TS High Court: మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ సస్పెన్షన్‌

బేగంపేట ప్రజాభవన్‌ వద్ద కారుతో బారికేడ్‌లను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆమిర్‌ మరో ఇద్దరిపై జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ను(ఎల్‌ఓసీ) నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 10 Feb 2024 10:10 IST

23లోగా పోలీసుల ముందు హాజరుకావాలన్న హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: బేగంపేట ప్రజాభవన్‌ వద్ద కారుతో బారికేడ్‌లను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆమిర్‌ మరో ఇద్దరిపై జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ను(ఎల్‌ఓసీ) నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పిటిషనర్లు ఈనెల 23లోగా పోలీసుల ముందు విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. గత డిసెంబరులో ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్‌ కుమారుడు సాహిల్‌తోపాటు స్నేహితులపై కేసు నమోదు నమోదైంది. దర్యాప్తు కేసులో భాగంగా జారీ చేసిన లుక్‌అవుట్‌ సర్క్యులర్లను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్‌, సయ్యద్‌ సాహెద్‌ రహమాన్‌, మహమ్మద్‌ ఖలీల్‌ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. ఈ కేసుపై పోలీసులు ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియడంలేదని, అదే సామాన్యులైతే ఇలానే చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేసి విచారణ చేపట్టాల్సి ఉండగా అరెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్‌ఓసీని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని, పిటిషనర్లను అరెస్ట్‌చేయరాదంటూ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని