Imran Khan: నా భర్తపై విషప్రయోగం జరగొచ్చు..! ఇమ్రాన్‌ ఖాన్‌ భార్య ఆందోళన

అటక్‌ జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌పై విషప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను అదియాలా జైలుకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

Published : 19 Aug 2023 16:32 IST

ఇస్లామాబాద్‌: తోషఖానా కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. ప్రస్తుతం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, తన భర్త ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, ఆయనపై విష ప్రయోగం జరగొచ్చని ఇమ్రాన్‌ భార్య బుష్రా బీబీ (Bushra Bibi) ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను మెరుగైన వసతులు ఉన్న జైలుకు తరలించాలని డిమాండ్‌ చేస్తూ.. పంజాబ్ హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఇమ్రాన్‌ను అటక్‌ జైలు (Attock jail) నుంచి రావల్పిండిలోని అదియాలాకు తరలించాలంటూ సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించినట్లు గుర్తుచేశారు.

‘సరైన కారణాలు లేకుండా నా భర్తను అటక్ జైలులో బంధించారు. చట్టప్రకారం ఆయన్ను అదియాలా జైలుకు తరలించాలి. ఆయన సామాజిక, రాజకీయ హోదా దృష్ట్యా జైలులో బీ-క్లాస్ సౌకర్యాలు కల్పించాలి. ఇమ్రాన్‌పై గతంలో రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. వాటితో సంబంధం ఉన్నవారిని ఇంకా అరెస్టు చేయలేదు. ఆయన ప్రాణాలకు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉంది. అటక్ జైలులో ఆయనపై విషప్రయోగం జరిగే అవకాశం ఉంది’ అని బుష్రా బీబీ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారంటూ ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు ఇమ్రాన్‌కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపింది.

అమెరికాలో ఆగిన తైవాన్‌ ఉపాధ్యక్షుడు.. రెచ్చిపోయిన చైనా

జైలు నిబంధనల ప్రకారం తన భర్తకు 48 గంటల్లోగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందని.. అయితే, వాటి ఊసే లేదని ఆమె తన లేఖలో ఆరోపించారు. ఆయనకు మెరుగైన సౌకర్యాలు ఎందుకు నిరాకరించారనేదానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. జైలులో ఉన్న ఇమ్రాన్‌ను బుష్రా బీబీ ఇటీవలే కలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దారుణమైన పరిస్థితుల మధ్య తన భర్తను ఉంచారని, సీ-క్లాస్ జైలు సౌకర్యాలు కల్పించారని విమర్శించారు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌కు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 22న డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని