Kim Jong Un: ఉ.కొరియాలో ఆహార కొరత.. మరోవైపు రూ.5లక్షల మద్యంతో కిమ్‌ విందు..!

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అత్యంత ఖరీదైన ఆహారం తింటారని ఆంగ్లపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అతడు తాగే మద్యం సీసా ఖరీదు రూ.5 లక్షలు పైమాటేనట.

Updated : 10 Jul 2023 14:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర కొరియా (north korea) తీవ్రమైన ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా.. ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) విలాసాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఉ.కొరియా నియంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు యూకే రక్షణ రంగ నిపుణులు ఓ పత్రికకు వెల్లడించారు. అతడు అత్యధికంగా 7,000 డాలర్లు (రూ.5లక్షలకు పైగా ) విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని తాగుతాడని పేర్కొన్నారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే ఏటా 30 మిలియన్‌ డాలర్ల (రూ.247 కోట్లు) వెచ్చిస్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ బహిర్గతం చేసినట్లు వెల్లడించారు.

ఇక కిమ్‌కు ఇష్టమైన బ్రెజిలీయన్‌ కాఫీ కోసం ఏటా 9.6 లక్షల డాలర్లను ఏటా వెచ్చిస్తున్నారు. అతడు తాగే సిగిరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని పేర్కొన్నారు. ఇంతేకాదు.. కిమ్‌ మద్యంతోపాటు తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేసే పర్మా హామ్‌ (పోర్క్‌తో తయారు చేసేది), స్విస్‌ చీజ్‌ను ఉ.కొరియా దిగుమతి చేసుకొంటోంది. ఈ విషయాన్ని ఒకప్పటి కిమ్‌ వంటవాడు యూకేకు చెందిన ఓ పత్రికకు వెల్లడించాడు.

గతంలో కూడా కిమ్‌, అతడి తండ్రి కలిసి కొబే స్టీక్స్‌, క్రిస్టల్‌ షాంపైన్‌తో ఆహారం తీసుకొనేవాడని అతడి వద్ద పనిచేసిన వారు వెల్లడించారు. 1997లో కిమ్‌ కోసం పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుంచి ప్రత్యేకంగా ఓ చెఫ్‌ను రప్పించారు. 2014లో కిమ్‌ లైంగిక సామర్థ్యం పెరిగేందుకు ఖరీదైన స్నేక్‌ వైన్‌ తాగేవాడని తెలిసింది. గతంలో కిమ్‌ 136 కిలోల బరువు దాటిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్‌ సంస్థ పరిశోధనల్లో కిమ్‌ ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అమెరికా నుంచి మార్ల్‌బోరో సిగరెట్లు, నిద్రలేమికి చికత్స చేసే జిల్పీడెమ్‌ వంటి వాటిని దిగుమతి చేసుకొనేవారు.

కరోనా అనంతరం ఉ.కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొన్నట్టు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో పంట దిగుబడి లేక ఆహార సంక్షోభం మొదలయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని