అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు.
రిజిస్ట్రేషన్ ముసుగులో వైకాపా నేతల దందా
శ్రీకాళహస్తిలో పార్టీ అనుయాయులకు ప్రత్యేక కోటా
కర్నూలు జిల్లాలో పొసెషన్ సర్టిఫికెట్ల జారీ
మచిలీపట్నంలో నకిలీ పత్రాల పంపిణీ
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-శ్రీకాళహస్తి: ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వేనంబర్లతో నకిలీ పట్టాలను సృష్టించి ఇస్తూ అమాయకులను దగా చేస్తున్నారు. చివరకు వైకాపా ప్రజాప్రతినిధులు చెప్పినవారి పేర్లే భూరికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. ఈ అక్రమాలకు రెవెన్యూ అధికారులు వంత పాడుతున్నారు. రాష్ట్రంలోని జగనన్న లేఅవుట్లలో కొన్ని ప్లాట్లను తమ ఆధీనంలోనే వైకాపా ప్రజాప్రతినిధులు ఉంచుకున్న సంఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి అక్రమాలు ఎక్కువగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ఏర్పేడు తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు పాత తేదీలతో అక్రమాలను కొనసాగించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు జగనన్న కాలనీలో సుమారు 350, ఏర్పేడు మండలం చిందేపల్లి జగనన్న కాలనీలో 150 వరకు ప్లాట్లను స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు స్వాధీనం చేసుకుని అనుచరులకు కేటాయించారు. రాజీవ్నగర్లో జగనన్న కాలనీకి అనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 150 మంది అనుచరులకు పంచారు. ఏర్పేడు మండలం వికృతమాలలోని జగనన్న కాలనీలోనూ వందల్లోనే పట్టాలను వైకాపా వారికి పంచిపెట్టారు. బడా నేతలకు కాలనీ వెలుపల ఉన్న ప్రభుత్వభూమిని కేటాయించారు. ఈ భూములు పొందినవారు ప్లాట్లుగా విభజించి సెంటు రూ.3లక్షల చొప్పున విక్రయించుకున్నారు. ఒంగోలులోనూ పార్టీ అనుయాయులకు ప్లాట్లు కేటాయించారు. వారి వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. కొన్నిచోట్ల రికార్డుల్లో పేర్లు ఉన్నా స్థలం కేటాయించలేదు. స్థలం కేటాయించినా లబ్ధిదారుల పేర్లు రికార్డుల్లో లేవు.
నిబంధనలు బేఖాతరు
రేషన్కార్డు, ఆధార్, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు ధ్రువపత్రం, కుటుంబ యజమాని ఎక్కడా ప్రభుత్వ ఇల్లు పొందకుండా ఉంటేనే జగనన్న కాలనీలో ఇల్లు పొందేందుకు అర్హుడవుతారు. ఈ నిబంధనలేవీ వైకాపా నాయకులకు అమలవడం లేదు. నేతలు చెప్పినవారే లబ్ధిదారులవుతున్నారు. వీరికి స్థిరచరాస్తులు ఉన్నా పేదలుగానే చెలామణి అవుతున్నారు. రెవెన్యూ అధికారులు సంతకాలు పెడుతుంటే ఇతర వివరాలను వైకాపా నేతలు నమోదు చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
లబ్ధిదారులు కాకున్నా పునాదుల కోసం గుంతలు తవ్వారు!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాయకరావుపేట మండలం సీతారామపురానికి చెందిన సుమారు 40 మందికి స్థానిక వైకాపా నేతలే జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు కేటాయించారు. లబ్ధిదారులను నేతల అనుచరులు స్వయంగా స్థలాల వద్దకు తీసుకెళ్లి పునాదుల కోసం గుంతలు తీయించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో ప్రస్తుతానికి పనులు నిలిచాయి.
- శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురంలో అర్హుల జాబితాను సిద్ధం చేసినప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. ఇంటింటికి అందిన సంక్షేమ పథకాలపై తయారుచేసిన కరపత్రంలో మాత్రం ఇద్దరు లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని ఇచ్చినట్లు చూపించారు.
- కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారం పంచాయతీ సర్వేనంబరులో 28 మందికి పొసెషన్ సర్టిఫికెట్లను పది రోజుల కిందట రాత్రికి రాత్రి తయారుచేసి మండల వైకాపా నేతలు అందజేశారు. వారు చాలాకాలం నుంచి ఈ భూమిలోనే ఉంటున్నందున సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమర్థించుకుంటున్నారు. ఇక్కడ సెంటు ధర రూ.3 లక్షల వరకుంది. వాస్తవానికి ఈ భూమి అనుభవదారులు ఎవరూ లేరు.
వివరాల నమోదులో ఎన్నెన్నో లోపాలు
తిరుపతి జిల్లాలో 6 వేలు, ప్రకాశం జిల్లాలో 4 వేలు, అనంతపురం జిల్లాలో 3,500, కాకినాడ- 3,300, ఎన్టీఆర్-3,277, నంద్యాల-2,900, విశాఖపట్నం-2,642, అన్నమయ్య-2,600, ఏలూరు-2,500, పశ్చిమగోదావరి-2,200, కోనసీమ-2,100, విజయనగరం జిల్లాలో 2,000 మంది లబ్ధిదారుల వివరాలు గందరగోళంగా ఉన్నాయి. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈ కన్వేయన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ల వల్ల లబ్ధిదారులకు అదనపు ప్రయోజనం లేకున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ల ముసుగులో స్థానిక ప్రజాప్రతినిధులు పేట్రేగిపోతున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగాలి, చిందేపల్లి జగనన్న కాలనీల్లో తిరుపతి, రేణిగుంట ప్రాంతాలకు చెందినవారికి కొత్తగా పట్టాలివ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు జగనన్న కాలనీల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించనందున వారు అడ్డుకుంటున్నారు.
లబ్ధిదారులు ఏమయ్యారు..?
ఇంటి పట్టాలు పొందినవారికి ‘కన్వేయన్స్ డీడ్’ రూపంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. పట్టాలు పొందినవారిలో ప్రస్తుతం లక్షన్నర మంది వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీరిలో సుమారు 50 వేల మంది మరణించారు. వీరికి వారసులు లేకపోవడం లేదా అనర్హులవడం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొలిక్కిరాలేదు. తిరుపతి జిల్లాలో వీరి సంఖ్య 12,804, చిత్తూరు జిల్లాలో 11,049 వరకు ఉండడం గమనార్హం. కడప జిల్లాలో 9,800, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలలో 3వేల మందికి రిజిస్ట్రేషన్లు నిలిచాయి. ఆవాస ప్రాంతాలకు దూరంగా స్థలాలివ్వడంతో లబ్ధిదారులు ముందుకురాని సంఘటనలూ ఉన్నాయి.
అక్రమార్కులకు రిజిస్ట్రేషన్లు
అన్నమయ్య జిల్లా పీలేరు-మదనపల్లె మార్గంలోని ఏపీఐఐసీ లేఅవుట్-3లో పదినెలల కిందట 1,700 మందికి ఇళ్ల స్థలాలనిచ్చి ప్లాట్నంబరుతో కూడిన స్లిప్పులను ‘డిప్’ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. వీరిలో కొంతమందికి పట్టాలిచ్చి మరికొందరికి ఇవ్వలేదు. ఈ లేఅవుట్లోనే 250 ప్లాట్నంబర్లతో కూడిన స్లిప్పులు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లాయి. డిప్ ద్వారా స్లిప్పులు పొందిన అర్హులకు కేటాయించిన స్థలాల మ్యాపింగ్ నత్తనడకన సాగుతోంది. అక్రమంగా స్లిప్పులు పొందినవారికి మాత్రం రిజిస్ట్రేషన్లు అయ్యాయి.
చర్యలు ఎక్కడ?
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని సుమారు 20 డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు వెయ్యికిపైగా నకిలీ పట్టాలను పేదలకు ఇచ్చారు. వీటిపై విచారణ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రాలేదు. మచిలీపట్నంలో కొంతమందికి రోడ్ల పక్కనున్న ఖాళీ స్థలాలకు నేరుగా పట్టాలిస్తున్నట్లు ప్రజాప్రతినిధుల అనుచరులు పత్రాలను అందజేశారు. పత్రాల్లో కొన్నింటికి సర్వేనంబర్లు వేశారు. భూరికార్డుల్లో మాత్రం ఆ సర్వేనంబర్లు లేవు. కొన్నింట్లో సర్వేనంబర్లు తప్పుగా ఉన్నాయి. పట్టాలపై ప్రభుత్వ ముద్ర, తేదీలు లేవు. తహసీల్దార్ సంతకాలున్నాయి. అధికారికంగా ఇచ్చే పట్టాల్లో స్థల వివరాలు, సరిహద్దులు, లేఅవుట్ నంబరు, ఇతర వివరాలు ప్రభుత్వసీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. తహసీల్దార్ కార్యాలయ భూరికార్డుల్లోనూ నమోదు చేయాలి. ఇవి సంపూర్ణంగా లేకుండా పత్రాలను ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. బదిలీపై వెళ్లిన తహసీల్దార్ సునీల్బాబు సంతకం ఒకటే కొన్ని పత్రాల్లో కనిపిస్తోంది. మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా అక్రమ ఇళ్లపట్టాల తయారీ కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,455
-
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
-
పారితోషికం మరిచిపోయారా సారూ..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం