Telangana News: ఎవరి లక్ష్యం వారిదే..!

రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఐటీ, ఈడీల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది.

Updated : 23 Nov 2022 08:42 IST

మంత్రులపై కేంద్ర సంస్థల గురి
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా ముఖ్యనాయకులపై సిట్‌ దృష్టి
రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల హల్‌చల్‌
‘తర్వాత ఎవరి వంతో’ అనే చర్చ
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఇంకోవైపు దిల్లీ మద్యం కేసు, మధ్యలో ఐటీ, ఈడీల దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న వాతావరణం నెలకొంది. ఒక మంత్రిపై గ్రానైట్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరపగా, అది ముగియకముందే మరో మంత్రి లక్ష్యంగా మంగళవారం పెద్దఎత్తున ఆదాయపన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. మరో మంత్రి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సహాయకుడిని కూడా ఈడీ విచారించింది. మరికొందరిపైనా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. కొందరు నేతలు  బహిరంగంగానే అంటున్నారు కూడా. మునుగోడు ఉపఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంటుందని అందరూ భావించగా, అందుకు భిన్నంగా ఈడీ, ఐటీ, సిట్‌ కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. సీబీఐ అడుగుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం కావడంతో అది నేరుగా కేసులు నమోదు చేయలేకపోతోందని, లేకుంటే ఆ సంస్థ కూడా రాష్ట్రంలో చురుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్రాల్లో ఏకపక్షంగా దాడులు చేయగలిగాయి. తెలంగాణకు వచ్చేసరికి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

* దిల్లీ మద్యం విధానం తయారీలో భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ  మొదట రాష్ట్రంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును భాజపా నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. నెలరోజులకు పైగా ఈ ప్రచారం ఉన్నా ఈడీ అక్కడివరకు రాలేదు. అయితే ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

* ఎమ్మెల్యేల ఎర కేసును తీవ్రంగా తీసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించడమే కాదు..ఇప్పటికే భాజపాలో కీలకనేతగా ఉన్న బి.ఎల్‌.సంతోష్‌ను విచారణకు పిలుస్తూ నోటీసు ఇచ్చింది. దీంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విచారణను నిలిపివేయించేందుకు భాజపా నాయకులు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మరికొందరు ముఖ్యనాయకులకూ నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి కేంద్రంలోని మంత్రులు, ఆర్‌.ఎస్‌.ఎస్‌. నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వారు కలిసి ఉన్న ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

* కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులు రాయల్టీ ఎగ్గొట్టినట్లు 2013లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నివేదిక ఇచ్చింది. గ్రానైట్‌ ఎగుమతికి సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్‌ లక్ష్యంగా ఈడీ దాడులు చేసింది. 

* క్యాసినో వ్యహారంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ సోదరులిద్దరినీ, ఆయన వ్యక్తిగత సహాయకుడిని కూడా విచారించారు.

* అధిక సంఖ్యలో విద్యాసంస్థలున్న మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో మంగళవారం పెద్దఎత్తున ఐటీ దాడులు జరిగాయి. మరికొందరు మంత్రులకు  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు నాయకులకు విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తెరాస లక్ష్యంగా మరికొన్ని సోదాలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.

వాణిజ్య పన్నుల అధికారులు సైతం..

* దర్యాప్తు సంస్థలే కాదు, వాణిజ్య పన్నుల అధికారులు కూడా తనిఖీలు ప్రారంభించారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేయగా, తెరాస నాయకులకు చెందిన సంస్థలపై కేంద్ర జీఎస్టీ అధికారులు చేశారు. మరికొన్ని ప్రముఖ వ్యాపార సంస్థల్లో జీఎస్టీ, ఆదాయపన్ను శాఖ సోదాలు జరిగాయి. దీంతో వ్యాపార సంస్థల పరిస్థితి మరింత ఇబ్బందిగా తయారైంది. ఎప్పుడు ఎటువైపు నుంచి సోదాలు జరుగుతాయో తెలియడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ఒక పార్టీకి సన్నిహితంగా ఉండటమో, ఆర్థిక సాయం చేశారన్న అనుమానమో ఉంటే ఇంకోవైపు నుంచి సోదాలు జరుగుతున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో దర్యాప్తు సంస్థల హల్‌చల్‌ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని