సంక్షిప్త వార్తలు

రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తూ రైతులను ఆదుకోవటమే కాకుండా దేశానికి తిండి గింజలను సమకూర్చడంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ‘‘రాష్ట్రంలో ధాన్యం సేకరణ

Updated : 02 Jul 2022 07:03 IST

రైతులకు రూ.9,724 కోట్లు చెల్లించాం: గంగుల

ఈనాడు, హైదరాబాద్‌: రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తూ రైతులను ఆదుకోవటమే కాకుండా దేశానికి తిండి గింజలను సమకూర్చడంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ‘‘రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తయింది. యాసంగికి సంబంధించి రైతులకు రూ.9,724 కోట్లు చెల్లించాం. మరో రూ.192 కోట్లు చెల్లిస్తే ఈ సీజను చెల్లింపులు పూర్తవుతాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాసంగిలో మొత్తం 50.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 6.43 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా.. కనిష్ఠంగా 322 మెట్రిక్‌ టన్నులను ఆదిలాబాద్‌ జిల్లాలో సేకరించాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 6.06 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది’’ అని మంత్రి గంగుల శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


నీటిపారుదల శాఖ పరిధిలో 12.95 లక్షల ఎకరాలు

ఈనాడు, హైదరాబాద్‌: సేకరణతోపాటు కార్యాలయాల కింద, ఇతర భూములు కలిపి నీటిపారుదల శాఖ పరిధిలో 12.95 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. శాఖ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం చేపట్టిన భూములు, ఆస్తుల జాబితా రూపకల్పన(ఇన్వెంటరీ) జూన్‌ ఒకటో తేదీలోపు పూర్తికావాల్సి ఉన్నా.. కొంత ఆలస్యమైందన్నారు. చెరువు శిఖం, ముంపులో కొన్నిచోట్ల 31 వేల ఎకరాల పట్టా భూములు ఉన్నట్లు గుర్తించామని స్పష్టంచేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3,352 చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం హద్దులు గుర్తించామని.. నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉందన్నారు. శ్రీశైలం జలాశయానికి సంబంధించి ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ఏపీకి 34 టీఎంసీలు మాత్రమే తీసుకునే హక్కు ఉందంటూ జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్‌ఎంసీ) రూపొందిస్తున్న రూల్‌కర్వ్స్‌ ముసాయిదాలో పేర్కొన్నారని తెలిపారు. ఇది రాష్ట్రానికి కలిసొచ్చే విషయమని తెలిపారు. గౌరవెల్లి జలాశయం, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుల చివరిదశ పర్యావరణ అనుమతులపై దృష్టిసారించినట్లు వివరించారు.


పద్మాలయ భూముల విక్రయం’పై చర్యలేవి?
సీఎస్‌కు సుపరిపాలన వేదిక ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: సినీపరిశ్రమ అభివృద్ధిలో భాగంగా పద్మాలయ స్టూడియో వారికి షేక్‌పేటలో ప్రభుత్వం కేటాయించిన 9.51 ఎకరాల భూమిలో 5.53 ఎకరాలను వేరే సంస్థకు విక్రయించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుపరిపాలన వేదిక శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఎకరా రూ.8,500 చొప్పున కేటాయించగా.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా విక్రయించిన భూమి ఇప్పటికే రెండు సంస్థల చేతులు మారిందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థతోపాటు అక్కడ నిర్మాణ అనుమతులు జారీ చేసిన శాఖలపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు.

 


రాష్ట్రంలో రూ.3,530 కోట్ల రిజిస్ట్రేషన్ల రాబడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.3,530 కోట్ల రాబడి వచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా సగటున నెలకు రూ.1,250 కోట్లు వస్తోంది. మూడు నెలల్లో 3.17 లక్షల వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏప్రిల్‌లో రూ.1,360 కోట్లు, మే నెలలో రూ.1,270 కోట్లు వచ్చాయి. జూన్‌లో ప్రాథమిక లెక్కల మేరకు రూ.1,000 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.15,600 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది ఆదాయం రూ.12,436 కోట్లు కాగా, ఈసారి అంచనాలను 25 శాతం మేర పెంచింది.


మండల పరిషత్‌, పంచాయతీ కార్యదర్శుల హాజరు నమోదు
జనగామ జిల్లాలో అమలు

దేవరుప్పుల, న్యూస్‌టుడే: జనగామ జిల్లాలోని మండల పరిషత్‌ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శుల హాజరును ప్రత్యేక యాప్‌ ద్వారా జిల్లా యంత్రాంగం నమోదు చేస్తోంది. ప్రతి ఉద్యోగి తమ పేరు, హోదా, ఫొటో, కార్యాలయం, అక్షాంశాలు, రేఖాంశాలను అందులో నమోదు చేయాలి. ప్రతీరోజు కార్యాలయానికి చేరుకున్న తర్వాత తన స్థానంలో కూర్చోని వివరాలను నమోదు చేసి ఫొటోను జతపరచాలి. మండల పరిషత్‌, పంచాయతీ కార్యదర్శుల పనితీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే జిల్లాలోని ఇతర శాఖలకూ దీనిని వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


ఇంజినీరింగ్‌ శాఖల్లో 1927 పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల, రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్‌, ప్రజారోగ్యశాఖ, భగీరథ, భూగర్భ జలవనరుల శాఖల్లో 1927 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కొత్తగా రూపొందించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమల్లోకి వచ్చిన స్థానికత కింద 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టడంతోపాటు ఇంటర్వ్యూ రద్దు చేయడం పట్ల హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపింది.


అంబేడ్కర్‌ వర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు ప్రకటన

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు వర్సిటీ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరాలనుకొనేవారు వివరాలను www.braouonline.in, www.braou.ac.in  వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు రెండో సంవత్సరం ట్యూషన్‌ రుసుం, అంతకు ముందు చేరి సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు జులై 31లోగా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు.


అతిథి అధ్యాపకుల ఐకాస ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ శాఖల పరిధిలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ అతిథి అధ్యాపకుల ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసుకున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఐకాస అధ్యక్షుడిగా బి.ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా కుంట దేవేందర్‌ యాదవ్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 20 వేల మంది అతిథి అధ్యాపకుల ఆటో రెన్యువల్‌, 12 నెలల వేతనం, ఉద్యోగ భద్రతపై సమితి పోరాడుతుందని దేవేందర్‌ తెలిపారు.


7 నుంచి 20 తేదీల మధ్య బీటెక్‌ ఫీజుల ఖరారు  

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే మూడేళ్లకు సంబంధించి ఈ నెల 4 నుంచి బీటెక్‌ రుసుముల ఖరారుపై కళాశాలల యాజమాన్యాలను పిలిచి విచారణ జరుపుతామని ప్రకటించిన తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) దాన్ని 7 నుంచి మొదలుపెట్టాలని శుక్రవారం నిర్ణయించింది. జులై 4-15 తేదీల మధ్య 145 కళాశాలల ఫీజులు ఖరారు చేస్తామని గురువారం కాలపట్టిక విడుదల చేసిన కమిటీ దాన్ని 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వాయిదా వేసినట్లు పేర్కొంది.


విద్యాశాఖకు ఒప్పంద అధ్యాపకుల దూరవిద్య వివరాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తూ దూర విద్య ద్వారా పీజీ చేసిన వారి ధ్రువపత్రాలకు యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? అని పరిశీలించిన కమిటీ వాటి వివరాలతో కూడిన నివేదికను ఇంటర్‌ విద్యాశాఖకు పంపింది. కళాశాలల్లో మొత్తం 3,584 మంది అధ్యాపకులు పనిచేస్తుండగా వారిలో 534 మంది దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేశారు. వారు చదివిన వర్సిటీకి, దూరవిద్యా కేంద్రానికి గుర్తింపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు ఇటీవల ఉన్నత విద్యామండలి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.


పురోగతి లేని జేబీసీసీ సమావేశాలు: సీఐటీయూ

ఈనాడు, హైదరాబాద్‌: వేతన సవరణకు సంబంధించి ఏర్పాటుచేసిన బొగ్గు పరిశ్రమల సంయుక్త ద్వైపాక్షిక కమిటీ (జేబీసీసీ) అయిదో సమావేశం పురోగతి లేకుండా ముగిసిందని సీఐటీయూ వెల్లడించింది. శుక్రవారం హైదరాబాద్‌లో కమిటీ సమావేశం జరిగిందని,  యజమాన్యం మూడు శాతం వేతనాలు పెంచాలని చర్చలు ప్రారంభించడంతో కార్మికులలో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొంది. వేతన కనీస పెరుగుదల గతంలో ఇచ్చిన 27 శాతం కంటే అదనంగా ఎంత ఇస్తారనే దాని నుంచి చర్చలు ప్రారంభించాలని కార్మిక సంఘాలు కోరగా అది సాధ్యం కాదని యాజమాన్యాలు తెలిపాయని సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేబీసీసీ సభ్యుడు నరసింహారావు అన్నారు. సమస్య పరిష్కారం కోసం బొగ్గు శాఖ మంత్రిని, కార్యదర్శిని కలిసి విన్నవించాలన్నారు.


దశలవారీ ఆందోళనకు వీఆర్వోల సంఘం నిర్ణయం
28న చలో హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వీఆర్‌ఏలు ప్రత్యక్ష ఆందోళన బాటలో ఉండగా తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం శుక్రవారం దశలవారీ ఆందోళనకు సంబంధించి కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 4న నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ల ద్వారా ప్రభుత్వానికి  సమస్యతో కూడిన వినతిపత్రాలు అందజేయనున్నారు. 7న ఆర్డీవోలకు, 12న కలెక్టరేట్ల ముందు ధర్నా, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. 28న చలో హైదరాబాద్‌ కార్యక్రమం ద్వారా ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. వీఆర్వోలకు జాబ్‌ఛార్ట్‌ ఏర్పాటు, రెవెన్యూ శాఖలో సర్దుబాటు, పదోన్నతులు, కారుణ్య నియామకాలు తదితర కీలక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందంటూ ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు.


ఇంటర్‌ విద్యాశాఖకు ఒప్పంద అధ్యాపకుల వివరాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తూ దూర విద్య ద్వారా పీజీ చేసిన వారి ధ్రువపత్రాలకు యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? అని పరిశీలించిన కమిటీ వాటి వివరాలతో కూడిన నివేదికను ఇంటర్‌ విద్యాశాఖకు పంపింది. కళాశాలల్లో మొత్తం 3,584 మంది అధ్యాపకులు పనిచేస్తుండగా వారిలో 534 మంది దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేశారు. వారు చదివిన వర్సిటీకి, దూరవిద్యా కేంద్రానికి గుర్తింపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు ఇటీవల ఉన్నత విద్యామండలి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని