logo

జాబ్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం..

ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్రం తాజాగా మరో మార్పు చేసింది. కూలీల జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు.

Published : 23 Jan 2023 04:33 IST

ఉపాధిహామీ వేతనాల్లో పారదర్శకతకు అవకాశం
ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అనుసంధాన అంశంపై ఉపాధి

సిబ్బందికి సూచనలిస్తున్న ఏపీవో చంద్రశేఖర్‌

పాధిహామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్రం తాజాగా మరో మార్పు చేసింది. కూలీల జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు. జిల్లాలో ప్రస్తుతం తపాలాశాఖ, బ్యాంకులద్వారా కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. తపాలా చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుండటం, ఒక్కోసారి ఇతర ఖాతాల్లో డబ్బులు జమ కావడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి పొరబాట్లకు అడ్డుకట్ట వేసేలా కేంద్రం ఆధార్‌ అనుసంధాన చెల్లింపు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఫిబ్రవరి నుంచి కొత్త విధానంలోనే చెల్లింపులు జరిగేలా ఆదేశాలు జారీ చేసింది.

ఉపాధిహామీ పథకం అమలులో పారదర్శకత కోసం ఇప్పటికే  పలు సంస్కరణలు చేపట్టింది. తాజాగా కూలీ డబ్బులు చెల్లింపు విషయంలో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేసింది. మొదట ఉపాధి పనులకు వచ్చేవారి జాబ్‌కార్డుల్లోని సభ్యులకు సంబంధించి అనుసంధానం చేయాలని ఆదేశించింది. జిల్లాలో 1,80,500 మంది కూలీలకు మొదట అనుసంధానం చేయాలని లక్ష్యం నిర్దేశించింది. దీంతో క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు, మేట్లు కూలీల ఆధార్‌, జాబ్‌కార్డుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 1,19,081 మందివి అనుసంధానం కోసం అంతర్జాలంలో నమోదు చేశారు. ఇంకా 56,654 మందివి నమోదు చేయాల్సి ఉంది. మృతిచెందిన వారి వివరాలను తొలగిస్తున్నారు. ఈ నెల చివరి వరకు ఇవి పూర్తయితే.. వచ్చేనెల నుంచి ఆధార్‌ అనుసంధాన విధానంలో కూలీ డబ్బుల చెల్లింపులు జరుగుతాయి. అనుసంధానం కాకుంటే నిలిచిపోయే అవకాశం ఉంది.

నకిలీలకు అడ్డుకట్ట..

జిల్లాలో మేజారిటీ కూలీలకు తపాలాశాఖ ద్వారా ఉపాధి కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 గ్రామపంచాయతీలకు ఒకే బీపీఎం కూలీ డబ్బులు చెల్లిస్తున్నారు. వేల సంఖ్యలో కూలీలు ఉండటంతో.. చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. పైగా కొన్నిచోట్ల కూలీల నుంచి కమీషన్‌ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇవే కాకుండా నకిలీలకు అడ్డుకట్ట పడుతుంది. ఆధార్‌ అనుసంధానంతో నిజమైన కూలీ ఖాతాలోకే డబ్బులు చేరనున్నాయి.

సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు..

ఆధార్‌ అనుసంధానం చేస్తున్న క్రమంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. ఆధార్‌కార్డు మార్చుకున్న వారిలో ఏవైనా స్వల్ప తేడాలంటే.. అలాంటివి అనుసంధానం కావడంలేదు. జాబ్‌కార్డులో, ఆధార్‌ కార్డులోని పేరులో ఏ మాత్రం తేడా వచ్చినా అనుమతించడం లేదు. వివాహమై కుటుంబ జాబ్‌కార్డు నుంచి తొలగించి, కొత్తగా వచ్చిన భాగస్వామితో కొత్త జాబ్‌కార్డు తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటి విషయంలో వివరాలు నమోదు చేసి ఎంపీడీవోల సిఫార్సుతో డీఆర్‌డీవో లాగిన్‌కు అక్కడి నుంచి డీపీసీ లాగిన్‌కు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్కడ పరిష్కారం కాని వాటిని రాష్ట్రస్థాయికి పంపించాల్సి ఉంటుంది.


సర్వే కొనసాగుతోంది..

సురేందర్‌, డీఆర్‌డీవో

ఉపాధి కూలీల వేతన చెల్లింపులో ఇబ్బందులు రాకుండా ఆధార్‌ ఆనుసంధానం చేస్తున్నాం. ఆధార్‌ కార్డులోని వివరాలు, ఇదివరకున్న  వివరాల్లో తేడా ఉంటే కూలీ డబ్బుల చెల్లింపు నిలిచే అవకాశం ఉంది. ఇలాంటివి తలెత్తకుండా జాబ్‌కార్డు కలిగిన ప్రతీ కూలీ ఆధార్‌ అనుసంధానం చేసేలా సర్వే కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని