UNSC: ఐరాసలో సంస్కరణలకు వాళ్లే వ్యతిరేకం.. చైనాపై మండిపడ్డ జైశంకర్‌!

ఐరాస భద్రతా మండలి (UNSC)లో సంస్కరణలను అతిపెద్ద వ్యతిరేకి పాశ్చాత్య దేశాలు కావని  భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు.

Published : 22 Feb 2024 17:52 IST

దిల్లీ: సమకాలీన ప్రపంచంలోని అనేక సమస్యలకు పాశ్చాత్య కూటమే కారణమని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ (S Jai Shankar) ఆరోపించారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి దిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో (రైసినా డైలాగ్‌) మాట్లాడిన ఆయన.. చైనా (China) తీరును పరోక్షంగా దుయ్యబట్టారు. ఐరాస భద్రతా మండలి (UNSC)లో సంస్కరణలకు అడ్డుగోడగా బీజింగ్‌ నిలుస్తోందన్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో పాతుకుపోయిన అంతర్జాతీయ వ్యవస్థతో ప్రపంచం ముందుకు సాగలేదన్నారు.

‘ప్రపంచంలో నేడు చాలా సమస్యలు పాశ్చాత్య దేశాలు సృష్టించినవే. కానీ, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలను వ్యతిరేకించే అతిపెద్ద శక్తి మాత్రం పాశ్చాత్య దేశం కాదనేది వాస్తవం’ అని ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. ఐరాస మొదలైనప్పుడు దాదాపు 50 సభ్యదేశాలు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందన్నారు. భద్రతామండలిలోనూ వీటో అధికారం ఐదుదేశాలకే ఉండటం తగదని హితవు పలికారు. 

ఐరాస భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, చైనా దేశాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. వీటికి వీటో అధికారం ఉంది. మరో 10 దేశాలు తాత్కాలిక ప్రాతిపాదికన రెండేళ్ల కాల పరిమితితో (రొటేషన్‌ పద్ధతిలో) భద్రతా మండలిలో కొనసాగుతుంటాయి. అయితే, భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని భారత్‌ ఎంతో కాలంగా డిమాండ్‌ చేస్తోంది. నాలుగు శాశ్వత సభ్యదేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ చైనా అడ్డుపుల్ల వేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని