Germany: హాంబర్గ్‌ ఎయిర్‌పోర్టులో ఉత్కంఠకు తెర.. 16 గంటల తర్వాత దుండగుడి అరెస్టు

జర్మనీలోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లోకి ఓ దుండగుడు కారులో దూసుకెళ్లి కాల్పులు జరిపాడు. దాంతో విమానాశ్రయంలో రాకపోకలు నిలిపివేసిన పోలీసులు 16 గంటల తర్వాత అతడిని అరెస్టు చేశారు.

Updated : 05 Nov 2023 20:17 IST

బెర్లిన్‌: జర్మనీలోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 16 గంటల తర్వాత ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని తెలిసింది. ఇన్ని గంటలుగా నిందితుడి వద్దనే ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారుతో ఓ 35 ఏళ్ల వ్యక్తి విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. భద్రతా సిబ్బందిని దాటుకొని ఎయిర్‌పోర్ట్‌లోకి చొరబడి తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆపై ఇంధనం నింపిన సీసాలకు నిప్పంటించి గాల్లోకి విసిరాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దుండగుడు కారును ఓ విమానం కింద పార్క్‌ చేశాడు. కారులో ఓ చిన్నారి కూడా ఉండటంతో ఆమెను రక్షించేందుకు పోలీసులు అతడితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. 

కుటుంబ వివాదం కారణంగానే దుండగుడు ఇలా ప్రవర్తించినట్లు తెలిసింది. తన కుమార్తెను అపహరించుకుపోయాడంటూ అతడి భార్య పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె బాలికతో కలిసి స్టేజ్‌లో ఉండగా.. బక్ట్సెహుడ్ నుంచి వచ్చిన నిందితుడు చిన్నారిని బలవంతంగా లాక్కొనిపోయాడని జర్మన్‌ వార్తా సంస్థ ఎన్‌డీఆర్‌ పేర్కొంది. దీంతో హాంబర్గ్‌ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుడి వద్ద 4 ఏళ్ల వయసున్న కుమార్తె కూడా ఉండటంతో పోలీసు అధికారులు దూకుడు ప్రదర్శించలేకపోయారు. 

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో కనిపించే విమానాలు నిజంగా రాబోతున్నాయట!

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం, ఇతర విమానాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. టెర్మినల్‌ నుంచి ప్రయాణికులను పూర్తిగా ఖాళీ చేయించారు. ఈ పరిణామంతో సుమారు 3వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 60 విమానాల రాకపోకలను ముందు జాగ్రత్తగా రద్దు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని