T Hub: ప్రపంచ అంకుర రాజధానిగా హైదరాబాద్‌

అద్భుత నగరమైన హైదరాబాద్‌ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ టీహబ్‌ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

Updated : 29 Jun 2022 08:14 IST

టీహబ్‌ దేశానికే తలమానికం

యువ భారతీయులకు అంకితం

యువత, పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం: సీఎం కేసీఆర్‌

ప్రపంచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌-2 ఘనంగా ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: అద్భుత నగరమైన హైదరాబాద్‌ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ టీహబ్‌ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాంకేతిక కేంద్రాన్ని స్థాపించి.. దేశంలో తెలంగాణ తొలి అంకుర రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ప్రపంచంతో పోటీపడుతూ గొప్ప ప్రగతిని సాధించిందని ఆయన వివరించారు. ‘‘ఆలోచనతో రండి- ఆవిష్కరణలతో వెళ్లండి’’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టీహబ్‌-2 ఆవిష్కరణల ప్రాంగణం భారత చరిత్రలో మైలురాయి అని, అత్యుత్తమ సౌకర్యాలతో ప్రపంచ ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తుకు ఇది మార్గదర్శకమవుతుందని, యువభారత్‌ను ప్రపంచపటంలో ప్రముఖంగా నిలుపుతుందని, వారి అంకుర, సాంకేతిక సామర్థ్యాలను చాటుతుందన్నారు. టీహబ్‌-2ను దేశంలోని యువ భారతీయులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. యువతకు, పారిశ్రామికవేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభాలుగా నిలిచే కొత్తతరం అంకురాలను పెంచడం.. రాష్ట్రానికి, దేశానికి ప్రపంచ గుర్తింపును తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో సులభతర వ్యాపార నిర్వహణలో అంకురాలకు అండగా నిలుస్తామని, వారికి మరింత చేయూత అందిస్తామని, కొత్త ఆలోచనతో అంకురాలను స్థాపించేందుకు ముందుకొస్తే టీహబ్‌-2 ద్వారా సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. అంకుర ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేస్తాయని వెల్లడించారు. హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌-2ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘టీహబ్‌ తెలంగాణకు గర్వకారణం. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నిరంతరంగా ఆవిష్కరణలు, అంకురాలను పెద్దఎత్తున ప్రోత్సహించాలనే నిర్ణయం మేరకు 2015లో టీహబ్‌ను ప్రారంభించాం. అంకురాలను ప్రభుత్వమే ప్రోత్సహించే విధానం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రారంభమైంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి కొన్నిరోజుల ముందు టీహబ్‌ విస్తరించడం తెలంగాణ సాంకేతిక, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం. అంకురాలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తాయి. వాటి ద్వారా అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర అంకురాల విధానం ప్రగతిశీలమైంది. కార్పొరేట్‌, విద్యాసంస్థలతో ఫలవంతమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. అందరూ కలిసి పనిచేయడానికి, ఒకరికొకరు సహాయపడడానికి ఇది సహకరిస్తుంది. టీహబ్‌తో పాటు టీఎస్‌ఐసీ, రిచ్‌, టీవర్క్స్‌, టాస్క్‌, టీఫైబర్‌ వంటి సంస్థలు రాష్ట్ర ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యున్నత పర్యావరణ వ్యవస్థతో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెస్తున్నాయి.

మొదటి దశ స్ఫూర్తితో...

కేటీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపం టీహబ్‌. దీంతో తెలంగాణ కన్న కలలు నెరవేరుతున్నాయి. మొదటి దశలో 2వేల అంకురాలకు రూ.9,399 కోట్ల పెట్టుబడులు సమకూరాయి.  వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు, ఏంజెల్‌ ఇన్వెస్టర్‌లతో అనుసంధానం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి మన అంకురాలు విస్తరించాయి. మొదటి దశ స్ఫూర్తితో దేశ యువతను మరింత ప్రోత్సహించేందుకు, మరింత మద్దతు అందించేందుకు ప్రపంచస్థాయి ఇంక్యుబేషన్‌ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశ కంటే రెండో దశ అయిదురెట్లు పెద్దది. ఆవిష్కరణల అనుసంధానకర్తగా, దేశ ఆవిష్కరణలు, పారిశ్రామికత స్వరూపాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ప్రపంచంలోని ఇలాంటి పది వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. నిధుల సమీకరణలో ఆసియాలోని మొదటి 15 స్థానాల్లో ఒకటిగా ఉంది. దేశంలోని అత్యుత్తమ జీవన ప్రమాణ నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. సాంకేతికత సాయంతో టీఎస్‌ఐపాస్‌, టీఎస్‌బీపాస్‌ వంటి పథకాలు పాలనపరంగా గుర్తింపు పొందడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. 2021లో తెలంగాణలోని అంకురాల విలువ రూ.37 వేల కోట్లుగా ఉంది. ఇది మరింత పెరుగుతుంది. మంత్రి కేటీఆర్‌, ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనరసింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, బృందం అపూర్వ కృషితోనే టీహబ్‌ వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. పారిశ్రామిక, ఆవిష్కరణల, సాంకేతిక రంగం బలోపేతానికి కొత్త ప్రతిపాదనలు వస్తే వాటిని చేపడతాం. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ఐటీ రంగంలో పురోగతి మరింతగా పెరుగుతుంది. దానికనుగుణంగా మౌలిక వసతులను పెంచేందుకు అధికారులు దృష్టి సారించాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఆవిష్కరణ జ్యోతిని సీఎం కేసీఆర్‌కు అందజేశారు.పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ ఎనిమిదేళ్ల కల ఇప్పటికి సాకారమైందని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపంగా టీహబ్‌ ఆరంభించిన కొద్ది కాలంలోనే ప్రపంచ గుర్తింపు పొందిందని, ఆ తర్వాత డిమాండ్‌ పెరగడంతో రెండో దశ చేపట్టామని, ప్రారంభానికి ముందే దానికి విశేష ఆదరణ లభించిందన్నారు. టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ టీహబ్‌తో పలు రాష్ట్రాలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయని, పలు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయన్నారు. టీహబ్‌ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీహబ్‌ ఆధునిక సాంకేతిక విప్లవమని, దేశానికి గొప్ప మార్గాన్ని చూపిందని చెప్పారు.


హైదరాబాద్‌లో కొత్త టీ-హబ్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అభినందనలు. భారత స్టార్టప్‌ల పర్యావరణ వ్యవస్థకు ఇది గొప్ప ఊతమిస్తుంది.

-రతన్‌టాటా


ఘనంగా ప్రారంభం

టీహబ్‌-2 ప్రపంచ ఆవిష్కరణ కేంద్రం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీహబ్‌ కొత్తభవన ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణమంతా కలియదిరిగారు. వివిధ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాల వివరాలు తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ టీహబ్‌ ప్రత్యేకతలను సీఎంకు వివరించారు. గేమింగ్‌, యానిమేషన్‌, సినిమాల్లో త్రీడీ ఎఫెక్టుల వంటి రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలన్నీ హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయని కేటీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా ఐటీ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించిన మంత్రి కేటీఆర్‌తో పాటు, అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్‌ శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకునే దిశగా, సైబర్‌ క్రైంను అరికట్టేందుకు కమాండ్‌ కంట్రోల్‌ రూంను మరింతగా అభివృద్ధి చేసేందుకు టీహబ్‌తో సమన్వయం చేసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ స్పీకర్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మర్రి జనార్దన్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీస్‌ చైర్మన్‌ పాటిమీది జగన్‌మోహన్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

యానికార్న్‌ అంకుర సంస్థలకు సన్మానం

దేశంలోని ప్రముఖ యూనికార్న్‌ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, తెలంగాణలోని ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను, టీహబ్‌ నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం శాలువాలతో సన్మానించారు. టీహబ్‌ జ్ఞాపికలను బహూకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు