US Visa: తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముంబయికి పరుగులు

అమెరికాలో ఉన్నత చదువులకు వీసాల కోసం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముంబయికి పరుగులు తీస్తున్నారు.

Updated : 30 Nov 2022 09:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలో ఉన్నత చదువులకు వీసాల కోసం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముంబయికి పరుగులు తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఆశించిన స్థాయిలో వీసా ఇంటర్వ్యూ తేదీలు (స్లాట్లు) అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. అమెరికాలో విద్యార్థి (ఎఫ్‌-1) వీసా కోసం ఇంటర్వ్యూ స్లాట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం పరిమిత సంఖ్యలో స్లాట్లు విడుదలయ్యాయి.

హైదరాబాద్‌లో పెద్దగా అందుబాటులో లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నిరాశకు గురయ్యారు. ముంబయి కాన్సులేట్‌లో ఎక్కువ సంఖ్యలో తేదీలు అందుబాటులో ఉండటంతో చాలామంది అక్కడికి ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నారు. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌ కాన్సులేట్ల పరిధిలో అమెరికా ప్రభుత్వం గతనెల 29వ తేదీన తొలివిడతగా వీసా స్లాట్లు విడుదల చేసింది. అప్పట్లో హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో నిమిషాల వ్యవధిలోనే అవి నిండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో గంటల వ్యవధిలో భర్తీ అయ్యాయి. అప్పటి నుంచి విద్యార్థులు స్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ మేరకు మంగళవారం వీసా తేదీలను విడుదల చేసినప్పటికీ అవి ముంబయిలో ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువమంది అటువైపు దృష్టి సారించారు. తరగతుల ప్రారంభానికి గడువు సమీపిస్తుండటంతో వ్యయప్రయాసలు ఎదురైనా.. ఎక్కడ వీసా తేదీలు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని