ప్రమాదంలో గోరుకల్లు జలాశయం

శ్రీశైలం కుడి కాల్వ, గాలేరు-నగరి సుజల స్రవంతి కాల్వల ద్వారా రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు తరలించడంలో కీలకమైన గోరుకల్లు జలాశయం పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

Published : 04 Jun 2023 03:57 IST

రెండు చోట్ల కుంగిన మట్టికట్ట

పాణ్యం, పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీశైలం కుడి కాల్వ, గాలేరు-నగరి సుజల స్రవంతి కాల్వల ద్వారా రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు తరలించడంలో కీలకమైన గోరుకల్లు జలాశయం పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని ప్రాజెక్టు కట్ట కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మట్టి కట్ట కుంగిపోగా ఇటీవల మరమ్మతులు చేయించారు. నాలుగు రోజులుగా నీరున్న ప్రాంతంలో మట్టికట్ట లోపలి వైపు కుంగిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. జలాశయంలోని 2.6 కి.మీ. వద్ద మట్టికట్ట 50 మీటర్ల వెడల్పు, మరోచోట 60 మీటర్ల వెడల్పు, 10 అడుగుల లోతు వరకు కుంగిపోయింది. దానిపై నిర్మించిన రాతి పరుపు జారి.. ఆ రాళ్లు నీటిలో పడుతున్నాయి. జలాశయంలో ప్రస్తుతం 3.2 టీఎంసీల నీరుంది. సీఈ కబీర్‌బాషా, ఈఈ సుభకుమార్‌, డీఈ ప్రసాద్‌ శనివారం ప్రాజెక్టు కట్టను పరిశీలించారు. మట్టి కట్ట రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కట్టను పటిష్ఠం చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని, నీటి నిల్వ తగ్గించి మరమ్మతులు చేపట్టాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. 25 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు సీఈ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని