YSRCP MLA: ఆ నియోజకవర్గం.. ఆటవిక రాజ్యం

అది పల్నాడు జిల్లాలోని తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం. ఆంధ్రా చంబల్‌లోయగా ప్రసిద్ధి! అక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన మనుషుల అరాచకాలకు అంతే లేదు. అక్కడ శాంతిభద్రతలకు, చట్టనిబంధనలకు చోటు లేదు. ఆ ప్రజాప్రతినిధి, ఆయన మనుషులు చెప్పిందే చట్టం. చేసిందే శాసనం.

Updated : 30 Jun 2023 13:17 IST

చంబల్‌లోయను మించిన దారుణాలు
అక్కడ బతకాలంటే ప్రజాప్రతినిధికి జీ హుజూర్‌ అనాల్సిందే
మట్టి నుంచి మద్యం వరకు అన్నింటికీ కప్పం కట్టాల్సిందే
ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తుల్నీ లాగేసుకుంటున్నారు
తెదేపా నేతలపై దాడులు, దౌర్జన్యాలు
దారుణ హత్యలు.. ఊరి నుంచి వెళ్లగొట్టే దాష్టీకాలు
ఈనాడు - అమరావతి

అది పల్నాడు జిల్లాలోని తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం. ఆంధ్రా చంబల్‌లోయగా ప్రసిద్ధి! అక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన మనుషుల అరాచకాలకు అంతే లేదు. అక్కడ శాంతిభద్రతలకు, చట్టనిబంధనలకు చోటు లేదు. ఆ ప్రజాప్రతినిధి, ఆయన మనుషులు చెప్పిందే చట్టం. చేసిందే శాసనం. ఒక్క మాటలో చెప్పాలంటే.. అదో అనాగరిక, ఆటవిక రాజ్యం. కొన్ని సినిమాల్లో ప్రతినాయకుల అరాచకాలు, దోపిడీలు, హింసాకాండ చూసి అలాంటివి ఈ నాగరిక సమాజంలో ఎక్కడుంటాయని విస్తుపోతాం. ఎప్పుడో 1970, 80ల్లో ఏ మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు, చంబల్‌లోయ వంటి ప్రదేశాల్లో అలాంటి అరాచకాలు జరిగి ఉండొచ్చేమో అనుకుంటాం. కానీ 2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సినిమాల్లో చూపించేదానికి మించి అక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. దీనిపై పత్రికల్లో ఎన్ని వార్తలు వచ్చినా సీఎం జగన్‌ పట్టించుకోరు. పైగా ఆ ప్రజాప్రతినిధి ‘ప్రతిభ’కు మెచ్చి మరో పదవీ కట్టబెట్టారు. అందుకేనేమో ఆ నేత అరాచకాలను ఆ జిల్లా ఎస్పీ, రేంజ్‌ డీఐజీ, డీజీపీ సహా అందరూ ప్రేక్షకుల్లా చూస్తుంటారు. స్థానిక పోలీసులైతే వైకాపా నాయకులతో చేయీచేయీ కలిపి  ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తుంటారు.

బాధితులకు సంఘీభావం పలికేందుకు ప్రధాన ప్రతిపక్ష నేతనూ వెళ్లనివ్వకుండా అడ్డుకుంటారు. దొరికినంత దోచుకోవడమే తప్ప... ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న కనీస స్పృహ అక్కడి ప్రజాప్రతినిధికి గానీ ప్రభుత్వానికి గానీ లేదు. అందుకే సహజవనరులు పుష్కలంగా ఉన్నా.. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా.. అది కోస్తా జిల్లాల్లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోతోంది. అక్కడో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఏళ్లతరబడి ఫైళ్లలోనే మూలుగుతోంది.

అన్నదమ్ముల అరాచకాలు

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడి అరాచకాలకు అంతే లేదు. అసాంఘిక శక్తుల్ని పెంచి పోషిస్తూ, నియోజకవర్గాన్నినేర సామ్రాజ్యంగా మార్చేశారు. పోలీస్‌స్టేషన్లు మొదలు అన్ని చోట్లా తమ వేగుల్ని పెట్టుకుని, చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కు, వాక్‌స్వాతంత్య్రం, ఆస్తుల్ని కలిగి ఉండే హక్కు వంటివి ఆ నియోజకవర్గంలోని ప్రజలకు వర్తించవు. గనులు వంటి సహజవనరులేవీ ప్రజలకు, ప్రభుత్వానికి దక్కకుండా వైకాపా నాయకులే దోచేసుకుంటారు. మారుమూల గ్రామంలోని ఒక వ్యక్తి ఇంటి స్థలాన్ని మెరక చేసుకోవడానికి ట్రాక్టర్‌తో గ్రావెల్‌ తోలుకోవాలన్నా ఆ ప్రజాప్రతినిధి మనుషుల అనుమతి ఉండాల్సిందే. తెదేపా మద్దతుదారులెవరైనా రెండు ట్రాక్టర్ల గ్రావెల్‌ తెచ్చుకున్నా, కేసులు పెట్టి, అరెస్ట్‌ చేయించి, చిత్రహింసలు పెడతారు.  అక్కడ అన్ని పదవులూ, కాంట్రాక్టులూ వాళ్లకే దక్కాలి. వ్యాపారాలూ వాళ్లే చేయాలి. నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అన్నదే ఉండకూడదు. ఎవరైనా ప్రశ్నించినా, ఎదిరించినా చావడానికి సిద్ధంగా ఉండాలి. వీలైతే వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ ఎవరూ పోటీ చేయనంతగా భయోత్పాతం సృష్టించి, ఏకగ్రీవం చేసుకోవాలన్నట్టుగా వారి ఎత్తుగడలు సాగుతున్నాయి. తాజాగా ఈ నియోజకవర్గంలోని ఒక మండల తెదేపా అధ్యక్షుడిపై హత్యాయత్నం జరిగింది. ఇలాంటి ఘటనలు అక్కడ నిత్యకృత్యం.

అక్రమ మద్యం వ్యాపారం.. తమ్ముడిదే రాజ్యం!

నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి తమ్ముడి కనుసన్నల్లో అక్రమ మద్యం వ్యాపారం మూడు సీసాలు, ఆరు గ్లాసులుగా వర్ధిల్లుతోంది. ప్రతి గ్రామంలోనూ మూడు నాలుగు బెల్ట్‌షాపులు నడుపుతున్నారు. ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని సొంత బార్లు, బెల్ట్‌షాపులకు తరలిస్తున్నారు. ప్రతి సీసాపై రూ.60 నుంచి రూ.120 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఆ ప్రజాప్రతినిధికి మంత్రి పదవి వస్తుందని కాన్వాయ్‌ కోసం ఆరు కొత్త వాహనాలు కొన్నారు. ఇప్పటికీ టీఆర్‌ (తాత్కాలిక రిజిస్ట్రేషన్‌) నంబర్లతోనే తిరుగుతున్న ఆ వాహనాల్లోనే తెలంగాణ నుంచి మద్యం తెచ్చి, పల్నాడు జిల్లాల్లో అక్రమంగా విక్రయిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో పోగేసుకుంటున్నారు.

  • దుర్గి మండలం అడిగొప్పులలో నిదానంపాటి అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలోనే మద్యం సీసాలు వేలాడదీసి అమ్ముతున్నా పోలీసులు పట్టించుకోరు.
  • గంజాయి, గుట్కా వ్యాపారాలు, పేకాట క్లబ్బులూ ఇవన్నీ వైకాపా నాయకులే చేస్తుండటం గమనార్హం. నిరుడు వెల్దుర్తి మండలంలో అధికార పార్టీ నాయకుడు ఒకరి దగ్గర పది కిలోల గంజాయి పట్టుబడింది.

రూ.12 వేలు కడితేనే గ్రానైట్‌ లారీ కదిలేది!

బందిపోట్లు దారి కాచి దోచుకోవడం గురించి విన్నాం. ఆ నియోజకవర్గ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి గ్రానైట్‌ లారీలు ఆ నియోజకవర్గం మీదుగా తెలంగాణకు వెళతాయి. లారీ ఆ నియోజకవర్గంలోకి ప్రవేశించిన దగ్గర ప్రజాప్రతినిధి మనుషులుంటారు. డ్రైవర్‌ వారికి రూ.12 వేలు కప్పం కట్టాలి. అది కట్టేస్తే ఆ లారీని నియోజకవర్గంలో పోలీసులు గానీ, చెక్‌పోస్టు సిబ్బంది గానీ అడ్డుకోరు. కట్టబోమని మొండికేస్తే... నియోజకవర్గ సరిహద్దు దాటక ముందే అధికారులతో దాడులు చేయించి, ఏదో ఒక వంకతో రూ.లక్షల్లో జరిమానా విధిస్తారు. కప్పం కింద రోజుకు సుమారు రూ.10 లక్షల చొప్పున ఏడాదికి రూ.36 కోట్లు రుబాబు చేసి, అప్పనంగా సంపాదిస్తున్నారన్న మాట. దీని గురించి ఎవరైనా మాట్లాడినా, ఫొటోలు, వీడియోలు తీసినా వారిని బెదిరిస్తున్నారు. దాడులు చేస్తున్నారు.

  • జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రావెల్‌ సరఫరా చేసేవారు కూడా లారీకి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు కప్పం కట్టాల్సింద

ప్రభుత్వ భూములు కనిపిస్తే.. మింగేస్తారు!

  • నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారంగా కొన్ని దశాబ్దాల క్రితం అక్కడికి దగ్గర్లోని ఎయిర్‌స్ట్రిప్‌ పక్కనే భూములు కేటాయించారు. ప్రజాప్రతినిధి మనుషులు అందులో సుమారు 200 ఎకరాలను ఆక్రమించినట్టు ఆరోపణలున్నాయి.
  • వైకాపా అధికారంలోకి వచ్చాక మలేసియా కంపెనీకి.. ఆ నియోజకవర్గంలో పరిశ్రమ ఏర్పాటు కోసం 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఆ భూమిని గుప్పిట పెట్టుకున్న ప్రజాప్రతినిధి అనుచరులు దాన్ని కంపెనీకి అప్పగించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రజాప్రతినిధితో రాయబారం నెరిపినా, ఫలితం లేదని తెలిసింది.
  • ఆత్మకూరు చెరువులోని మట్టిని ఇటుక బట్టీలకు అమ్మేసుకుంటూ అధికార పార్టీ నాయకులు ఏటా రూ.కోటి వరకు సంపాదిస్తున్నారు.

వైకాపా మాత్రమే ఉండాలి!

నియోజకవర్గంలో వైకాపానే ఉండాలి.. మరో పార్టీ పేరే వినపడకూడదన్నట్టుగా అధికార పార్టీ నాయకుల అరాచకాలు సాగుతున్నాయి. ప్రత్యర్థుల్ని బెదిరించి, భయపెట్టి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని,  నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీతోపాటు, అన్ని మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి పదవులన్నీ వైకాపాకే ఏకగ్రీవం చేసుకున్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు... ప్రజాప్రతినిధి మనుషుల ఆగడాల్ని గట్టిగా ప్రతిఘటిస్తుండటంతో ఆయనపై దాడులకు తెగబడుతున్నారు. ఆయన వెంట ఉన్న వారిని, క్రియాశీలక తెదేపా నాయకుల్ని భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి వైకాపాలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బెదిరింపుల్లో భాగంగానే ఇటీవల మాచర్లకు చెందిన తెదేపా కార్యకర్త గంగులికి చెందిన టీ స్టాల్‌ని తగులబెట్టారు. తెదేపా మాజీ కౌన్సిలర్‌ మంజుల వెంకటేశ్వర్లుకు చెందిన దుకాణాన్ని ధ్వంసం చేశారు.

  • తెదేపా నాయకులు ఏదైనా కార్యక్రమం చేపడితే.. ముందే అక్కడ అలజడి సృష్టించి, వారిపై కేసులు పెడుతున్నారు. వారి ఇళ్లలో శుభకార్యాలకు, పార్టీ కార్యక్రమాలకు కరెంట్‌ కట్‌ చేయిస్తున్నారు.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న 565 నెంబరు జాతీయ రహదారి ఆ నియోజకవర్గం మీదుగానే వెళుతోంది. సమీపంలో గ్రామాలున్నప్పుడు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారికి ఇనుప రెయిలింగ్‌ ఏర్పాటు చేస్తారు. నిబంధనల ప్రకారం దానికి పసుపు రంగు వేశారు. కానీ అది తెదేపా జెండా రంగు అని, ప్రజాప్రతినిధి పట్టుబట్టి మరీ దాన్ని మార్పించి నల్లరంగు వేయించడం వారి దాష్టీకానికి పరాకాష్ఠ.

వైకాపా కార్యకర్తల్లా పోలీసులు

  • నియోజకవర్గంలో పోలీసులు.. ప్రజాప్రతినిధి, ఆయన అనుచరుల అడుగులకు మడుగులొత్తుతున్నారు.
  • ప్రతి స్టేషన్‌లో ఉన్న హోం గార్డుల్లో ఇద్దరు ముగ్గురు ఆ నేత మనుషులుంటారు. అక్కడేం జరిగినా ఎమ్మెల్యేకి చేరవేస్తారు. అందుకే సీఐ, ఎస్సైలు కూడా వారికి భయపడుతుంటారు.
  • వైకాపా నాయకుల అరాచకాలపై.. తెదేపా మద్దతుదారులెవరైనా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే, వారిపైనే ఎదురు కేసులు పెడతారు.  
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా తరఫున నామినేషన్‌ వేద్దామనుకున్న కొందరు అభ్యర్థులకు పోలీసులే ఫోన్లు చేసి, గంజాయి వ్యాపారం చేస్తున్నావని కేసులు పెడతామని బెదిరించారు.
  • ఒక మండలంలో పోలీసు అధికారి.. వైకాపా వాళ్లపై ఫిర్యాదు చేయడానికి తెదేపా వాళ్లెవరైనా స్టేషన్‌కి వెళితే ఫిర్యాదు తీసుకోకపోగా వాళ్లు వైకాపాలో చేరే వరకు వేధిస్తారు. మండలంలో పార్టీ మారిన వారిలో 85 శాతం మంది ఆయన బాధితులే.
  • రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు షాదీఖానాలో తెదేపా ఇన్‌ఛార్జి ఇఫ్తార్‌ విందు ఇవ్వాలనుకుంటే.. అదే రోజు ఆ ప్రజాప్రతినిధి కూడా విందు  ఇస్తున్నారంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు. తిరునాళ్లకు తెదేపా నాయకులు వెళుతుంటే శాంతిభద్రతల సమస్యలు వస్తాయంటూ అడ్డుకోవడం నిత్యకృత్యం.

 



ధ్వంసాలు.. విధ్వంసాలు

  • గత ఏడాది జనవరి 2న దుర్గి గ్రామంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని.. జడ్పీటీసీ సభ్యుడు శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు అందరూ చూస్తుండగానే ధ్వంసం చేశారు. మాచర్ల మార్కెట్‌ యార్డ్‌ దగ్గర ఎన్టీఆర్‌ విగ్రహాన్ని, మరోచోట ఉన్న తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను కూడా ధ్వంసం చేశారు.
  • దుర్గి మండలం జంగమహేశ్వరంపాడు, వెల్దుర్తి మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలో తరచూ వైకాపా వారు దాడులకు తెగబడుతుండటంతో తెదేపా మద్దతుదారులు కుటుంబాలతో గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. ఒత్తిడి తట్టుకోలేక మరికొందరు వైకాపాలో చేరారు.
  • కారంపూడి మండలం మిరియాల గ్రామంలో తెదేపా ఇన్‌ఛార్జిని ట్రాక్టర్‌లో ఊరేగించినందుకు అదే రోజు రాత్రి ట్రాక్టర్‌కు నిప్పంటించారు.
  • తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఏదో ఒక కేసు పేరుతో స్టేషన్‌కు పిలిపించి పోలీసులతో కొట్టిస్తున్నారు. ఆ దారుణాన్ని వైకాపా నాయకులు దగ్గరుండి చూసి ఆనందిస్తుంటారని సమాచారం.

అంతులేని దోపిడీ.. భూ కబ్జాలు!

  • నియోజకవర్గంలో నర్సరీలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిరాకరిస్తే దాడులు చేయించి మూయిస్తారు. ఒక గ్రామంలో తెదేపా సానుభూతిపరుడికి చెందిన నర్సరీని వైకాపా ఎంపీపీ కుమారుడు మూయించారు. నర్సరీ యజమాని రూ.4 లక్షలు సమర్పించుకున్నాకే అనుమతిచ్చారు. అదే గ్రామంలో తెదేపా మద్దతుదారులకు చెందిన పురుగుమందుల దుకాణంపై దాడులు చేయించారు. రూ.40 లక్షలైనా కట్టండి, పార్టీ అయినా మారండని బెదిరించడంతో వారు మూడు నెలల క్రితం వైకాపాలో చేరారు.
  • నియోజకవర్గ కేంద్రంలో ఖాళీ స్థలం కనపడితే చాలు వైకాపా నాయకులు రాత్రికి రాత్రే నాలుగు ట్రక్కుల నాపరాళ్లు తెచ్చి పోస్తున్నారు. వారి పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించుకుంటున్నారు. దాని యజమానులు ప్రజాప్రతినిధినో, ఆయన తమ్ముడినో కలిసి కప్పం కడితేనే స్థలం తిరిగి వచ్చినట్లు.  
  • పట్టణంలో ఒక వ్యక్తి చనిపోతే సమీప బంధువుల పేరుతో నకిలీపత్రాలు సృష్టించి రూ.10 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
  • ఏదైనా ఆస్తి విషయంలో అన్నదమ్ములు గొడవపడినా వైకాపా వాళ్లు వాలిపోయి వివాదాన్ని పెద్దది చేసి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు.

అపార్ట్‌మెంట్‌ కడితే... రూ.30 లక్షలు ఇవ్వాల్సిందే!

  • నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం, దుకాణం ప్రారంభించినా ప్రజాప్రతినిధిని పిలవాల్సిందే. ఆయనకు, ఆయన సోదరుడికి బహుమతులు సమర్పించుకోవాల్సిందే.  
  • ఎవరైనా బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ కట్టాలంటే ప్రజాప్రతినిధికి ముందుగా రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కప్పం కట్టాలి. అప్పుడే అనుమతులు వస్తాయి. లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలన్నా, మున్సిపాలిటీ, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనులు చేయాలన్నా ఆయనకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే.
  • రేషన్‌ బియ్యం సేకరణ, రవాణా ఒక్కో మండలంలో ఒక్కో నేతకు అప్పగించి నెలవారీ కప్పం కట్టించుకుంటున్నారు.
  • ప్రజాప్రతినిధి ఏ కార్యక్రమం తలపెట్టినా మిల్లర్లు రూ.లక్ష చొప్పున సమర్పించుకోవాలి.
  • చివరకు ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే డబ్బుల్లోనూ వైకాపా నాయకులు కమీషన్లు కొట్టేస్తున్నారు.

పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల గొంతులు కోయడం, విపక్ష పార్టీ జెండా పట్టుకుంటే ఇళ్లు, దుకాణాలు తగలబెట్టేయడం, స్టేషన్‌కు వెళ్లే బాధితులపైనే హత్యాయత్నం వంటి కేసులు పెట్టడం, ఎన్నికల్లో నామినేషన్‌ వేద్దామనుకున్న ప్రతిపక్ష నాయకులను బెదిరించి అక్రమ కేసులు పెట్టించి, ఊళ్ల నుంచి వెళ్లగొట్టడం, సహజ సంపదను అడ్డగోలుగా దోచేయడం, భూముల ఆక్రమణలు, ఆస్తుల కబ్జాలు.. ఇలా అక్కడ జరగని అరాచకం లేదు.


సెటిల్‌మెంట్ల దందాలు, ప్రతిపక్ష నాయకులపై దాడులు

ఆ నియోజకవర్గంలో ఆటవిక పరిస్థితి

గుడిలో ఉద్యోగుల దగ్గర నుంచి.. మద్యం విక్రయించే వ్యాపారుల వరకు ఇక్కడ అంతా అధికార పార్టీ వారే అయి ఉండాలి. లేదంటే వారి ఆస్తులపై దాడులు, తప్పుడు కేసులు, వేధింపులు మొదలైపోతాయి. ఆస్తి పంపకాలు, సెటిల్‌మెంట్ల దందాలో ఇక్కడి వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ మునిగి తేలుతుంటారు. రాష్ట్రం అంతా ఒకలా ఉంటే ఇక్కడ మరో రాజ్యాంగం అమల్లో ఉంటుంది. ఆ రాజ్యంలో చోటుచేసుకుంటున్న అకృత్యాలు మచ్చుకి కొన్ని...

  • నిదానంపాటి అమ్మవారి ఆలయం దగ్గర కొబ్బరికాయలు, పూజసామగ్రి కొట్లూ అధికార పార్టీ నాయకులవే. ఒక్కో కొబ్బరికాయ, పసుపు, కుంకుమలతో కూడిన పూజా సామగ్రిని రూ.60-70కి విక్రయిస్తున్నారు.
  • ఆలయంలో పూజారులు, సన్నాయి ఊదేవారు కూడా అధికార పార్టీవారే.
  • అమ్మవారి ఆలయం ముఖ్య అధికారి ఒకరు... వైకాపా కార్యకర్తలా పనిచేస్తారు. ఆ ప్రజాప్రతినిధి ఇంట్లో ఏ పూజలైనా ఆయనే దగ్గరుండి జరిపిస్తారు.
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో కారంపూడిలో తెదేపా బీసీ నాయకుడు గోరంట్ల నాగేశ్వరరావుపై వైకాపా నేతలు దాడి చేశారు.
  • మాచర్ల రింగ్‌రోడ్డు వద్ద తెదేపా నాయకుడు రమణ కారును అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు.
  • కారంపూడి బస్టాండ్‌ సెంటర్లో తెదేపా మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణపై వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
  • రెంటచింతల పట్టణంలో పోలీస్‌స్టేషన్‌ మార్గంలో ఉన్న ముఖద్వారం వైసీపీ నాయకులు అక్రమంగా ధ్వంసం చేస్తున్నారని తెలిసి తెదేపా నాయకులు గొంతు సుమంత్‌రెడ్డి అనుచరులు ప్రతిఘటించడంతో వారిపై కర్రలు రాళ్లతో వైకాపా నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ముఖద్వారం పూర్తిగా ధ్వంసం చేశారు.
  • నియోజకవర్గంలోని మండలం మండాదిలో ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంపకాలు చేసుకున్నారు. తమ్ముడు కరోనాతో చనిపోతే అన్న తరఫున వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. తమ్ముడి ఆస్తిలో తనకు ఇంకా రావలసింది ఉందంటూ... బలవంతంగా దాన్ని లాక్కున్నారు. ప్రస్తుతం అన్నదమ్ములకు చెందిన 12 ఎకరాల్ని వైకాపా నాయకులే సాగు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు వైకాపా నాయకులకు అండగా ఉన్నారు.
  • నియోజకవర్గ కేంద్రంలో ఒకరు పురుగుమందుల వ్యాపారం చేస్తూ ఐపీ పెట్టారు. ఆయన కండ్లకుంట గ్రామానికి చెందిన ఒకరికి రూ.70 లక్షలు బాకీ ఉన్నారు. దీంతో పురుగుమందుల వ్యాపారికి బావ వరసయ్యే... కండ్లకుంట గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి బలవంతంగా ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. ఆ మర్నాడు దానిపై ప్రజాప్రతినిధి పంచాయతీ చేశారు. సెటిల్‌మెంట్‌ ఏం జరిగిందో బయటకు రానివ్వలేదు.
  • ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల నుంచి ఏవైనా సర్టిఫికెట్లు కావాలన్నా వైకాపా నాయకుల సిఫారసు ఉండాల్సిందే.
  • తెదేపా నాయకులు ఫ్లెక్సీలు పెడితే చించేస్తారు. అదే వైకాపా నాయకుల ఫ్లెక్సీలను మాత్రం పట్టించుకోరు.
  • వైకాపా, తెదేపా నాయకులపై ఏదైనా గొడవ జరిగి పరస్పరం ఫిర్యాదు చేసుకుంటే.. తెదేపా నాయకులపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం నేరం కింద, వైకాపా నాయకులపై సెక్షన్‌ 324 కింద మారణాయుధాలతో దాడి చేశారంటూ కేసులు పెడతారు.
  • తెదేపా నేత ఒకరికి పట్టణంలోని రింగ్‌రోడ్డులో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ ఉంది. ఆయనకు, తోడల్లుడి కొడుక్కి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. తోడల్లుడి కొడుకు 2021లో కరోనాతో చనిపోయారు. ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి ఆ వ్యక్తి భార్యతో తెదేపా నేతపై కేసు పెట్టించారు. ఆయన తమకు డబ్బులు ఇవ్వాలని, అడిగితే దాడి చేశారని కేసు పెట్టారు. తెదేపా నేత.. తోడల్లుడి కొడుక్కి ఇవ్వాల్సిన సొమ్ముకు కొంత వడ్డీ కలిపి చెల్లించడమే కాదు.. లోక్‌అదాలత్‌లో పెట్టి కేసు కొట్టేయించుకున్నారు. కానీ ఇప్పటికీ ఆ అప్పు పేరు చెప్పి తెదేపా నేతను ఇబ్బంది పెడుతున్నారు. బలవంతంగా ఫ్లాట్‌ ఖాళీ చేయించి, ప్రజాప్రతినిధి మనుషులు ఆక్రమించారు. బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు.
  • తెదేపా మద్దతుదారులకు వినాయకచవితి పందిళ్ల ఏర్పాటుకు, తిరునాళ్లలో ప్రభలకూ అనుమతివ్వరు.
  • ఒక గ్రామానికి చెందిన గ్రామకంఠం భూమికి కొందరు వైకాపా నాయకులు వారి పేరుమీద పాసుపుస్తకాలు పుట్టించి, బ్యాంకు నుంచి రుణం కూడా తీసేసుకున్నారు. పత్రికల్లో వార్తలు రావడంతో దాన్ని మళ్లీ ప్రభుత్వ భూమిగా మార్చేశారు. ఆ రుణం మాత్రం తీర్చలేదు.

ప్రశ్నిస్తే పీకలు కోస్తారు

2019 సంవత్సరంలో వైకాపా అధికారం చేపట్టగానే ఆ పార్టీ ముఠాలు తెదేపా మద్దతుదారుల్ని గ్రామాల నుంచి తరిమికొట్టాయి. హత్యలకు తెగబడ్డాయి. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నాయకుడు తోట చంద్రయ్యను వైకాపా నాయకులు పట్టపగలే నడిరోడ్డుపై పీక కోసి చంపేశారు. జూన్‌లో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను గ్రామ వైకాపా నాయకుడు హత్య చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు