RBI: మళ్లీ వడ్డీరేట్లు పెరిగాయ్‌.. రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ..!

ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. కాకపోతే ఈ సారి పెంపు వేగాన్ని కొంత తగ్గించింది. ప్రస్తుతం దీంతో రెపోరేటు 6.50 శాతానికి చేరింది. 

Updated : 08 Feb 2023 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అంచనాలకు తగినట్లే మరోసారి వడ్డీరేట్ల (interest rates)ను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.  దీంతో కీలక వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకొన్నాయి. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను నేడు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) లోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు సమర్థించినట్లు పేర్కొన్నారు. 2023లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 6వ తేదీన ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షా సమావేశం మొదలైన విషయం తెలిసిందే.

డిసెంబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటు 35 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతానికి చేర్చారు. అంతకు ముందు వరుసగా 3 సమీక్షల్లో 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. ఈ సారి పెంపు వేగం కొంత తగ్గి 25 బేసిస్‌ పాయింట్లకే పరిమితమైంది. రివర్స్‌ రెపోరేటు 3.35లో ఎటువంటి మార్పులు చేయలేదు. దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం శాంతిస్తుండటం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లపై మధ్యస్థ వైఖరి ప్రదర్శిసుండటంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును స్వల్పంగా పెంచింది. గత ఏడాది మే నుంచి 225 బేసిస్‌ పాయింట్లు రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ తాజాగా మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచడం ద్వారా 6.5 శాతానికి చేర్చింది.

సవాలుగా ద్రవ్య పరపతి విధానం..

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు ద్రవ్యపరపతి విధానాన్ని సవాలుగా మార్చేశాయని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. చాలా రంగాల్లో భారత్‌ భాగస్వామ్యం కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయన్నారు. చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా భవిష్యత్‌ అంచనాలు అస్పష్టంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ అప్రమత్తంగానే ఉన్నట్లు వెల్లడించారు. తగినంత నగదు ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉందని దాస్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగు త్రైమాసికాల్లో భారత్‌ పరిస్థితి నిలకడగానే ఉందని అభిప్రాయపడ్డారు. 2023-24లో ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మార్జినల్‌ స్టాండింగ్‌ రేటును 6.75గా మార్చినట్లు పేర్కొన్నారు. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ రేట్‌ను 6.25కు సర్దుబాటు చేశామన్నారు. 2023 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 7శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనావేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని