ఆర్‌బీఐ మెప్పించింది

రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలను ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నిర్ణయాలు ఒడ్డున పడేశాయి. వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని ఆర్‌బీఐ తగ్గించడంతో ఐటీ, ఫైనాన్స్‌, చమురు షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.

Updated : 09 Feb 2023 03:26 IST

సమీక్ష

రెండు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలను ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నిర్ణయాలు ఒడ్డున పడేశాయి. వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని ఆర్‌బీఐ తగ్గించడంతో ఐటీ, ఫైనాన్స్‌, చమురు షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్లు రాణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలపడి 82.54 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 60,332.99 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల జోరు కొనసాగడంతో ఇంట్రాడేలో 60,792.10 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 377.75 పాయింట్ల లాభంతో  60,663.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 150.20 పాయింట్లు పెరిగి 17,871.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,744.15- 17,898.70 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 3.14%, అల్ట్రాటెక్‌ 2.47%, రిలయన్స్‌      1.99%, ఇన్ఫోసిస్‌ 1.75%, విప్రో 1.57%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.50%, టీసీఎస్‌ 1.38%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌     1.32%, టాటా మోటార్స్‌ 1.11%, టెక్‌ మహీంద్రా   0.93% చొప్పున రాణించాయి. ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ మాత్రం నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. కమొడిటీస్‌ 2.28%, ఐటీ 1.51%, ఆరోగ్య సంరక్షణ 2.28%, లోహ 1.04%, టెక్‌ 1.09% మెరిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు పడ్డాయి. బీఎస్‌ఈలో 1914 షేర్లు లాభాల్లో ముగియగా, 1587 స్క్రిప్‌లు నష్టపోయాయి. 130 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

రాణించిన అదానీ షేర్లు: బుధవారం ఎక్కువ శాతం అదానీ గ్రూప్‌ షేర్లు పరుగులు తీశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 19.76% దూసుకెళ్లి రూ.2,158.65 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ 8.34% పెరిగి రూ.599.45 దగ్గర స్థిరపడింది. అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ విల్మర్‌, ఎన్‌డీటీవీ 5 శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద ముగిశాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌  5%, అదానీ గ్రీన్‌ 4.92%, ఏసీసీ 1.11% చొప్పున నష్టపోయాయి. గత రెండు రోజుల్లో అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు రూ.70,000 కోట్లు పుంజుకుంది.

అయినా కూడా హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన (జనవరి 24 నుంచి) ఇప్పటివరకు అదానీ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.8.7 లక్షల కోట్ల మేర క్షీణించింది.

త్రైమాసిక లాభం తగ్గడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ షేరు 0.42% తగ్గి రూ.250.10 వద్ద ముగిసింది. హీరో మోటోకార్ప్‌ షేరు 1.51% నష్టపోయి రూ.2,613.65 దగ్గర స్థిరపడింది.

బ్రిటన్‌ ఆర్థిక సేవల సంస్థ ఫీనిక్స్‌ గ్రూప్‌ వినియోగదారు సేవలు మెరుగుపరిచేందుకు 600 మిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.5,986 కోట్ల) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టీసీఎస్‌ ప్రకటించింది.

కేజీ-డీ6 బ్లాక్‌లోని రిలయన్స్‌-బీపీకి చెందిన భారీ ఎంజే డీప్‌-వాటర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు బీపీ గ్రూప్‌ ప్రాంతీయ అధ్యక్షుడు, హెడ్‌ ఆఫ్‌ కంట్రీ శశి ముకుందన్‌ తెలిపారు.


నేటి బోర్డు సమావేశాలు: అరబిందో ఫార్మా, కిమ్స్‌, నాట్కో ఫార్మా, రెయిన్‌బో హాస్పిటల్స్‌, ఎల్‌ఐసీ, లుపిన్‌, ఎంఆర్‌ఎఫ్‌, హిందాల్కో, హెచ్‌పీసీఎల్‌, ఎస్‌ఎంఎస్‌ ఫార్మా, బజాజ్‌ కన్జూమర్‌, బాంబే డైయింగ్‌, దేవయానీ ఇంటర్నేషనల్‌, ఫోర్స్‌ మోటార్స్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, ఐఆర్‌సీటీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, పరాస్‌ డిఫెన్స్‌, ఫైజర్‌, రైట్స్‌,  సుజ్లాన్‌, వోల్టాస్‌, ఉజ్జీవన్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, జొమాటో


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని