మంత్రి కన్వెన్షన్‌ సెంటర్లో జూద క్రీడలా?

మంత్రి కొడాలి నాని పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి రాష్ట్రం పరువు గంగలో కలిపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రికి చెందిన కే కన్వెన్షన్‌ సెంటర్‌లో

Published : 18 Jan 2022 03:08 IST

పండగ రోజు కొడాలి నాని కనుసన్నల్లో మహిళలతో రికార్డింగ్‌ డ్యాన్సులు

సంక్రాంతి సంబరాల ముసుగులో ఇంత జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు?

రాష్ట్ర పరువు గంగలో కలిపిన మంత్రిపై చర్యలు తీసుకోవాలి

తెదేపా నేతల మండిపాటు

చంద్రబాబు అధ్యక్షతన పార్టీ వ్యూహ కమిటీ సమావేశం

ఈనాడు, అమరావతి: మంత్రి కొడాలి నాని పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి రాష్ట్రం పరువు గంగలో కలిపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రికి చెందిన కే కన్వెన్షన్‌ సెంటర్‌లో కోడి పందేలు, గుండాట, పేకాట, రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించారని మండిపడ్డారు. సంక్రాంతి సంబరాల ముసుగులో జూద క్రీడలు యథేచ్ఛగా సాగుతుంటే... ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన పార్టీ వ్యూహకమిటీ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పండగ వేళ మంత్రి కనుసన్నల్లో మహిళల చేత రికార్డింగ్‌ డ్యాన్సులు వేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి బాధ్యులైన మంత్రిపైన, పోలీసు అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండు చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సులభతర వాణిజ్యం ఇతర ఎన్నో కార్యక్రమాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిస్తే... జగన్‌ హయాంలో క్యాసినో సంస్కృతి, పేకాట క్లబ్బులు, మాదకద్రవ్యాలు, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం నం.1గా నిలిచిందని, అభివృద్ధి అంటే ఇదేనా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్‌ విజృంభించి, ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని ధ్వజమెత్తారు. 12కుపైగా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రభుత్వం పాఠశాలలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ‘రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా పాజిటివిటీ రేటు 4.05 నుంచి 15.22 శాతానికి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడటం సబబు కాదు. తరగతులు తక్షణం నిలిపివేయాలి’ అని డిమాండ్‌ చేశారు. కరోనా బాధితులకు అమెరికాకు చెందిన వైద్యుడు ఈదర లోకేశ్వరరావుతో కలసి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌, పార్టీ కేడర్‌ సంయుక్తంగా సేవలందించాలని సమావేశంలో నిర్ణయించారు.

చంద్రయ్యది రాజకీయ హత్య కాదని ఎస్పీ ఎలా చెబుతారు?

‘తెదేపా నాయకుడు చంద్రయ్యది రాజకీయ హత్య కాదని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎస్పీ అలా చెబుతుంటే.. మరోపక్క జొన్నలగడ్డలో వైఎస్‌ విగ్రహం తొలగింపు, చంద్రయ్య హత్యకు ప్రతీకార చర్యగా జరిగిందని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొనడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది’ అని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పండ్లు పంచడం, రక్తదాన శిబిరాలు వంటివి నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పార్టీ ప్రారంభించిన చైతన్యరథం ఇ-పేపర్‌ 30 లక్షల మందికి వాట్సప్‌ ద్వారా చేరుతోందని వివరించింది. సమావేశంలో సీనియర్‌ నేతలు కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమా, బండారు సత్యనారాయణమూర్తి, బోండా ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, రాజేంద్రప్రసాద్‌, టీడీ జనార్ధన్‌, పట్టాభిరాం పాల్గొన్నారు.

* ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.


సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్య నిర్ణయాలు, చర్చించిన అంశాలివి..

* ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో చెల్లింపులు చేస్తామన్న ప్రభుత్వం... రైతుల్ని మోసగించింది. మిర్చి, కంది రైతులు తీవ్రంగా నష్టపోయినా వారికి పరిహారం అందించలేదు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

* ఉద్యోగులకు ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు, పింఛన్లు 15వ తేదీ దాటినా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రమబద్ధీకరణ కోసం ఆందోళన చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తెదేపా అండగా నిలుస్తుంది.

* ప్రత్యేక హోదా, పోలవరం, విభజన అంశాలు, రైల్వే జోన్‌ సాధనకు, రాష్ట్ర హక్కుల్ని కాపాడేందుకు వచ్చే పార్లమెంటు సమావేశంలో తెదేపా ఎంపీలు గళమెత్తుతారు.

* ప్రభుత్వానికి ఆదాయం, అప్పులు రెండూ పెరిగాయని కాగ్‌ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021 నవంబరు వరకు రూ.88,618 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక ఆదాయం. ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రూ.49,570 కోట్ల అప్పులు చేసింది. 30 నెలల పాలనలో రూ.3,64,104 కోట్ల అప్పులు తెచ్చారు. జగన్‌రెడ్డి మాత్రం ఆదాయం తగ్గిందని, తక్కువ అప్పులు చేశామని అబద్ధం చెబుతున్నారు. కాగ్‌ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పు రూ.6.65 లక్షల కోట్లకు చేరింది. రెవెన్యూ లోటు 805 శాతానికి పెరిగింది.

* తిరుపతి విమానాశ్రయంలో ఒక మంత్రి వచ్చినప్పుడు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించిన సిబ్బంది ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేయడం వైకాపా నేతల ఉన్మాదానికి పరాకాష్ఠ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని