Petrol Price: పెట్రో ధరలు మళ్లీ పెరుగుతాయా? నిపుణులు ఏమన్నారంటే..

రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరుగుతాయని ఇంధన రంగ నిపుణులు నరేంద్ర తనేజా అంచనా వేశారు....

Published : 05 Nov 2021 16:14 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటడంతో ఆందోళన చెందిన సామాన్యులకు దీపావళి పర్వదినం సందర్భంగా కేంద్రం తీపి కబురు తెలిపిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి భారాన్ని కాస్త దింపింది. అయితే, ఈ ఉపశమనం తాత్కాలికమేనని ఇంధన రంగ నిపుణులు నరేంద్ర తనేజా అంటున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు.

దేశీయ అవసరాల్లో 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు తనేజా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌-సప్లయ్‌కి అనుగుణంగా ధరలు మారుతుంటాయని తెలిపారు. ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభమే కారణమని వెల్లడించారు. గిరాకీకి అనుగుణంగా సరఫరా లేకపోతే.. అనివార్యంగా ధరలు పెరుగుతాయన్నారు. అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ఓ కారణమన్నారు. కేవలం పునరుత్పాదక, హరిత ఇంధనంపైనే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కొన్ని నెలల్లో ఇంధన ధరలు మరింత పెరుగుతాయన్నారు. 2023 నాటికి లీటర్‌ ముడి చమురు ధర మరో రూ.100 ఎగబాకే అవకాశం ఉందన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కనిష్ఠానికి చేరినప్పుడు కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచి ఆదాయం సమకూర్చుకుందన్నారు. ఇప్పుడు ధరలు మళ్లీ పెరుగుతుండడంతో తగ్గించిందని తెలిపారు. ఇది సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. అలాగే గతకొన్ని నెలల జీఎస్టీ వసూళ్లు.. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తున్నాయన్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి తగ్గి.. సుంకం తగ్గింపునకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తేనే.. సామాన్యులకు నిజమైన ఊరట లభిస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని