Indian Economy: సంపన్నులు భారత్‌ను ఎందుకు వీడుతున్నారు..?

భారత్‌ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. అంటే ఇక్కడ పెట్టుబడి కొత్త దారులు తెరుచుకొంటుండగా.. మిలియనీర్ల సంఖ్య

Published : 24 Jun 2022 17:32 IST

 ఐరోపా దేశాల వైపు మొగ్గు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. పెట్టుబడులకు కొత్త బాటలు పడుతున్న క్రమంలో మిలియనీర్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఒక విషయం ఆందోళన కలిగిస్తోంది. భారీ ఎత్తున సంపన్నులు దేశాన్ని వీడి విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. గ్లోబల్‌వెల్త్‌ రివ్యూ ప్రకారం 2020 ప్రకారం సంపన్నుల్లో 2శాతం భారత్‌ను వీడారు. సంపన్నులు స్వదేశాలను వదిలేస్తున్న జాబితాలో చైనా టాప్‌లో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది. చైనా నుంచి 16,000 మంది వెళ్లిపోగా.. భారత్‌ నుంచి 7,000 మంది వెళ్లిపోయారు. మూడోస్థానంలో ఉన్న రష్యా నుంచి 5,500 మంది వెళ్లిపోయారు. 

భారత్‌ నుంచి సంపన్నుల వలసలకు సామాజిక, ఆర్థిక కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సౌకర్యవంతమైన జీవన శైలి, విద్య అవసరాలు, సంపదలో కొంత భాగాన్ని మళ్లించడానికి, ప్రయాణాల్లో సౌకర్యానికి, ప్రపంచ మార్కెట్లలో అడుగుపెట్టడానికి, దీంతో పెట్టుబడులను వివిధ ప్రాంతాలకు మళ్లించి స్థానిక మార్కెట్లలో ఉండే ఒడిదొడుకులను తట్టుకోవడానికి వలస వెళుతుంటారు. సంపన్నుల వలసలు ఎప్పుడూ ఒకే ప్రాంతానికి ఉండవు. గతంలో అత్యధికంగా అమెరికాకు చెందిన ఈబీ-5 ప్రోగ్రాం కింద వలస వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఎక్కువగా ఐరోపా దేశాలకు వెళ్తున్నారు. వీటిల్లో పోర్చుగల్‌, మాల్టా, స్పెయిన్‌ వంటివి ఉంటున్నాయి. దుబాయ్‌, సింగపూర్‌ వంటి సమీప దేశాలకు కూడా భారతీయులు వెళ్తున్నారు.

సంపదను మొత్తం వేర్వేరు ప్రదేశాల్లో, వివిధ రంగాల్లో,  పలు రకాల ఆస్తులపై పెట్టుబడిగా పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. కానీ, అప్పుడు పోర్టుఫోలియోలు రిస్కును తట్టుకొని నిలబడతాయి. సంపద నిర్వహణలో ప్రత్యామ్నాయ గృహం (మరో పౌరసత్వం) అత్యంత కీలకమైంది. ఇలా వారి కోసం పలు దేశాలు పెట్టుబడులు తెచ్చేవారికి పౌరసత్వం ఇచ్చే ప్రోగ్రామ్‌లు కూడా ప్రారంభించాయి. 

ఐరోపా దేశాల వైపు ఎందుకు మొగ్గు..

ఇటీవల భారతీయులు పెట్టుబడులు తీసుకెళ్లి పౌరసత్వం తీసుకొంటున్న దేశాల్లో పోర్చుగల్‌ టాప్‌లో ఉంది. పోర్చుగల్‌ ఆర్‌బీఐ (రెసిడెన్సీ బై ఇన్వెస్ట్‌మెంట్‌) చాలా మందిని ఆకర్షిస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా గ్లోబల్‌ టాలెంట్‌ ఇండిపెండెంట్‌ వీసా, అమెరికా ఈబీ-5, మాల్టా పర్మెనెంట్‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌, గ్రీస్‌ ఆర్‌బీఐ ఉన్నాయి.

* పోర్చుగల్‌ గోల్డెన్‌ రెసిడెన్సీ పర్మిట్‌ ప్రోగ్రాం కింద కనీసం 2,80,000 యూరోలను రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెడితే అక్కడ నివశించడానికి అనుమతి లభిస్తుంది. దీంతో వారు అక్కడ విద్యాభ్యాసం, ఉద్యోగం చేయవచ్చు. అదే సమయంలో ఐరోపా సమాఖ్యలోని 26 దేశాల్లో వీసాలేకుండా ప్రయాణించవచ్చు. ఐదేళ్ల తర్వాత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొన్న వ్యక్తి పూర్తికాలం అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఓ రెండు వారాలు అక్కడ గడిపినా సరిపోతుంది. దీంతోపాటు దరఖాస్తులు కూడా అత్యంత వేగంగా ప్రాసెస్‌ అవుతాయి. ఇక్కడ కొనుగోలు చేసే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తికి డిమాండ్‌ ఉండటం, క్రిప్టోలతో కూడా సులభంగా చెల్లింపులు జరగడం వంటి అంశాలు కూడా ఆకర్షణీయంగా మారాయి.

* మరో ఐరోపా దేశం మాల్టాలో కనీసం 1,75,000 యూరోలను పెట్టుబడి పెట్టాలి. వారికి ది మాల్టా పర్మినెంటట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ కింద పర్మిట్‌ ఇస్తారు. ఈయూ దేశాల్లో ప్రయాణానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈయూలో తక్కువ జీవన వ్యయంతో నాణ్యమైన సౌకర్యాలు సమకూరే దేశాంగా దీనికి పేరుంది. ఇక్కడి ప్రజలు ఇంగ్లిష్‌ మాట్లాడటం కూడా విదేశీయులు స్థిరపడటానికి కారణమవుతోంది. ఇది ఐరోపా, ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండటంతో వ్యాపారవేత్తల ప్రయాణ సమయాలను తగ్గించేస్తోంది. 

* ది గ్రీస్‌ గోల్డెన్‌ వీసా ప్రోగ్రామ్‌ కింద కనీసం 2,50,000 యూరోలు పెట్టుబడి పెట్టాలి. ఈ వీసా కింద వచ్చిన వారికి వేగంగా పౌరసత్వం లభిస్తుంది. వీరు ఐరోపా సమాఖ్య దేశాల్లో వీసా రహితంగా పర్యటించడంతో పాటు.. రాయితీపై లభించే వైద్య సౌకర్యాలు, విద్యను పొందవచ్చు.

* అమెరికాలో ఈబీ-5 వీసా కింద పెట్టుబడిదారులు తొందరగా గ్రీన్‌కార్డు పొందవచ్చు. అతనితో పాటు అతని భార్య, 21ఏళ్లలో పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. కనీసం 8లక్ష డాలర్లను పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అమెరికాలో ఉద్యోగ కల్పన కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. 

ఇతర కారణాలు..

* యువ వ్యాపార వేత్తలు ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలనుకొంటారు. ఈ నేపథ్యంలో విదేశీ పౌరసత్వాలు తీసుకొంటున్నారు. 

* వివిధ దేశాల్లో లభించే పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు వ్యాపార వేత్తలను ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు సంపదలో కొంత భాగాన్ని మళ్లిస్తున్నారు. 

* భారత్‌లో 2020, 2021లో పన్ను చట్టాలను మరింత కఠినతరం చేశారు. అవి సంపన్నులకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వడంలేదు. మిలయనీర్లు దేశం వీడటానికి ఇది ప్రధాన కారణంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. 

* వీసా రహిత ప్రయాణాలు కూడా సంపన్నులను ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు విదేశాల్లో ప్రత్యామ్నాయ పౌరసత్వాలు తీసుకొంటున్నారు. 

* మ్యూనిచ్‌ పనిచేసే ఇంటర్నేషనల్‌ పత్రిక ప్రకారం విదేశాల్లో పనిగంటలు చాలా సౌకర్యవంతంగా ఉండటం, మెరుగైన పని వాతావరణం వంటివి కూడా ఆకర్షిస్తున్నాయి. 

ఇటీవల హెన్లీ గ్లోబల్‌ సిటిజెన్స్‌ రిపోర్టు కూడా 2022లో దాదాపు 8,000 మంది సంపన్నులు భారత్‌ను వదిలి వెళ్లిపోవచ్చని పేర్కొంది. వీరిలో కూడా కొత్త సంపద దాచుకున్న వారే అధికంగా ఉండొచ్చని పేర్కొంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాల్లో యూఏఈ, సింగపూర్‌ ముందు వరసలో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని