు. జల విద్యుత్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల నడుమ ఎటువంటి ఒప్పందాలు, నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి అంశంలో కేఆర్‌ఎంబీ జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: బచావత్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు.  తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడతామని ఆయన పునరుద్ఘాటించారు. రైతుల సంక్షేమం కోసం ఎంత వరకైనా వెళ్లడానికి, ఎవరినైనా ఎదుర్కొనడానికి సిద్ధమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరి, తెలంగాణలో జలవిద్యుత్‌ ఉత్పత్తి...తదితర అంశాలపై శనివారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘ఆంధ్రా - తెలంగాణ నడుమ ఇప్పటిదాకా తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల వినియోగాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలి. ట్రైబ్యునల్‌ తుది కేటాయింపులయ్యేదాకా మొత్తం 811 టీఎంసీలల్లో ఆంధ్ర, తెలంగాణ చెరి సగం వినియోగిద్దాం’’ అని సమావేశంలో తీర్మానించారు. బేసిన్‌ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత, ఇంకా మిగులు జలాలు ఉంటే.. బయటి అవసరాల మీద దృష్టి పెట్టాలనేది సహజ న్యాయమని, దీన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విస్మరించడం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి ఎగువన ఉంది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకొని, నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితిలో తెలంగాణ ఉంది. సమైక్య పాలనలో ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. నూతన రాష్ట్రంలో ప్రథమ ప్రాధాన్యంగా కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టి సాగునీటి గోస తీర్చింది. దీంతో అత్యధిక దిగుబడులతో రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచింది.  ఇదంతా లిఫ్టుల ద్వారా నదీజలాలను ఎత్తిపోయడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించబోతున్నాం.

జలవిద్యుత్‌ అవసరం

ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టి నీళ్లు పారించుకునే పరిస్థితి మనకు లేదు. రాష్ట్రంలో రెండు పంటలకూ నీరందాలంటే.. జల విద్యుత్‌ అవసరం. ఎత్తిపోతల కోసం విద్యుత్‌ ఉత్పత్తి కోసం కేటాయించిన నీటిని వినియోగించుకుంటాం. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. దీనికి వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయాలనూ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదు. తెలంగాణలో 30 లక్షలకు పైగా బోర్లున్నాయి. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తులో 40శాతం సాగునీటి అవసరాలకే వినియోగమవుతోంది. తెలంగాణకున్న భూపరిస్థితుల దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుత్‌ ఉత్పత్తి కోసం కూడా నీరు అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని శాసనసభలోనూ, బయట అనేకసార్లు ప్రకటించారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు కూడా నాడు అదే విషయం చెప్పారు. నేడు పాలకులు మాట మార్చి అక్రమ ప్రాజెక్టులు చేపడుతున్నారు’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ ప్రభాకరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రకాశం బ్యారేజీ నీటిని కృష్ణా జిల్లా అవసరాలకు వాడుకోండి

‘‘పులిచింతలలో విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తుందంటూ ఏపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఈ సమావేశం పేర్కొంది. పులిచింతల నుంచి విడుదలైన నీటితో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జిల్లా అవసరాలను తీర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది. తద్వారా పట్టిసీమ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వినియోగించే విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకోవచ్చని సమావేశం ఆంధ్రా ప్రభుత్వానికి సూచించింది. విద్యుత్‌ ఉత్పత్తికి మాత్రమే ప్రత్యేకమైన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటిని వాడుకుంటుంటే, విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని ఆంధ్రా ప్రభుత్వం కెఆర్‌ఎంబీకి ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదం అని సమావేశం అభిప్రాయపడింది.
సీఎస్‌ను జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించినా ఇంకా మొండిగానే ముందుకా?
‘‘పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ పనులు చేపట్టవద్దని హరిత ట్రైబ్యునల్‌ స్టే ఇచ్చినా.. ఉల్లంఘించినందుకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించింది. అయినా మొండిగా సర్వేల ముసుగున పోతిరెడ్డి పాడు వద్ద పెద్ద ఎత్తున నిర్మాణ సామగ్రిని డంప్‌ చేసి, నిర్మాణాలు చేపట్టడం అన్యాయం’’ అని సమావేశం అభిప్రాయపడింది.

కృష్ణా బోర్డు సమావేశం రద్దు చేయాలి

‘‘జులై 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్వహించబోయే త్రిసభ్య సమావేశాన్ని రద్దు చేయాలి. 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి’’ అని కోరుతూ సమావేశం తీర్మానించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ఏపీ  చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఆ సమావేశంలో వాదనలను వినిపించేలా తెలంగాణ అంశాలనుఎజెండాలో చేర్చాలని పేర్కొంది. ఇతర నిర్ణయాలు, తీర్మానాలు ఇలా...
* కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి ఎంతవరకైనా రాజీలేని పోరాటం కొనసాగించాలి.
* ఒక్క చుక్క నీటి కేటాయింపులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే ఉన్నా కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టు. చట్టవ్యతిరేకమైనది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. దాని కాలువకు నీటి ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమమే.
*శ్రీశైలం డ్యామ్‌ మీద తెలంగాణ భూభాగంలోకి గుర్తింపు కార్డులున్న విద్యుత్‌ ఉద్యోగులను తప్ప, వేరెవరినీ అనుమతించవద్దు. శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి.
* మంత్రిమండలి నిర్ణయం ప్రకారం జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగించాలి.  
* ఇటీవలే పూర్తయిన సమ్మక్క బ్యారేజీ సహా సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులను.. ఇరిగేషన్‌ అండ్‌ హైడ్రో ఎలక్టిక్రల్‌ ప్రాజెక్టులుగా పిలవాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని