Samsung: శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌..!

Samsung mobiles: శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్‌-ఇన్‌ సూచించింది.

Published : 15 Dec 2023 02:13 IST

Samsung | ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్‌ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ (CERT-In) సూచించింది.

నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్‌ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. ఈ లోపాల కారణంగా అటాకర్లు భద్రతాపరమైన అడ్డంకులు అధిమించి సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం పొంచి ఉందని తన నోట్‌లో పేర్కొంది. ఒకవేళ ఆయా ఉత్పత్తుల్లో ఉన్న లోపాలను గుర్తించి చొరబడితే డివైజ్‌ పిన్‌ను, ఏఆర్‌ ఎమోజీ సాండ్‌బాక్స్‌ డేటాను అటాకర్లు రీడ్‌ చేయగలరు. సిస్టమ్‌ టైమ్‌ను మార్చి నాక్స్‌ గార్డ్‌ లాక్‌ను బైపాస్‌ చేయగలరు. అర్బిట్రరీ ఫైల్స్‌, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది.

శాంసంగ్‌ లేటెస్ట్‌ ఫోన్లు అయిన గెలాక్సీ ఎస్‌23, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5 సహా ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14తో పనిచేసే డివైజుల్లో ఈ లోపం ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. కాబట్టి యూజర్లు ఫోన్‌ సెట్టింగ్స్‌లోని అబౌట్‌ డివైజ్‌లోకి వెళ్లి లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ సూచించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫోన్‌ అప్‌డేట్ చేసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్‌ చేయకూడదని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని