CID Sanjay - AAG Ponnavolu: దిల్లీలో సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలు ప్రెస్‌మీట్‌.. తెలుగు మీడియా వద్దు..

ఏపీసీఐడీ అధికారులకు తెలుగు మీడియా అంటేనే భయం పుడుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నా ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్‌లలో ప్రెస్‌మీట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు..

Published : 19 Sep 2023 01:08 IST

జాతీయ మీడియాకే అనుమతి అంటూ ఆంక్షలు

ఈనాడు, దిల్లీ: ఏపీసీఐడీ అధికారులకు తెలుగు మీడియా అంటేనే భయం పుడుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నా ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్‌లలో ప్రెస్‌మీట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అశోకాలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్‌మీట్‌ ఏర్పాటుచేసి తాము ఎంపిక చేసుకున్న ఇంగ్లిషు, హిందీ పత్రికలు, టీవీలకు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన దిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా తెలుగు మీడియాను పిలవలేదని.. ఎందుకు వచ్చారంటూ అక్కడున్న సీఐడీ అధికారులు, ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖల సిబ్బంది అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజాధనంతో పెట్టే ప్రెస్‌మీట్‌కు తెలుగు మీడియాను ఎందుకు రానివ్వరని మీడియా ప్రతినిధులు నిలదీయడంతో తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, తామేమీ చేయలేమని వారు చేతులెత్తేశారు. ఎక్కడినుంచి ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారో తెలపాలని ఒత్తిడి చేసినా వారు నోరు మెదపలేదు. విలేకరుల సమావేశానికి సంబంధించి గది ముందు ఏర్పాటుచేసిన బోర్డును అక్కడినుంచి తీసేశారు. ఆహ్వానం అందని ఇతర ఇంగ్లిషు, హిందీ పత్రికలు, టీవీ మాధ్యమాల విలేకర్లనూ లోపలికి అనుమతించలేదు. ఈ సమావేశానికి కొంత ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ఇక్కడికి వచ్చారు. ‘మీరు సీనియర్‌ జర్నలిస్టు.. జర్నలిస్టు సంఘం నాయకుడు. తెలుగు మీడియాకు అనుమతి ఇవ్వకపోవడమేంట’ని ఆయన్ని తెలుగు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేస్తూ ప్రెస్‌మీట్‌ గదిలోకి వెళ్లిపోయారు. తర్వాత సీఐడీ చీఫ్‌ సంజయ్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వచ్చారు. తాము ఎందుకు సమావేశానికి రాకూడదని తెలుగు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నా సమాధానం ఇవ్వకుండానే వారు లోనికి వెళ్లిపోయారు. తెలుగు మీడియాకు ప్రవేశం లేదని చెప్పిన అధికారులు సాక్షి టీవీ ప్రతినిధిని మాత్రం అనుమతించారు. దీనిపై ప్రశ్నించినా సీఐడీ, ప్రభుత్వ అధికారులు నోరు మెదపలేదు. దిల్లీలో విలేకరుల సమావేశానికి తెలుగు మీడియాతోపాటు మలయాళీ మీడియానూ రానివ్వవద్దని సీఐడీ అధికారులు ఆదేశించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రియాశీలకంగా ఉండే మలయాళీ మీడియా ప్రతినిధులు లోతైన ప్రశ్నలు వేస్తారనే భయంతోనే వారిని దూరంగా పెట్టినట్లు భావిస్తున్నారు. ఏపీ భవన్‌లో ఉచితంగా విలేకరుల సమావేశం పెట్టుకునే అవకాశమున్నప్పటికీ భారీగా ఖర్చయ్యే ఫైవ్‌స్టార్‌ హోటల్లో ఏర్పాటు చేశారు.

ప్రధాన కుట్రదారు చంద్రబాబు: సీఐడీ చీఫ్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రధాన కుట్రదారు మాజీ సీఎం చంద్రబాబేనని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ఆరోపించారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 13 సందర్భాల్లో చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. ప్రతి దశలోనూ కలగజేసుకొని సంతకాలు పెట్టారు’ అని సంజయ్‌ వివరించారు. సంతకాలు పెట్టిన మిగిలిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని విలేకరులు ప్రశ్నించగా.. సంతకాలు పెట్టినందుకే అరెస్టు చేస్తామా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌కు నోటీసు ఇచ్చామని, ఆ వెంటనే ఆయన దేశం విడిచి అమెరికా వెళ్లిపోయారని తెలిపారు. అందుకే తదుపరి చర్య చంద్రబాబు అరెస్టుకు కారణమైందని అన్నారు. కేసులో అరెస్టయిన వారిలో ఏడుగురు యాంటిసిపేటరీ బెయిల్‌ పొందారని, మరో ఏడుగురిని ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు. అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు అరెస్టు చేయలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అజేయకల్లం నాడు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారని తెలిపారు. ప్రేమచంద్రారెడ్డి తన బాస్‌గా ఉన్న ముఖ్యమంత్రి ఎక్స్‌అఫీషియో చీఫ్‌ సెక్రటరీ ఘంటా సుబ్బారావు మార్గదర్శకత్వంలో పని చేశారని తెలిపారు. రాజకీయ ఒత్తిడితోనే చంద్రబాబును అరెస్టు చేశారా? అని విలేకరులు ప్రశ్నించగా తాము తొలుత ఇది కార్పొరేట్‌ అంశం అనుకున్నామని, చివరకు రాజకీయ కోణం తేలిందని వివరించారు.


ఎంత తేడా..

సుమన్‌ బోస్‌ సమావేశానికి సాక్షి సహా విలేకరులందరికీ ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారాలపై విలేకర్లకు వివరించడానికి ఆదివారం దిల్లీలో ఒకవైపు సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌బోస్‌; ఏపీసీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ సుధాకర్‌రెడ్డి పెట్టిన విలేకరుల సమావేశాల మధ్య ఎంతో తేడా కనిపించింది. ఉదయం ఇక్కడి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సుమన్‌బోస్‌ విలేకరుల సమావేశానికి తెలుగు, జాతీయ మీడియా ప్రతినిధులందరినీ ఆహ్వానించారు. స్వేచ్ఛగా ప్రశ్నలు అడగడానికి సాక్షి టీవీ ప్రతినిధికి అవకాశమిచ్చారు. అందరికంటే ఆ సంస్థ విలేకరే ఎక్కువ ప్రశ్నలు వేసినా ఎవరూ వారించలేదు. ఆ తర్వాత అడిగిన విలేకర్లందరికీ ఆయన ముఖాముఖి ఇంటర్వ్యూలనూ ఇచ్చారు. ఏ విషయంలోనూ తడబడలేదు. ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ పెట్టిన పెట్టిన విలేకర్ల సమావేశానికి మాత్రం తెలుగు మీడియాను అడ్డుకున్నారు. సీఐడీ అధికారి ఒకరిని ద్వారం ఎదుట నిలబెట్టి మరీ నిలువరించారు.


సంజయ్‌ విలేకర్ల సమావేశంలో ఓ మూలన సీఎంఓ అధికారి

చంద్రబాబు అరెస్టు అంశం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం ఎంతగా జోక్యం చేసుకుంటోందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. జాతీయ మీడియాకు వివరాలు వెల్లడించడానికి సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ సుధాకర్‌రెడ్డి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ అవినాష్‌ ఇరగవరపు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ఓ వైపున కూర్చున్నారు. తెలుగు మీడియాను అనుమతించని సీఐడీ పోలీసులు మాత్రం వీరిని సాదరంగా ఆహ్వానించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సీఐడీ విధుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యానికి ఈ చిత్రం తార్కాణంగా నిలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని